ఒకేసారి ఇద్దర్నీ అర్సుకున్నారు కవిత. జనం ఏమనుకుంటున్నారో అదే ఆమె నోటి వెంట వచ్చిందనుకోవాలి. ఇద్దరి పాలన చూసిన జనం.. ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయాలపై ఓ అభిప్రాయానికి వచ్చారు. పదేండ్లలో ఏం జరిగింది? ఏం జరగలేదు? ఇప్పుడు రెండున్నరేండ్లుగా ఆశించినవి జరిగినవా? ఆశల్లోనే ఉన్నామా? అంత క్లారిటీగా ఉంది.
ఇరువురి పాలనలపై ఓ స్పష్టతకు వచ్చారు. ఇద్దరు సీఎంల వైఖరిపై ఓ క్లారిటీతో ఉన్నారు. దాదాపుగా ఇదే అంశంపై కవిత మాట్లాడారు ఇవాళ. ముందుగా కేసీఆర్ గురించి ఆమె ఏమన్నారో చూద్దాం. జనం బాధలు పట్టించుకోకుండా.. ఇంటికే మేం పరిమితం కాలేదన్నారు. అంటే ఇది పరోక్షంగా కేసీఆర్ను ఉద్దేశించి.. ఆయన ఫామ్హౌజ్కే పరిమితమైన ఉదంతం గురించి. ప్రజల గురించి పట్టించుకోకుండా.. వారి బాధలను లెక్క చేయకుండా.. అని కూడా ఆమె అన్నమాటలకు అర్థం కూడా తెలుసుకుందాం.
ఓడిన తరువాత కేసీఆర్.. అటు పిమ్మట పదే పదే కేటీఆర్.. ఓ మాటంటున్నారు. తాము ఏమీ తప్పు చేయలేదని, తమ పాలనలో అసలు లోపాలే లేవని, ప్రజలే తమను ఓడగొట్టి తప్పు చేశారని, ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని.. ఇలా అంతా జనం మీదే తోసేశారు. తమ ఓటమిలో వారికి ఏమాత్రం సంబంధం లేదట.
ఇంకా ఏమన్నారిద్దరు? కత్తి వాడికిచ్చి మమ్మల్ని యుద్దం చేయమంటే ఎలా? అని. అంటే అధికారం రేవంత్కు ఇచ్చారుగా.. ఆ రేవంతు పాలన ఇబ్బందులు పెడుతుంటే.. ఇప్పుడు మేం గుర్తుకొచ్చామా? చావండి.. అనుభవించండి..! అని దీని అర్ధమన్నమాట. దీన్నే కవిత ఇలా సంక్షిప్తంగా చెప్పారన్నమాట.
అంటే మేము మీలా జనం బాధలు పట్టించుకోకుండా లేము. జనంలోనే ఉన్నాము. ఇంటికే పరిమితం కాలేదు. జనం బాధలు తెలుసుకోవడమే కాదు.. వాటికి పరిష్కారం లభించే దాకా పోరాడుతున్నాం కూడా..! అని ఆమె ఇటు తిడుతూనే అటు తమ పార్టీ చేస్తున్న పనులను జనాలకు వివరిస్తున్నారు. ఇక ఇప్పుడు రేవంత్ గురించి ఆమె ఏమన్నారంటే..!
ఎప్పుడూ ఆ పదేళ్ల పాలనను తిడుతూనే టైం పాస్ చేస్తారా? వారి లోపాలనే ఏకరువు పెడుతూ ఉంటారా? కేసీఆర్ను తిట్టుకుంటూనే కాలం గడుపుతారా? అని ఆమె తాజాగా కామెంట్ చేశారు. అవును.. నిజమే..! జనానికి కూడా బోర్ కొట్టింది. ఓడగొట్టాం.. అయిపోయింది. ఆయన అనుభవిస్తున్నాడు. ఓటు ద్వారా శిక్ష వేశాం. నువ్వేదో చేస్తావని నిన్ను గెలిపించాం.. అది ఆలోచించు! అచ్చం జనం మనసులో ఉన్నదే కవిత కూడా అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, ఇచ్చిన హామీలు.. వాటి గురించి ఆలోచించు.. వివరించు.. జనంలో ఉన్న వ్యతిరేకత పోగొట్టుకో..! రేవంత్ సర్కార్కు ఆమె ఓ హితబోధ చేసినట్టే చెప్పారు.అంతేకాదు… హామీలు అమలు చేసేదాకా ఊరుకునేది లేదు.. వెంటాడి హామీలు అమలు చేపించుకుంటాం.. పోరాటాలు చేస్తాం.. మెడలు వంచుతామని కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు.
రైతు పండుగ అని ఓ మీటింగు పెట్టాడు రేవంత్. రైతుల గురించేమో గానీ.. కేసీఆర్ను పొల్లు పొల్లు తిట్టుడుకే సరిపోయింది సమయం. తాగుబోతన్నాడు. పశుపతి అన్నాడు. అప్పుల ఊబిలో ముంచి పోయాడన్నాడు. బికారీ గాళ్లను చేశాడన్నాడు. తెలంగాణను దివాళా సంసారంగా మార్చేశాడన్నాడు.
పోయినోడి గురించి ఇంకెన్ని రోజులు చెబుతావే రేవంత్ అన్నా..! నీకు అప్పగించినం.. రాష్ట్రాన్ని. ఎట్లా సమర్థవంతంగా పాలించి.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావో.. నీ చేతిలో ఉంది! అది ఆలోచించు..! చెప్పిందే చెప్పింది.. పాడిందే పాటరా.. అన్నట్టు చేస్తే.. ఇప్పటికే సగం పరిపాలన ముగిసింది. చూస్తుంటే ఆ సగం కూడా ముగుస్తుంది. కథ క్లైమాక్స్కు వస్తుంది.. ! అందుకే తీరు మార్చుకోమంటున్నారు కవిత. జనం కూడా.