తెలంగాణపై తేజస్వీ సూర్య చేసిన కామెంట్లు.. తెలంగాణ బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీన్ని సమర్థించుకోలేక, సర్దిచెప్పలేక నానా అవస్థలు పడ్డారు ఆ పార్టీ ఎంపీలు, రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రారావు. ఓవైపు బీఆరెస్, మరోవైపు కాంగ్రెస్తో పాటు ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు బీజేపీని తీవ్రంగా విమర్శించారు. ఎంపీల మౌనంపై మరింత మండిపడ్డారు. సమర్థించే వారి దోరణనిని ఎండగట్టారు. తేజస్వీ దిష్టబొమ్మను కూడా దహనం చేసి.. ఆందోళనకు దిగారు.
ఓ వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దీన్ని సమర్థించుకుని, సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా.. ఎవరూ వినలేదు. చివరకు ఇది మోడీ, అమిత్ షాల దర్శకత్వంలోనే జరిగిందని, వారి సూచన మేరకే తేజస్వీ తెలంగాణపై ఈ వ్యాఖ్యలు చేశారనే దాకా వెళ్లింది. గతంలో కూడా మోడీ తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలే చేసి ఉన్న నేపథ్యాన్ని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి సైతం సభలో ఈ వ్యాఖ్యల నేపథ్యాన్ని వివరించే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. మరింత తాకిడి పెరిగిందే కానీ తగ్గలేదు. కిషన్ రెడ్డిని పై కూడా మాటల దాడిని కొనసాగించారు తెలంగాణకు చెందిన నేతలు, సోషల్ మీడియా ఆక్టివిస్టులు. దీంతో ఆ పార్టీ అధిష్టానం చక్కదిద్దే పనికి పూనుకున్నది. తేజస్వీతోనే మాట్లాడి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటన్నట్టు ప్రకటింపజేసింది. కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం ఇక్కడ జరిగిపోయింది.
తెలంగాణ పై బీజేపీ స్టాండ్ మారదని, సమయం వచ్చినప్పుడల్లా ఇలా మనసులోని విషాన్ని బయటకు కక్కేస్తారనే అభిప్రాయానికి వచ్చింది తెలంగాణ సమాజం. తెలంగాణ ఏర్పడి ఇన్ని ఏండ్లు అవుతున్నా.. మళ్లీ పదే పదే దాని ప్రస్తావన తీసుకురావడమెందుకని బీజేపీ సానుభూతి పరులు కూడా ఆ పార్టీ నేతల వైఖరిపై మండిపడ్డారు. తేజస్వీ మాటల్లో ఉద్యమకారులు, అమరవీరుల అంశాన్ని తీసుకొచ్చాడు. ఉద్యమకారులు చనిపోవడానికి కాంగ్రెస్ కారణమైందని చెప్పడమే తన ఉద్దేశమని, తెలంగాణ ఏర్పాటును, ఉద్యమాన్ని, అమరవీరులను కించపర్చాలనే ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని ఆయన స్పష్టం చేశాడు. కానీ నిన్న ఆయన మాట్లాడిన సందర్బం మాత్రం తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం విధానం బాగాలేదని, పరోక్షంగా తెలంగాణ ఏర్పాటే సరైంది కాదనే విధంగా అర్ధం వచ్చేలా సాగింది. ఆ వీడియో, తేజస్వీ మాటలు అప్పటికే వైరల్ అయిపోయాయి. దీనిపై పార్టీలకతీతంగా భగ్గుమన్నారు.
8 మంది ఎంపీలను గెలిపిస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా దీన్ని ఖండించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ను విలన్ చేద్దామనుకుంటే తామే విలన్ అయిపోయామని తలపట్టుకున్నారు బీజేపీ పెద్దలు కూడా. ఇక్కడ అంతంత మాత్రంగానే ఉన్న పార్టీ పరిస్థితి.. ఇప్పుడు ఈ పరిణామాల తరువాత మరింత దారుణంగా తయారయ్యిందని ఆ నేతలే పెదవి విరుస్తున్నారు. తేజస్వీ మాటలు.. వెంటనే చక్కిదిద్దే చర్యలకు దిగకపోవడం.. సమర్థించుకునే ప్రయత్నం చేయడం.. ఇవన్నీ దప్పిదాలేనని, ఇవే తమ కొంప ముంచుతున్నాయని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.