ఏడాది, రెండేండ్లు, ఆపై వరుసగా జరిగే రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ ఇప్పుడు నజర్ పెట్టింది. అసలు ఉనికే లేదు అన్నచోట ఏకంగా అధికారాన్నే చేజిక్కించుకున్న పశ్చిమబెంగాల్ను ఆదర్శంగా తీసుకుంటున్నది. ఇటీవల అమిత్ షా తాము సింగిల్గానే పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో జరగబోయే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి? గతంలో మాదిరిగా సర్ను ఎలా వినియోగించుకోవాలి..? గెలుపు తీరాలకు ఎలా చేరాలి..? అనే అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నది.
పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలపై బీజేపీ సీరియస్గా నజర్ పెట్టింది. వరుసగా ఈ మూడు రాష్ట్రాల్లో ఏడాది, రెండేండ్ల వ్యవధిలో ఎన్నికలు రానున్నాయి. ముందుగా పంజాబ్, ఆ తరువాత కర్ణాటక, ఆ వెంటనే తెలంగాణలోనూ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ప్రస్తుతం రెండు జాతీయ పార్టీలు పంజాబ్పై దృష్టి పెట్టాయి. వాస్తవానికి, పంజాబ్ రాష్ట్రంలో.. తెలంగాణ మాదిరిగానే బీజేపీకి అంత సీన్ లేదు. శిరోమణి అకాలీదళ్తో ఒకప్పుడు గట్టిగానే ఉన్నా.. రైతు ఉద్యమాలు ఈ రెండింటినీ దెబ్బతీశాయి. ఇక ఇవి వేర్వేరుగానే పోటీ చేయనున్నాయి. అధికార పార్టీ ఆమ్ ఆద్మీ ఇక్కడ ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంటున్నది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఇక్కడ బలం పుంజుకుంటున్నది.
కానీ దీనిపైనా బీజేపీ ఆశలు పెట్టుకోవడం..ఇప్పట్నుంచే పార్టీ బలోపేతానికి చేయాల్సిన వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ పోవడం.. అటు అధికార పార్టీని, ఇటు కాంగ్రెస్ను కూడా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. దీంతో ఉన్నపళంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముగ్గురు ఇంచార్జిలను నియమించి పంజాబ్ తాజా రాజకీయ పరిస్థితులపై లోతైన అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించారు. అక్కడ పార్టీ అధికారంలోకి రావడానికి గల స్పేస్ను, అవకాశాలను అన్వేషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీకి సేమ్ తెలంగాణ మాదిరిగానే పది ఎమ్మెల్యేలు కూడా రావు. కానీ ఏకంగా సింగల్గా పోటీ చేసి అధికారం చేజిక్కించుకోవాలనుకోవడం..ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనే విధంగా ఆ పార్టీ వ్యూహాలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి.
ఇక ఆ తరువాత జరిగే కర్ణాటకపైనా ఆశలు పెట్టుకున్నది బీజేపీ. ఇక్కడ ఇటీవల సీఎం మార్పు కావడంతో కొంత కాంగ్రెస్కు ప్రతికూల వాతావరణం తెచ్చిపెట్టిందని బీజేపీ భావిస్తోంది. ఇదే అదనుగా అక్కడా పాగా వేయాలనే ఆలోచనకు ఇప్పట్నుంచే పావులు కదుపుతోంది. ఇక తెలంగాణపై మొదటి నుంచి గంపెడాశలు పెట్టుకున్నది బీజేపీ. ఎంపీ ఎన్నికల్లో బలమైన ప్రభావమే చూపుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి చతికిలబడుతోంది. అయినా ఈసారి అధికారం చేపట్టే దిశగా పకడ్బందీ వ్యూహాలు పన్నుతోంది. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు.. ప్రధాన ప్రతిపక్షం బీఆరెస్ కూడా బలంగా ఉంది. వీటిని కాదని, ఒంటరిగా పోటీ చేసి బీజేపీ ఎలా అధికారాన్ని కైవసం చేసుకుంటుంది… అసాధ్యమని అంతా అనుకుంటున్నారు.
కానీ ఆ గెలుపు మంత్రమేదో మేము చూసుకుంటాం… మీరు రాష్ట్రంలో బీజేపీని నెంబర్ టూ పొజిషన్లో ఉంచండి చాలు.. నెంబర్ వన్కు తెచ్చే బాధ్యత మేము చూసుకుంటామని మోడీ, అమిత్షా ద్వయం అభయం ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో..? పశ్చిమ బెంగాల్ మంత్రాలకు ఇక్కడ చింతకాయలు రాలుతాయా? అనేది ఆ పార్టీ వాళ్లకే అనుమానంగా ఉంది.