తమిళనాడు తాజా పరిస్థితులు విజయ్కు మరింత హీరో వర్షిప్ను తెచ్చిపెట్టాయనే చెప్పాలి. పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలో ప్రజాదారణ పొంది సీఎం సీటును కైవసం చేసుకునే దిశగా అడుగులు వేసి దేశం మొత్తం తన గురించి చర్చించుకునేలా చేశాడు. ఇక సీఎం పక్కా అని అంతా అనుకున్న సమయంలో.. కాంగ్రెస్ కూడా విజయ్కు తోడు నిలిచిన తరుణంలో.. దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్నట్టు గవర్నర్ రూపంలో ఏర్పర్చిన ఆటంకం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. దీని వెనుక కేంద్రం పెద్దలున్నారనేది జగమెరిగిన సత్యం.
కానీ మోడీ, అమిత్ షాలు ఈ విధమైన డ్రామా ప్లే చేస్తారని ఎవరూ ఊహించకపోవడమే ఇక్కడ ట్విస్టు. ఎందుకంటే..అక్కడ ఆ పార్టీకి అంత సీన్ లేదు. ప్రాంతీయ పార్టీలు దయతలచి దగ్గర తీస్తే తప్ప ఉనికి కాపాడుకునే ప్రయత్నమే తప్ప. కానీ ఇక్కడ బీజేపీకి మండిందెక్కడ..? ఎందుకు ఆ ఇద్దరు పెద్దలు విజయ్ మీద తమ ప్రతాపాన్ని ఇంత తొందరగా చూపాలకున్నారు. మాతో పెట్టుకోకు.. అని ఓ శాంపిల్గా తమ విశ్వరూపాన్ని సీఎం కాకముందే చూపే అవసరం ఏమొచ్చింది? దీనికి ఏకైక కారణం.. రాహుల్తో జత కట్టడమే. ఎన్నికలకు ముందు తామెంత బతిమాలని విజయ్ బీజేపీతో జత కట్టేందుకు ససేమిరా అన్నాడు.
కానీ ఇప్పుడు రాహుల్ను భుజానికెత్తుకోవడానికి సిద్దం కావడం.. రాహుల్ కూడా మిత్రధర్మం పక్కన పెట్టి స్నేహధర్మం వైపు అడుగులు వేయడం.. కేంద్రం పెద్దలకు నచ్చలేదు. అన్ని రాష్ట్రాలను ఊడ్చుకుంటూ వస్తూ… దేశం మొత్తం పాకుతున్న తమ సత్తా తెలిసీ మాతో పెట్టుకుంటాడా? తమ శతృవుతో జతకడతాడా? అనేది వారి ఆగ్రహానికి కారణమైంది. మొగుడు కొట్టినందుకు కాదు.. తోడి కోడలు నవ్వినందుకు! అన్నట్టుగానే ఉంది బీజేపీ పరిస్థితి. మెల్లమెల్లగా కర్ణాటక, తెలంగాణని కూడా కబ్జా పెడదామనుకునే విధంగా పావులు కదుపుతున్న తమకు తమిళనాడులో ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం నచ్చలేదు. మింగుడు పడలేదు. అందుకే గవర్నర్ రూపంలో తమ ప్రతాపం చూపి.. జస్ట్ బీజేపీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో శాంపిల్ చూపారన్న మాట. ఎన్ని సీట్లు గెలిస్తే మాకేందీ? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సీన్ ఉందా లేదా? అంతే.
లాజికల్ గా, టెక్రికల్ గా.. విజయ్తో ఆడుకున్నది కేంద్రం. విజయ్ ఇక్కడ రాజకీయ పరిణతి ప్రదర్శించాడు. ఎక్కడా టెంప్ట్ కాలేదు. రాజకీయ అనుభవం కలిగిన నేతలాగే నడుచుకున్నాడు. అందరి మద్దతు కూడగట్టుకుని.. టిట్ ఫర్ టాట్ లాగే చేసి చూపాడు. ఇవాళ మళ్లీ గవర్నర్ను కలవడం.. సీఎం అయిన తరువాత అసెంబ్లీలో బలం చూపించుకుంటానని చెప్పడం.. కావాల్సిన సంఖ్యాబలం ఉందని స్పష్టం చేయడం.. ఇక తప్పదన్నట్టుగా గవర్నర్ ఓకే అనడం.. చకచకా జరిగిపోయాయి. కానీ ఇక్కడ ఓడింది బీజేపీనే. మళ్లీ గెలిచింది విజయే. కానీ ఇక్కడా ఓడమా? గెలిచామా? మర్యాద దక్కిందా? లేదా అనే విషయాలను బీజేపీ పట్టించుకోలేదు.
అంతే దేశంలోనే శక్తివంతంగా మారిన తమ సత్తా ఏపాటిదో గుర్తించి నడుచకోవాలెనని ఓ సంకేతం పంపగలిగింది విజయ్కు. తెలంగాణలో అప్పట్లో కేసీఆర్.. నేనేం చేసినా తెలంగాణ బాగుకోసం.. బంగారు తెలంగాణ కోసం.. అనే నినాదం జనాల్లోకి ఎంత బాగా తీసుకుపోగలిగాడో.. మోడీ ఏం చేసినా..దేశం కోసం ధర్మం కోసమేనని దేశ వ్యాప్తంగా జనాల్లోకి అంతకు మించి తీసుకుపోగలిగింది బీజేపీ. అందుకే తమిళనాడు రాజకీయాల్లో ఓ చిన్న ఝలక్ ఇచ్చింది. దీనికి తోడు అన్నాడీఎంకే, డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయనే ప్రచారాన్ని ముమ్మరం చేయడం ద్వారా.. ఓ గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేయగలిగింది. జనాల్ని అయోమయానికి గురి చేయడంలో సక్సెసయ్యింది. కానీ ఈ చీప్ డ్రామాకు త్వరగానే పుల్స్టాప్ పెట్టాడు స్టాలిన్. హుందాగా ప్రవర్తించి .. చెత్త రాజకీయాలకు తాను దూరమనే విధంగా సంకేతిమచ్చాడు.