స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై తెలంగాణలో లొల్లి మొదలైంది. కాంగ్రెస్ దీని అమలు తీరులో పారదర్శకత ఉండాలని, పేద సబ్బండవర్ణాల ఓటు హక్కుకు విఘాతం కలగకుండా చూడాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ను తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కోరింది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. కలిసి ఎస్ఈసీని కలిశారు. ఓట హక్కును నిరూపించుకునే క్రమంలో 14 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుందని, సిటిజన్ చట్టాన్ని అనుసరించి మాత్రమే ఓటరుగా పరిగణించరాదని కాంగ్రెస్ కోరుతోంది.
కానీ కేంద్రంలో బీజేపీ.. ప్రధానంగా మైనార్టీలలో బోగస్ ఓట్లు చాలా పేరుకుపోయాయనే ఈ సర్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో ఏకంగా లక్షలకు లక్షల ఓట్లను తొలగించిన వైనం వివాదమైంది. అక్కడ బీజేపీనే సర్కార్ను ఏర్పాటు చేయడం కూడా సర్ వల్ల బీజేపీ ప్రయోజనం పొందుతున్నదని, అక్రమవలస దారుల పేరుతో మైనార్టీల ఓట్లు గల్లంతు చేస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అయితే తెలంగాణలో దీని ప్రభావం ఎంతమేర ఉంటుందనే దానిపైనా చర్చ జరుగుతున్నది. ప్రధానంగా హైదరాబాద్తో పాటు.. నిజామాబాద్, బైంసా, బోధన్ తదితర ప్రాంతాల్లో మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ బోగస్ ఓట్లు కూడా ఉంటాయనే ప్రచారం ఉంది.
దీంతో ఈ దొంగ ఓట్లు, బోగస్ ఓట్ల తొలగింపు వేట పేరుతో సర్ను అడ్డం పెట్టుకుని ఎడాపెడా మైనార్టీల ఓట్లు తొలగిస్తారని ముస్లిం వర్గాల నుంచి ఆరోపణ ఉంది. ఇది బీజేపీకి అనుకూలంగా మలుచుకుని ఎన్నికల్లో ఆ పార్టీ లబ్ది పొందాలని చూస్తుందని, అందుకు సర్ను వాడుకుంటుందని మైనార్టీ వర్గాలు, రాజకీయ శక్తులు, ప్రజా సంఘలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలో బీఆరెస్ సైలెంట్గా ఉంది. తన రాజకీయ వ్యూహంలో భాగంగా .. దీనిపై ఇప్పటి వరకు పల్లెత్తు మాట కూడా మట్లాడలేదు. ఇకపై కూడా సర్పై తన స్టాండ్ను ఇదే విధంగా కొనసాగించేలా కనిపిస్తున్నది.
అయితే బీజేపీ, బీఆరెస్ రెండూ పొత్తు పెట్టుకుంటాయని, పాలసీ పరమైన ఇష్యూలలో బీఆరెస్ .. బీజేపీని విమర్శించదనే ప్రచారం ఉంది. మొన్న ప్రధాని మోడీ వచ్చిన సందర్భంగా కూడా ఆయన పర్యటనపై ఎలాంటి కామెంట్ చేయలేదు బీఆరెస్. ఇక సర్ విషయానికొస్తే.. ఇది కేవలం ముస్లిం మైనార్టీల ఓట్లను టార్గెట్ చేసి నడిచే స్పెషల్ డ్రైవ్. ఇప్పుడు దీనిపై స్పందిస్తే… ఎలాగూ మైనార్టీ ఓటర్లు తమ వైపు లేరు.. ఇక మేజర్ సెక్షన్ హిందూ ఓటర్లలో కూడా ఎందుకు వ్యతిరేకత పెంచుకోవాలనే వ్యూహంలో భాగంగా ఇలా మౌనంగా ఉందా? అనే ప్రచారమూ జరుగుతున్నది. ప్రస్తుతానికి కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు మాత్రమే సర్ను వ్యతిరేకిస్తున్నాయి.
ఆందోళనలకు ఇప్పటికైతే సిద్దం కాలేదు కానీ, సర్ విధానం దాని అమలు తీరుపైనే ఆక్షేపణలను స్టేట్ ఎలక్షన్ కమిషన్కు తెలియజేసింది. ఈ సర్వే పూర్తయి.. ఓటర్ల తుది జాబితా.. తొలగించిన ఓటర్లు.. లెక్కతేలితే గానీ ఈ పార్టీలు ఆందోళన బాట పట్టేలా లేవు. బీఆరెస్ మాత్రం దీనిపై ఇప్పటికి, అప్పటికీ ప్రేక్షక పాత్రే వహించేలా ఉంది. ఎంఎఐం పార్టీ కూడా సర్కు వ్యతిరేకంగా పోరాడనుంది. పాతబస్తీతో పాటు ఎంఐఎం బలంగా ఉన్న ఏరియలో ఎన్ని మైనార్టీల ఓట్లు తొలగించినా ఆ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు. అక్కడ ఎంఐఎం తప్ప.. బీఆరెస్, కాంగ్రెస్, బీజేపీ.. ఏ పార్టీకి చాన్సు లేదు. నిజామాబాద్లో కూడా కొన్ని ముస్లిం మైనార్టీ ఏరియాలు గంప గుత్తగా ఎంఐఎం ఖాతాలో పడేటివే. ఇక్కడ సర్ పప్పులుడకవు. అందుకే ఎంఐఎం పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు.