అష్టవంకరలతో కూడిన, అవినీతిమయంగా మారిన, అధికారం దర్పంతో కూడిన అహంకారపూరిత పాలన … బీఆరెస్ను ఓడించింది. ఫామ్హౌజ్కు పరిమితం చేసింది. ఇది అందరికీ తెలుసు. కానీ ఇంత ఘాటుగా చెబితే మింగుడుపడకపోవచ్చు. కానీ వాస్తవాలు చేదుగా ఉంటాయి. అధికారం పోయిన తరువాత కేటీఆర్ మేల్కొన్నాడు. కనువిప్పు కలిగింది. పరివర్తన చెందాడు. దీంట్లో అనుకుంటున్నారు? తమలోని లోపాలు, పాపాల గురించిన చింతనలో కాదు. దానికి ఇప్పటికీ వారిలో కించిత్ కూడా బాధ లేదు.
అది పదే పదే పలు వేదికల మీద బయట పడుతూనే ఉన్నది. మరి దేంట్లో అనుకుంటున్నారు. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావడానికి, వచ్చేందుకు దోహదపడేది ఒక్క సోషల్ మీడియా మాత్రమేనని గుర్తించడంలో. ఇదే ఆయన పదేళ్ల తన ఎక్స్పీరియన్స్లో, ఓడిన ఫ్రష్ట్రేషన్లో కనిపెట్టిన మహత్తరమైన నిజం. దీన్ని ఫాలో చేస్తూ.. దీనికి పురుడు పోసేందుకు కోట్లు వెచ్చించినా నష్టం లేదనుకున్నాడు. అయినా నష్టమెందుకుంటుంది? కోట్లాది రూపాయలు అప్పనంగా సంపాదించి పెట్టుకున్న తరువాత. ఓడిన వెంటనే ఓ మాటన్నాడు కేటీఆర్!
గుర్తుందా మీకు? మేము జిల్లాకో మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి ఆలోచించినం… అదే ఓ మూడు వందల యూట్యూబ్ చానెళ్లు పెట్టి ఉంటే.. మాకీ దుస్థితి వచ్చేది కాదు.. అని! అంటే దానర్థం ఏంటీ? రేవంత్ సర్కార్ కేవలం సోషల్మీడియా వల్ల, యూట్యూబ్లలో చేసిన ప్రచారం వల్లే గెలిచిందని! అంటే పూర్తిగా అబద్దాల ప్రచారాలు చేసి, జనాన్ని తప్పుదోవ పట్టించి గెలిచారనేది ఆయనగారి ఉవాచ. అంటే నిస్సుగ్గుగా ప్రజాతీర్పును కించపరిచినట్టే మాట్లాడాడు కేటీఆర్. నిజానికి, రేవంత్ సర్కార్ సోషల్ మీడియా వెన్నుదన్నుగా నిలిచింది. కాదనలేం.
కానీ, అప్పటి బీఆరెస్ పాలన లోపాలను ఎత్తి చూపడంలో అది చేసిన కార్యక్రమాలు ప్రచారాలు ఇతోధికంగా రేవంత్కు ఉపయోగపడ్డాయి. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటుకు అదీ ఓ కీలక చర్యే. కాదనలేం! కానీ మరీ ప్రజా తీర్పును కించపరిచేలా మాట్లాడిన కేటీఆర్.. ఆ వెంటనే తను చేసిన అద్బుత మహాయజ్ఞం ఏమిటయా! అంటే.. చకా చకా తన సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం. అంటే అప్పటి వరకు ఆయనకు సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్సే లేవా? అంటే.. చాలా ఉన్నాయి. కానీ ఇవి చాలవని గ్రహించాడు కేటీఆర్. అందుకే యూట్యూబర్లను వెతికి పట్టుకున్నాడు. ఇతర చానెళ్లలో పనిచేసే వారికి ఎరవేశాడు. లక్షల జీతాలిచ్చాడు.
మెయిటెన్స్, ఆఫీస్ ఎస్టాబ్లిష్, ఖర్చులకు లక్షలు ఖర్చు పెట్టాడు. డిజిటల్ పేపర్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. రోజుకో వార్త వండి వార్చి ప్రజల మైండ్ ఫ్రై చేసేందుకు రెడీగా ఉంటాయి. వీటన్నింటి కోసం కేటీఆర్ చేస్తున్న ఖర్చు నెలకు.. కోట్లాది రూపాయలు. ఇవన్నీ తన సొమ్ము కాదు కదా. అప్పనంగా తన పదేళ్ల పాలనలో సంపాదించినవే. ప్రజల సొమ్మే. ఇక అసలు విషయానికొద్దాం. మొన్న బండి సంజయ్ విషయంలో కొడకు కేసును సాకుగా చూపి.. బండిని రాజకీయంగా బజారులోకి లాగినంత పనిచేశాడు కేటీఆర్.
మైనర్ బాలిక ఇష్యూ అని కూడా చూడలేదు. తన టార్గెట్, తన శత్రువు బండి సంజయ్. అంతే రెచ్చిపోయాడు. వాల్ పోస్టర్లు అతికించాడు. తన సోషల్మీడయా టీమ్ను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇదే పనిలో ఉంచాడు. ఫేక్ వార్త కథనాలు వండి వార్చాడు. పెంట పెంట చేశాడు. తన ఆలోచనను పెంటగా మార్చుకున్నాడు. ఇదేం చెత్త రాజకీయం అన్నా పట్టించుకోలేదు. చిల్లర ప్రచారమన్నా డోంట్ కేర్ అన్నాడు. ఇప్పుడు దీనిపై బండి పోరాటం మొదలు పెట్టాడు. కేటీఆర్ తో పాటు ఆయన ఫేక్ మీడియా సామ్రాజ్యంపై దండయాత్ర షురూ చేశాడు. న్యాయపరంగా వీరిపై కేసులు పెట్టేందుకు సిద్దమయ్యాడు. ఇది ఎక్కడి వరకు పోతుంది? ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.