Consumer Rights: వేసవి తాపం నుండి ఉపశమనం పొందే లక్ష్యంతో చాలా మంది రూ. వేలకు వేలు ఖర్చు పెట్టి ఏసీనో, కూలర్ నో కొనుగోలు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్న కొద్ది రోజులకే అవి ఊరికే మెురాయిస్తూ చికాకును తెప్పిస్తుంటాయి. సదరు కంపెనీ కస్టమర్ సర్వీస్ సెంటర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఆ సమయంలో కస్టమర్లు పడే బాధ అంతా ఇంతాకాదు. డబ్బుకు డబ్బు పోయి.. కంపెనీ నుంచి సరైన స్పందన లేక వారు తమలో తామే మథనపడిపోతుంటారు. అయితే ఇలాంటి సమస్యలకు ‘వినియోగదారుల రక్షణ చట్టం-2019’ ద్వారా చెక్ పెట్టవచ్చు. ఏసీ లేదా కూలర్ ను విక్రయించి సర్వీస్ ఇవ్వని కంపెనీలపై చట్టపరంగా ఎలా పోరాడాలో ఇప్పుడు చూద్దాం.
ఏసీ లేదా కూలర్ కంపెనీపై ముందుగానే న్యాయపోరాటానికి దిగకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం మెుదట చేయండి. ముందుగా తయారీదారు (Manufacturer) లేదా డీలర్కు ఒక అధికారిక లీగల్ నోటీసు పంపండి. అందులో సమస్యను వివరిస్తూ.. 15 రోజుల్లోపు మరమ్మతు లేదా రీప్లేస్మెంట్ చేయాలని ఆదేశించండి. అలాగే కేంద్ర ప్రభుత్వ నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్ (1800-11-4000)కు ఫిర్యాదు చేయడం ద్వారా కూడా త్వరితగతిన సమస్యను పరిష్కరించుకోవచ్చు.
అప్పటికీ కంపెనీ నుంచి సరైన స్పందన రాకుంటే అప్పుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించండి. అయితే కోర్టులో మీ వాదన నెగ్గాలంటే పక్కా ఆధారాలు ముఖ్యం. కాబట్టి మీరు వస్తువు కొన్నప్పుడు తీసుకున్న ఒరిజినల్ బిల్లు (Tax Invoice), వారంటీ కార్డ్ ను మీ దగ్గర పెట్టుకోండి. వీటితో పాటు టెక్నీషియన్ ఎన్నిసార్లు వచ్చారో తెలిపే జాబ్ కార్డులు, మీరు కంపెనీకి పంపిన ఈమెయిల్స్, వాట్సాప్ చాట్లు, కస్టమర్ కేర్ టికెట్ ఐడీలను రెడీగా ఉంచుకోండి. వీలైతే ఏసీలోని లోపాన్ని వీడియో తీసి ఉంచడం కన్జ్యూమర్ కోర్టులో మీ వాదనకు మరింత బలం చేకూరుస్తుంది.
ఒకప్పుడు కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేయాలంటే నేరుగా వెళ్లి దరఖాస్తు సమర్పించాల్సి ఉండేది. ప్రస్తుతం ఈ అవసరం లేకుండా ఈ – దాఖిల్ (e-Daakhil) పోర్టల్ ద్వారా ఇంటి నుండే కేసు ఫైల్ చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం ముందుగా పోర్టల్లో రిజిస్టర్ అయి, ఫిర్యాదును క్రమపద్ధతిలో పొందు పరచాల్సి ఉంటుంది. ముందుగా అవసరమైన పత్రాలు పీడీఎఫ్ రూపంలో అప్ లోడ్ చేయాలి. రూ.5 లక్షల వరకూ క్లెయిమ్ మెుత్తానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతకు మించి క్లెయిమ్ చేయాలని భావిస్తే నామమాత్రపు రుసుమును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ ఫిర్యాదు ద్వారా.. 2019 చట్టం ప్రకారం వినియోగదారుడు తాను నివసించే చోట లేదా పనిచేసే ప్రాంతంలోని కమిషన్లోనే కేసు వేయవచ్చు. రూ. 50 లక్షల లోపు క్లెయిమ్ల కోసం జిల్లా కమిషన్ ను సంప్రదించవచ్చు. రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకూ ఉంటే రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాలి. అలా కాకుండా రూ.2 కోట్లకు పైగా క్లైయిమ్ దాటితే నేరుగా జాతీయ కమిషన్ (NCDRC)కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
అయితే కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేసేటప్పుడు కేవలం మరమ్మతు లేదా రీప్లేస్ మెంట్ మాత్రమే కోరవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మీరు పడిన మానసిక వేధన, కోర్టు ఖర్చులను కూడా క్లెయిమ్ చేసుకునే హక్కును వినియోగదారుల చట్ట కల్పిస్తుందని తెలియజేస్తున్నారు. కాబట్టి కొత్త ఏసీ లేదా మరమ్మత్తుకు డిమాండ్ చేయడంతో పాటు అదనంగా రూ.1 లక్షకు తగ్గకుండా క్లెయిమ్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కేసులో గెలిస్తే.. చట్టప్రకారం వాటన్నింటిని తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత సదరు ఏసీ లేదా కూలర్ కంపెనీపై ఉంటుంది.
Also Read: కూలర్ గాలి ఏసీలా రావాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి.. మీ గది ఐస్లా మారిపోతుంది!
సాధారణ కోర్టుల తరహాలో వినియోగదారుల కోర్టులో వాదించడానికి లాయర్ ఉండాల్సిన అవసరం లేదు. మీ కేసును మీరే స్వయంగా వాదించుకోవచ్చు. అయితే సమస్య తలెత్తిన రెండేళ్లలోపు మాత్రమే ఫిర్యాదు చేయాలన్న నిబంధనను మాత్రం తప్పనిసరిగా అందరూ ఫాలో కావాల్సిందే. కంపెనీలు కోర్టు నోటీసులు అందగానే సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తాయి. కానీ మీ హక్కుల విషయంలో రాజీ పడకుండా పట్టుదలతో ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: జియో సంచలనం.. రూ. 200 లోపే 4 సూపర్ ప్లాన్లు.. మిస్ అయితే మీకే నష్టం!