Hospitality Training: స్వేచ్ఛ బ్యూరో: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కవేలి చౌరస్తాలో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ భవనంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యాటక వారోత్సవాలలో పాల్గొన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (ఎస్ఐహెచ్ఎం) సంస్థను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసేందుకు రూ.5 కోట్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టిన బేకరీ, కన్ఫెక్షనరీ కోర్సులను అయన ప్రారంభించారు. వీటితో పాటు నిథమ్ విద్యా సంవత్సరానికి సంబంధించిన బీబీఏ, ఎంబీఏ కోర్సుల అడ్మిషన్లను లాంఛనంగా ప్రారంభించారు.పర్యాటక శాఖ రూపొందించిన ‘టూరిస్ట్ గైడ్ పోస్టర్ను ఆవిష్కరించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా నిరుపయోగంగా ఉన్న ఎస్ఐహెచ్ఎంను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత యువతీ యువకుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించి, వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలనే ఉద్దేశంతో దశాబ్దాల క్రితం ఈ సంస్థను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
Also Read: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!
ఎస్ఐహెచ్ఎంలో చేరిన పేద విద్యార్థులకు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు, వారికి స్టైఫండ్ అందించే దిశగా ప్రభుత్వం తగిన కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థులు కేవలం కోర్సులకే పరిమితం కాకుండా భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, విదేశీ భాషలను కూడా నేర్చుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, మార్కెట్లో ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఆధునిక కోర్సులను చేర్చాలని నిథమ్ డైరెక్టర్ వెంకటరమణను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, నిథమ్ డైరెక్టర్ వెంకట రమణ, మాజీమంత్రి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ యునుస్, ఆత్మ చైర్మన్ రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also read: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సర్కార్ కొత్త రూల్.. ఈ మూడు కీ పాయింట్స్ మస్ట్..?