కవితను పక్కలో బల్లెంలా భావిస్తోంది బీఆరెస్. ఆ పార్టీకి కవిత పార్టీ టీఆరెస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీని ఎంతైనా విమర్శిస్తున్నారు గానీ, కవిత పార్టీ జోలికి వెళ్లడం లేదు. ఆమె నిత్యం ఏదో ఒక ఇష్యూలో బీఆరెస్ను టార్గెట్ చేస్తున్నది. ఆ పార్టీ పదేళ్ల పాలన లోపాలు, పాపాలు ప్రజలకు ఎలా శాపాలుగా మారాయో.. వివరించి చెప్పడంలో, వాటిని మళ్లీ గుర్తు చేయడంలో సఫలీకృతులవుతున్నారు. తన పార్టీ పేరును టీఆరెస్గా తీసుకోవడంలోనే ఆమె బీఆరెస్పై తొలి విజయం సాధించారు. ఇక అప్పట్నుంచి ఆమె దూకుడు మరింత పెంచారు.
పార్టీ పెట్టగానే తొలిసారిగా నిర్వహించిన బహిరంగ సభ.. పాలమూరు వేదికగా.. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపైనే పెట్టారు. ఈ వేదికగా ఆమె సాగునీటి రంగ ప్రాజెక్టుల విషయంలో బీఆరెస్ చేసిన నిర్లక్ష్యం, అవినీతి, అధికార దుర్వినియోగం, రైతులకు చేసిన మోసం.. అన్నీ వివరించడం చర్చనీయాంశమైంది. దీంతో పాటు ఆమె ప్రత్యేకంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆరెస్ అధికారంలో ఉండీ.. పనిగట్టుకుని చేసిన తప్పిదాలు, అవినీతికి పాల్పడి రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల రైతులకు చేసిన తీరని నష్టం గురించి చేసిన ప్రసంగం కలకలం రేపింది. జూరాల రిజార్వాయర్ సోర్స్ నుంచి నీటిని తీసుకోకుండా, శ్రీశైలం ప్రాజెక్టును ఎంచుకోవడం, హరీశ్రావు అక్కడి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఎత్తు పెంచడంతో రావాల్సిన నీటిని తెలంగాణకు తరలించకపోవడం తదితర తప్పిదాలన్నీ బయటపెట్టారామె. దీన్ని బీఆరెస్ చేసిన చారిత్రక తప్పిదంగా అభివర్ణించారామె.
తొలిసారిగా ఆమె పెట్టిన సభ.. అందులోనూ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినది.. ఇంకా మరీ ముఖ్యంగా.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదంగా ఆమె వర్ణించడం.. ఇవన్నీ టీఆరెస్ను కలవరపాటుకు గురి చేశాయి. ఆపై ఆమె సర్కార్కు కూడా అల్టిమేటం జారీ చేశారు. పాలమూరు- రంగారెడ్డ ప్రాజెక్టు విషయంలో సర్కార్ నుంచి కదలిక లేకపోతే.. దసరా తరువాత తనే పాదయాత్ర చేసి.. ఈ సాగునీరు ద్వారా లబ్దిపొందాల్సిన చుట్టుపక్కల గ్రామాలన్నీ పాదయాత్ర చేస్తానని ఆమె ప్రకటించి ఉన్నారు. అయితే దీనిపై ఆ తరువాత బీఆరెస్ పార్టీ ఏ మాత్రం స్పందించలేదు. కవితను పల్లెత్తు మాట కూడా అనలేదు. ఏకంగా కేసీఆర్కు ఆయువుపట్టు లాంటి సాగునీటి రంగానికి సంబంధించే ఆమె ఆరోపణలు చేయడం.. ఆ పార్టీ అధిష్టానంలో కూడా తీవ్ర చర్చకు దారి తీసింది.
ఆచితూచి ఆలోచనతో అడుగేయాలని భావించిన కేసీఆర్.. మొత్తానికి తన పార్టీ ద్వారా అక్కడ పాదయాత్ర చేయాలని తాజాగా నిర్ణయించారు. కవిత చేసిన నష్టానికి నివారణగా, తమ పాలనపై వస్తున్న ఆరోపణలకు దిద్దుబాటుగా ఈ పాదయాత్ర బాట సాగనుందని చెప్పకనే చెప్పింది ఆ పార్టీ. దీనిపై కవిత భగ్గుమన్నారు. టీఆరెస్ పార్టీ నేతలు ఇవాళ ప్రెస్మీట్ పెట్టి.. బీఆరెస్ అధిష్టానాన్ని తీవ్రంగా విమర్శించారు. కవిత పాదయాత్ర అనగానే ఉలిక్కిపడి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని, పదేళ్లు మీకు అధికారం ఇస్తే.. ఈ ప్రాజెక్టుకు ఏం చేశారని .. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అక్కడ పాదయాత్ర చేస్తారని మండిపడ్డారు. ఈ సాగునీటి ఫైట్ ముందు ముందు ఈ రెండు పార్టీల మధ్య మరింత ముదరనుంది.