తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లు.. ! లెక్క తగ్గకుండా.. చెప్పిన మాట తప్పకుండా.. టకీటకీమని రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసి మాట నిలబెట్టుకున్నది సర్కార్. జూన్ 30న ప్రారంభమైన వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను పరిపూర్ణంగా వేయడం పూర్తి చేసింది ప్రభుత్వం.
దీనిపై ప్రతిపక్షాలకు అనుమానాలున్నాయి. గతంలో జరిగిన పొరపాట్లు, ఆలస్యాలు, అవాంతరాలు కూడా వాటికి బలాన్ని చేకూర్చాయి. మొత్తానికి సరిగ్గా సమయానికి నిధులు వేసి రైతులకు పెట్టుబడిసాయాన్ని అందించి, వారికి ఊతంగా నిలిచింది రేవంత్ సర్కార్. ఈ తొమ్మిది రోజులుగా రైతుల ఖాతాలన్నీ టకీ టకీమని మోగాయి.
గతంలో కేసీఆర్ రైతుబంధు గురించి వివరించే సమయంలో టింగు టింగు మని రైతుల ఖాతాల్లో పైసలు జమ అవుతున్నాయనేవాడు. దీన్ని రేవంత్ మార్చి చెబుతున్నాడు. టింగ్ టింగ్కు బదులు.. టకీ టకీ మని రైతుల ఖాతాల్లో మేం పైసలు వేస్తున్నాం.. అని చెబుతూ వస్తున్నాడు. టకీ టకీ మోత ఇక ముగిసింది.
అర్హులైన రైతులందరి ఖాతాల్లో పెట్టుబడి సాయం రైతు భరోసా జమ అయ్యింది. దీని కోసం రూ. 9వేల కోట్లు వేశారు. అయితే దీనిపై రేపు ఖమ్మం జిల్లా చింతకాని మండలం, జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభను ఏర్పాటు చేసింది సర్కార్. తొలిరోజే ఇక్కడ బహిరంగ సభ పెట్టి రైతు భరోసా నిధులు వేయాలని భావించింది. కానీ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని శిల్పకళా వేదికలో ఈ ప్రోగ్రాంను నిర్వహించింది.
కానీ రైతు పండుగ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం సీఎం ప్రసంగంలో వచ్చిన అప్పుల తిప్పలు.. చర్చల సవాళ్లకు పక్కదారి పట్టింది. దీంతో ఈ పండుగ ఉత్సాహం పోయి.. ఎవరెన్ని అప్పులు చేశారో తేల్చుకుందాం రా! అనే రాజకీయ వేడి రగులుకున్నది. దీంతో రైతుల ఖాతాల్లో పైసలు ఎలా పడుతున్నాయి..? రోజు వారీ డేటాను పట్టించుకునే వాడే లేడు.
రేవంత్ విసిరిన బంతి మళ్లీ రేవంత్కే తగిలింది. దీన్ని బాగా వాడుకున్నారు కేటీఆర్, హరీశ్రావు. దీంతో ఈ రాజకీయ వ్యూహం బెడిసి కొట్టిందని గ్రహించిన రేవంత్.. ఈ రైతుపండుగను మరోసారి నిర్వహించాలని తలంచాడు. అందుకే తిరిగి మళ్లీ అక్కడే రైతు ఆశీర్వాద సభ పేరుతో దీన్ని నిర్వహించేందుకు రెడీ అయ్యింది సర్కార్.
9వేల కోట్లు వేసిన నేపథ్యంలో రైతుల్లో ఉన్న అనుమానాలు కూడా నివృత్తి చేయడం.. ఇప్పటికే ఉన్న అపనమ్మకం, వ్యతిరేకతను పోగొట్టుకుని సర్కార్ పట్ల పూర్తి భరోసా వచ్చేలా చేసేందుకు ఈ వేదికను వినియోగించుకోనుంది సర్కార్. అదే సమయంలో రైతులకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు కూడా ధీటుగా జవాబివ్వాలని రేవంత్ సమాలోచనలు చేస్తున్నాడు.