రాష్ట్ర ప్రభుత్వానికి అనుకోని సమస్యలు ఎదురవుతున్నాయి. మొన్నటివరకు అన్ని సమస్యలను ధైర్యంగా పరిష్కరించిన రేవంత్ సర్కారుకు ఆర్టీసీ సమ్మె రూపంలో ఎదురుదెబ్బ తగిలేలా ఉందని ప్రచారం జరుగుతోంది.మహిళా రిజర్వేషన్ బిల్లు మాటున కేంద్రం తెచ్చిన డీలిమిటేషన్ బిల్లును అడ్డుకోవడంలో ఇండియా కూటమి విజయం సాధించిందని సీఎం రేవంత్ పలుమార్లు చెప్పారు.ఇది ప్రతిపక్షాల విజయంగా అభివర్ణించారు. దక్షిణాది రాష్ట్రాల ఐక్యత వల్లే డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిందని పేర్కొన్నారు. దీనికి తోడు కాళేశ్వరం కమిషన్ విషయంలో తమకు అనకూలంగా తీర్పు వస్తుందని భావించిన తెలంగాణ ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి.ఇండియా కూటమిలోని పార్టీలకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికల్లో సత్తా చాటిన సీఎం రేవంత్ రెడ్డి.. కేరళ స్టార్ ఎన్నికల క్యాంపెయినర్గా ఇండియా కూటమి తరఫున ప్రచారం నిర్వహించారు. మరి ఆ ఎన్నికల్లో ‘యూడీఎఫ్’ కాంగ్రెస్ విజయం సాధిస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. సర్వేలు మాత్రం ‘యూడీఎఫ్’ వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. నిజంగానే అక్కడ యూడీఎఫ్ గెలిస్తే సీఎం రేవంత్ క్రేజ్ మరింత పెరుగుతంది. ఒకవేళ యూడీఎఫ్ ఓడిపోతే ఆ మచ్చ రేవంత్ సామర్థ్యం మీద పడే అవకాశం లేకపోలేదు.
దీనికి తోడు తన మంత్రివర్గంలోనూ కొన్ని సమస్యలను రేవంత్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్కు పదవీ గండం ఉన్నది. ఆయన ప్రస్తుతం ఏ చట్టసభకు ప్రాతినిధ్యం వహించడం లేదు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో ప్రతిపక్షాల విమర్శలను దృష్టిలో ఉంచుకుని రేవంత్ ప్రభుత్వం తన మంత్రివర్గంలో మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్కు మంత్రిగా చోటుకల్పించింది. అయితే, ఆయన మంత్రిగా ప్రమాణం చేసి ఆరు నెలల గడువు పూర్తి కావొస్తుంది. ఈనెల 30లోపు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకపోతే తన పదవీకి రాజీనామా చేయాల్సిందే. రాజ్యాంగం ప్రకారం.. మంత్రిగా ప్రమాణం చేసిన ఆరునెలల్లోపు శాసనసభ లేదా శాసన మండలికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోగా.. ఆ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగులో ఉన్నది. గవర్నర్ ఫైల్ ఆమోదించకపోతే అజార్ మంత్రి పదవీ పోవడం ఖాయం.
పాలకొల్లులో సంచలనం.. ఎల్కేజీ విద్యార్థిని నిర్బంధించిన ప్రైవేట్ స్కూల్!
దీనికి తోడు ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె వలన రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫంక్షన్ల సమయం కావడం, స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో సొంతూర్లకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే కార్మికులు సమ్మె విరమించకపోతే ఆ ఎఫెక్ట్ ప్రభుత్వం మీద కనిపిస్తుంది. ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకత రావడం ఖాయమని తెలుస్తున్నది. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇతర పార్టీలు.. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సీపీఐ సైతం ప్రభుత్వ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వారి డిమాండ్లు నెరవేర్చాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని డిమాండ్ చేశారు. కాగా, మే చివర్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత తప్పదని పలువురు జోస్యం చెబుతున్నారు.