ఓ వైపు మోడీ పన్నేండేండ్ల ప్రస్థానంపై అభినందనలు. మరోవైపు మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంలో బీజేపీపై దుమ్మెత్తిపోయడాలు.. సమాంతరంగా ఒకేరోజు జరుగుతున్నాయి. ఇది దేనీకి చిహ్నం..? ఈ పరిణామాలు ఏం చెబుతున్నాయి? పన్నేండ్ల పీఎంగిరీతో రికార్డు సాధించారు ఇక చాలు.. అని జనాలు అనుకునేలా బీజేపీ సెల్ఫ్గోల్కు దిగుతున్నదా? మీనాక్షి నటరాజన్ విషయంలో అచ్చంగా అలాగే ఉంది.
ఇప్పటికే కాక్రోచ్ పార్టీ అంటూ బీజేపీకి వ్యతిరేకంగా నినదిస్తున్న జెన్-జీకి వెల్లువలా మద్దతు లభిస్తున్న వేళ.. ఇకపై ఎన్డీయేకు నూకలు చెల్లినట్టేనని మారుతున్న రాజకీయం సంకేతాలిస్తుంటే.. తాజాగా మీనాక్షి నటరాజన్పై బీజేపీ వ్యూహం బెడిసికొట్టిందనే చెప్పాలి. ఇక్కడ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ విషయంలో టెక్నికల్గా తప్పు జరిగిందా? సబ్స్టాన్షియల్ డిఫెక్టా? అన్నది పక్కన పెడితే..ఆమె ఉద్దేశ పూర్వకంగా ఆ వివరాలను ఇవ్వలేదు అనే విషయాన్ని ఎవరూ ఒప్పుకోవడం లేదు. అదే సమయంలో మరి తప్పు తప్పే కదా! ఆ కేసు వివరాలు ఎందుకు పొందుపర్చలేదు.. ! అని ప్రశ్నించడంలోనూ తప్పులేదు. ఇక్కడ రాజకీయం చోటు చేసుకోవడమే పెద్ద తప్పిదంగా మారింది.
బీజేపీ దీనిపై ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించాడు. కాంగ్రెస్ ఇదన్యాయమని, ఈసీకి ఫిర్యాదు చేసింది. న్యాయపరంగా కూడా పోరాడుతామని అంటున్నది. కానీ దీన్ని కాంగ్రెస్ కోవర్టులే ఇచ్చారు కాబట్టి… మాకు సమాచారం తెలిసింది. ముందు వారిని కంట్రోల్లో పెట్టుకోండి! అని నిన్న అక్కడ మధ్యప్రదేశ్ మంత్రితో పాటు.. ఇవాళ బీజేపీ కీలక నేత, ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్ కూడా డిఫెన్స్ రాజకీయాలకు దిగడం.. బీజేపీని మరింత బద్నాం చేస్తున్నదనే చెప్పాలి. మీనాక్షి ప్లేస్లో ఇంకెవరున్నా.. ఇది బీజేపీకి మైలేజీ ఇచ్చేదేమో తెలియదు.
కానీ అక్కడ మీనాక్షికి జరిగిన అన్యాయంగా దేశం మొత్తం చూడటం.. ఆమెను రాజకీయాలకు అతీతంగా అభిమానించడం.. అంతో ఇంతో నిజాయితీ, గాంధేయవాదంతో ఉన్న ఆ లీడర్ విషయంలో ఇంత కక్షపూరిత వైఖరి అవసరమా? అని నిలదీయడం.. ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి. ఆమెలాంటి లీడర్ రాజ్యసభలో ఉండాలి… ఆమెను అక్కడికి వెళ్లకుండా నిలువరించింది ఎవరు..? బీజేపీ! ఇందులో బీజేపీ పెద్ద నేతలు కూడా జోక్యం చేసుకున్నారనడానికి బీఎల్ సంతోష్ కామెంట్లే ఉదాహరణ.
రెండు ఎంపీ సీట్లకే అక్కడ చాన్స్ ఉంటే.. మరి మూడో సీటు కోసం ఎందుకు నామినేషన్ వేశారు? అంటే అక్రమంగా మూడో రాజ్యసభను కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నది..అంటే సీట్ చోరీకి పాల్పడుతున్నారనేది ఒప్పుకున్నట్టేగా! ఇలా రెండు విధాలుగా బీజేపీని డిఫెన్స్లో పడేసేలా తన గళం విప్పుతోంది కాంగ్రెస్. నిరసనలు కూడా తెలియజేస్తోంది. తెలంగాణలో పలు చోట్ల బీజేపీ దిష్టిబొమ్మలు దహనం చేశారు కూడా. ఒక్క రాజ్యసభ సీటు కోల్పోతే కోల్పోయి ఉండొచ్చు గాక. కానీ కాంగ్రెస్కు ఇది కలిసి వస్తోంది. బీజేపీ నిజస్వరూపం ఇదీ.. అని ఇప్పటికే విస్తృతమవుతున్న వ్యతిరేక శక్తులకు మంచి అస్త్రం దొరికినట్టయ్యింది.
మీనాక్షి దళితురాలు కావడం కూడా ఆమెపై మరింత సానుభూతిని పెంచుతోంది. బీజేపీ తీరుపై తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహావేశాలకు ఆమె సామాజికవర్గం కూడా ఓ ప్రధాన కారణమైందని చెప్పొచ్చు!