కాంగ్రెస్ అవునన్నా కాదన్నా… రేవంత్ లైట్గా తీసుకున్నా..! ఒక్కటి మాత్రం నిజం.. బీఆరెస్ బలమైన ప్రతిపక్షంగా ఉంది. ఎంతగా అంటే.. ఏ చిన్న విషయం దొరికినా… దాన్ని చిలువలు పలువలు చేసి..తోక అంటె పడగ అనే రీతిలో ప్రచారం చేసి.. జనం ముందు దోషిలా కాంగ్రెస్ను నిలపడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. తనకున్న సోషల్ మీడియా బలంతో ప్రతీ అంశాన్ని విస్తృతంగా జన బాహుళ్యంలోకి తీసుకుపోయి.. కాంగ్రెస్ది ప్రజా వ్యతిరేక పాలనగా చిత్రీకరించే విషయంలో అన్ని రకాల సోర్స్ను వాడుకుంటున్నది. కానీ, దీన్ని తిప్పికొట్టడంలో మాత్రం కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అవుతూ వస్తుంది. ఆ పార్టీ సోషల్ మీడియా సొల్లు విషయాలు చర్చించేందుకే తప్ప.. ఇలా వ్యవస్థీకృత దాడి జరగుతుంటే.. దాన్ని అర్థవంతంగా.. సబ్జెక్టువైజ్గా తిప్పికొట్టే సీన్ అక్కడలేదు. ఆ సరుకున్న టీము కూడా లేదు.
ఏమైనా అంటే.. మేము మొన్ననే అధికారంలోకి వచ్చాం కదా.. మా దగ్గర కోట్లకు కోట్లు లేవు.. వారి దగ్గర ఉన్నాయి.. అనే సాకులు వెతుక్కుంటున్నారు. కానీ అవన్నీ జనం చూడరు. వారి కళ్లముందు ప్రజెంట్ అయ్యే అంశాలు లోతుగా విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల ఉసురు తీసుకుంటున్నదని సర్కార్పై అపవాదు వచ్చింది. దీన్ని తిప్పికొట్టేందుకు ఒక ఉత్తమ్, ఒక సీఎం తప్ప ఎవరూ లేరు. ఓ వైపు .. ఎన్నడూ రైతుల గురించి మాట్లాడని బీజేపీ కూడా.. ఇవాళ రైతు గోస అనే పేరుతో బస్సు యాత్ర చేస్తుంది.. కానీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, చేపడుతున్న ప్రణాళికలు ఎవరూ వివరించే పరిస్థితిలో లేరు. ఒక్క సీఎం రేవంతే.. కంఠశోష వచ్చేలా చెప్పుకుంటే తప్ప.. బీఆరెస్ను విమర్శిస్తే తప్ప ఆ నష్ట నివారణ జరగడం లేదు. ప్రతీ చిన్న అంశాన్ని కూడా వదలడం లేదు బీఆరెస్.
ఎంత బలంగా ముందుకు పోతున్నదంటే.. అబద్దపు ప్రచారాలు చేసైనా సరే, తప్పుడు విమర్శలతోనైనా సరే.. జనం ముందు కాంగ్రెస్ను దోషిగా నిలపాలె.. మళ్లీ బీఆరెస్ పాలన రావాలె.. కేసీఆర్ సీఎం కావాలె.. ఈ నినాదాలు జనం బలంగా నమ్మాలె… దీని కోసం అహర్నిషలు కేటీఆర్ అన్నిటీములు పనిచేస్తున్నాయి. మరోసారి నేనే సీఎం.. మళ్లీ మాకే అధికారం.. అందరికీ రెండు రెండు సార్లిచ్చారు… మాక్కూడా ఇస్తారు.. అనే లాజిక్లేని ప్రసంగాలతో సీఎం రేవంత్ ఊరేగుతున్నాడు. ఇది మొదటికే మోసం తెస్తున్నా గ్రహించడం లేదు. ఎవరికి వారే ధనార్జన వైపు దారులు వెతుక్కుంటున్నారు తప్ప.. ప్రభుత్వాన్ని, రేవంత్ను కాపాడే ప్రయత్నంలో ఎవరూ ముందుకు రావడం లేదు.
పైపెచ్చు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు..అవును… మేం ధాన్యం సేకరణలో విఫలమయ్యాం.. అని బాజాప్తా బహిరంగంగానే ప్రకటించుకునే స్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. ఇవాళ జరిగిన రైతు డిస్కం ఏర్పాటు కోసం టీజీ ఈఆర్సీ నిర్వహించిన పబ్లిక్ హియరింగ్లో ఆ పార్టీ నేత కోదండరెడ్డి మాట్లాడుతూ.. ఇరవై నాలుగ్గంటల కరెంటు ఉంటే చాలు.. మూడు గంటల పాటు నీళ్లు రైతులకు సరిపోతాయనే మాటలను బీఆరెస్ వక్రీకరించింది. గతంలో ఎక్కడో అమెరికాలో నాడు రేవంత్ మాట్లాడిన ఆ మూడు గంటల కరెంటు చాలు అనే వీడియోలు కూడా వైరల్ చేస్తున్నారు. మరి దీన్ని తిప్పికొట్టి.. వాస్తవాలు చెప్పే నాథుడే కాంగ్రెస్లో కరువయ్యాడు. రెండు టర్ములు మేము ఉంటాం.. నేనే సీఎం అని మాత్రం రేవంత్ ఏ వేదికలెక్కినా ఊదరగొడుతూ వస్తున్నాడు. ఇలాంటి బీఆరెస్ చర్యలతో ఆయనకు అంత సీన్ ఉందా అనిపిస్తుంది.