ఇప్పుడంతా బంగారం రాజకీయం నడుస్తున్నది. రాక రాక వచ్చిండు మోడీ జీ. హైదరాబాద్కు. ఏదో తన రాజకీయాలు తాను మాట్లాడుకుని సక్కగా పోక.. ఒక్క ఏడాది బంగారం కొనకుర్రి ..! అని చెవివేసి పోయిండు. ఆ రాత్రి పాపం జనానికి నిద్రనే రాలేదంటే నమ్ముర్రి. అవునూ…! ఎందుకు మోడీ సాబ్ బంగారం కొనొద్దన్నడు! మరీ అగ్వకు దొరకే రోజులు వస్తున్నయి.. జర ఆగుండ్రి..! అని సిగ్నల్ ఇచ్చిండా? దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతున్నది. ఆ బంగారం మీద పైసలు పెట్టుడు వేస్ట్ అని చెప్పకనే చెప్పిండా? ఎంతకు సమజ్కాలేక అనుకోరి జనానికి. ఇగ దీనిపై పుంఖానుపుంకాలుగా టీవీలల్ల చర్చ.. స్పెషల్ స్టోరీలు.. డిబేట్లు.. ! ఆ ఎందుకు కొనొద్దు..! మేం కొంటాం..! కొనేదాకా మాకు నడవదు అని ఒకళ్లు చెప్తున్నరు!
అగో మోడీ సాబ్ గిట్ల ఏడాది దాకా కొనుద్దని చెబితే .. మా బంగారు షాపుల బత్కులేమి కావాలె? దివాళా దీయల్నా? అని ఇంకో దిక్కు కెళ్లి ఏడ్పులు. ఛలో ఢిల్లీ పోదాం.. మమ్మల్ని మీరే ఆదుకోవాలె.. మా బంగారం దుకాణాలు నడవయి.. మాకు పనులు ఉండయి.. ఆర్థికంగా సాయం చేయాలని మోడీని కలుద్దామని.. బయలుదేరుతందుకు రెడీ అయితుర్రట..ఇదో జోకు ! వెటకారం! రెండు రోజుల నుంచి ఇవన్నీ చూసిన సామాన్య జనానికి పిచ్చెక్కింది. ఓర్నీ మీ ఏశాలు సల్లగుండ! ఇంక మేము బంగారు కొనేంత ఉన్నాయా మా బతుకులు!
ఉన్న బంగారం తాకట్టు పెట్టి.. అది ఇడిపిచ్చుకోలేక.. మార్వాడి దుకాణ్లనే మాయమైంది… ముత్తూట్, గిత్తూటు.. మణప్పురం.. గినప్పురం.. అని అండ్ల అడుగు బొగుడు బంగారం అర్రాస్ పాలైంది. ఇప్పుడు ఆమాతం లక్షన్నర దాటి రెండు లక్షలకు ఎగబాకుతున్న బంగారాన్ని ఎగబడి ఎగబడి కొనేంత సీన్ ఏన్నదా మోడీ తాతా! అని కారెడ్డమాడుతున్నరట. సరే అది వెటకారమే కావొచ్చు గానీ, అందులో అబద్దం లేదు.. ఆ నిజం నిప్పులాగే ఉంది. ఆ నిప్పుతో జీవితాలను మెల్లమెల్లగా బతుకు భారమై ఎలా తగులబడుతున్నాయో చెప్పకనే చెబుతున్నాయి.
అన్ని రేట్లు పెరిగిపోయినయ్.. బతుకుడే కష్టమైపాయె. ఇంటి కిరాయిలు కట్టేటందుకు.. స్కూలు ఫీజులు తీర్చేతందుకు..పప్పులు, నూనెలు సగవెట్టుకునేతందుకు.. బాకీలు, మిత్తీల భారం తీర్చుకునేతందుకు… ఇవే సరిపోతున్నయి. వీటి కోసం నిత్తెం కొత్త అప్పులేనాయె! మరి ఓరకవెట్టిన పైసలు ఏడుండె? తులం బంగారం కొనాలంటే లక్షన్నర రపాలేడ దాచిపెట్టిరి ఆ పేదోళ్లు. ఇగ పెండ్లీలకంటరా? పెండ్లంటెనే పెద్ద అప్పు. ఉన్నదూడ్చి అమ్ముకోవడమే. ఇల్లు, పొలం, నగ, నట్రా అన్నీ.. అండ్ల కెళ్లి కొంత బంగారం. తప్పదు కాబట్టి. దీని కోసం మోడీ సారు ఢిల్లీకెళ్లి ఫ్లైటేసుకుని వచ్చి.. మీరు బంగారు కొనకండ్రి.. అని చెప్తే .. నిజంగా చెప్పాలంటే.. వాళ్లకు నవ్వాల్నో.. ఏడ్వాల్నో తెలుస్త లేదు.
ఇంకా ఏం చెప్పవట్టే సారు.. నూనె తక్కువ తినుర్రి.. ఊర్లలకు తిరకుర్రి.. ట్రైన్ల పోండ్రీ… కార్లర్ల తిరగకుర్రి.. అవూ.. ఇవన్నీ పేదోళ్లకు ఉండయి.. రెక్కాడితేగానీ డొక్కాడని పబ్లిక్కు అంత సీన్ లేదు. మరి ఎవల గురించి మోడీ సారు చెప్పేది. పేదళ్ల గురించి, కూలీనాలీ బతుకుల గురించైతే కాదు.. ఓహో.. మోడీసాకు కూలీబతుకుల గురించి ఫికరు లేదన్నమాట.. ఆళ్లు ఉంటే ఉంటరు.. పోతే పోతరు..! ఈ మాటలకు మన కోసం కాదురోయ్.. అవి ఉన్నోళ్లకు.. ఇంకా కొనాలనుకున్నోళ్లకు. మనవి.. గంజినీళ్లు.. కారం మెతుకుల బతుకులాయె.
ఆ బంగారంలొల్లి మనది కాదు.. ఆ కార్లల తిరిగే సూక్తులు మనకు కాదు.. కల్లువొట్టు తాగినమా..? కారం మెతుకులు తిన్నమా? కూలీ పనికి పోయినమా? ఇదీ లెక్క. అవే జీవితాలు.. ఏళ్ల తరబడి..! మన కోసం మోడీ సారు అంతగానం ఆలోచిస్తడని ఆలోచించుడే బేకార్రా బై. సరేగానీ, బంగారం అంట కొనకుర్రి.. ఏడాది దాకా! మనమూ ఓ మాటందాం.. నోట్లెకెళ్లి ఏమన్నా బంగారం రాల్తదా?