ఆయనెప్పుడూ అంతే. లేటుగా స్పందిస్తారు. కొంచెం నిర్లక్ష్యమూ తోడే వుంటుంది. ఏమవుతుందిలేననే అతి విశ్వాసమూ అందుకు కారణమే. నోటికొచ్చిందీ మాట్లాడేస్తాడు. ఏ పరిస్థితుల్లో అది ఏ వేదికని కూడా చూడకుండా. అయితే అతిగా స్పందించడం.. లేదంటే అసలే స్పందించకపోవడం.. రెండూ ఆయనగారి లోపాలే. నే చెప్పేది మంత్రి పొన్నంగారి గురించి. మంత్రి అడ్లూరి లక్ష్మారెడ్డి విషయంలో నోరుజారి నానా రభసకు కారణమై ప్రతిపక్షాలకు చిక్కిన మంత్రి.. ఆ తరువాత అప్పుడప్పుడూ వార్తల్లో మెరుస్తూ వస్తున్నాడు.
మొన్నటి ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనూ ఆయన తీసుకున్న లైట్ విధానం, చేతులెత్తేసే దోరణి సర్కార్కు చెడ్డపేరే తెచ్చిపెట్టింది. అసలు సమ్మెదాకా పోనియకుండా చూడాల్సింది. కానీ పొన్నం మాటలు.. బాధ్యతగా అన్ని వినకపోవడం.. మీ ఇష్టం.. మాతో ఇదే అవుతుందనే దురుసు మాటల ప్రవర్తన ఇవన్నీ.. కార్మికులకు మరింత కోపాన్ని తెచ్చిపెట్టాయి. దీంతో సమ్మెకు పోవడం.. కార్మికుడు తగులబెట్టుకుని చనిపోవడం.. ఇవన్నీ సర్కార్ను తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి. మంత్రి దగ్గరే తేలాల్సిన ముచ్చట.. అక్కడే ఆ సమస్యకు పరిష్కారం చూపాల్సిన సందర్భం.. తన చేతగానితనంతో రచ్చ చేసి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారాడు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగితే గానీ దీనికి ఫుల్స్టాప్ పడలేదు.
ఆలోపు జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది.దీన్ని చక్కదిద్దుకునేందుకు సర్కార్ నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీనికి కారణం ఆమాత్యుల వారే. ఇక తాజాగా ఈ డ్రైవర్ ఉదంతం. అతన్ని డ్యూటీలో నుంచి తీసేశారని అంతా గగ్గోలు పెట్టి… సోషల్ మీడియాలోపెంట పెంట చేసిన తరువాత మెల్లగా.. తీరుబడిగా వచ్చి ఓ వీడియో రిలీజ్ చేసి అయిందనిపించాడు. మధ్యాహ్నం నుంచే ఇది పెద్ద రచ్చగా మారింది. జగిత్యాల జీవన్రెడ్డి దీనిపై పెద్ద ప్రకటన కూడా చేశాడు. అతన్ని మేము అధికారంలోకి రాగానే పర్మినెంట్ చేస్తామన్నాడు.
అన్నీ మేమే చూసుకుంటాం.. మా పార్టీ అండగా ఉంటుందన్నాడు. రెండేండ్ల పాటు ఆర్థిక సాయం చేస్తామని .. ఇంకా ఏమేమో హామీలు ఇచ్చేశాడు. అయినా మంత్రి నుంచి కానీ, కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. అంతా మౌనంగా చూస్తుండిపోయారు. కనీసం పొన్నం ప్రభాకర్ టీం కూడా రంగంలోకి దిగలేదు. దీన్ని చక్కదిద్దే పనికి పూనుకోలేదు. తీరా మంత్రే రావాల్సి వచ్చింది. ఆలోపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఆ డ్రైవర్తో ఫోన్లో మాట్లాడాడు. నేను, మా పార్టీ నీకు అండగా ఉంటుంది.
అన్ని రకాలుగా అండగా ఉంటాం.. భయపడకు.. వారితో ఏం కాదు.. ఏం పీక్కోలేరు.. అంటూ ఏవేవో మాట్లాడిన మాటలను రికార్డు చేసి దాన్ని బీజేపీ టీం వైరల్ చేసేసుకున్నది. ఇటు బీఆరెస్, అటు బీజేపీ దీన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న తరువాత మెల్లగా మేల్కొన్న మంత్రి .. ఇదీ సంగతి.. ఇదీ నిజం.. ఆయన రైతుల గురించే మాట్లాడాడు కాబట్టి ఆహ్వానిస్తున్నాం.. అని ప్రశాంతమైన చిత్తంతో వీడియో విడుదల చేసి వెళ్లిపోయారు. ఇదీ సంగతి.