పాపం.. కిషన్రెడ్డి… ఓ వైపు సీఎం రేవంత్రెడ్డి సహా కేబినెట్ మంత్రులంతా ఎడాపెడా తిట్ల దండకం అందుకుంటుంటే.. ఆయనకు ఆ పార్టీ నేతలు ఎవరూ సపోర్టుగా నిలవడం లేదు. ధాన్యం కొనుగోళ్ల అంశంతో పాటు పలు పర్మిషన్లపై సీఎంగా తను ఎంతో శ్రమపడి రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ది కోసం పాటు పడుతుంటే. . కిషన్రెడ్డి వీటన్నింటికీ అడ్డుపడుతున్నాడని రేవంత్రెడ్డి ఆరోపిస్తున్నారు. అంతే కాదు.. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం మహారాష్ట్ర సర్కార్ కు లేఖ రాస్తే అక్కడి సీఎంకు అప్పాయింట్ మెంట్ ఇవ్వొద్దని చెప్పి వచ్చింది కూడా కిషన్రెడ్డేనని ధ్వజమెత్తారాయన.
కేటీఆర్ చెప్పినట్టు కిషన్రెడ్డి వింటున్నాడని, ఇద్దరిదీ విడదీయరాని బంధమని కూడా అన్నారు. ఓ రకంగా కిషన్రెడ్డి తెలంగాణకు విలన్ అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు సీఎం. ఇది ఎవరూ ఊహించని పరిణామం. గతంలో కేసీఆర్ కూడా కిషన్రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చేతగాని దద్దమ్మ అంటూ తిట్ల దండకం చదివాడు. కానీ, రేవంత్ తరహాలో ఇలా వరుసబెట్టి.. ఉదాహరణలను జోడించి మరీ తిట్టడం, ఆరోపించడం.. ధాన్యం కొనకుంటే నీ సంగతి చూస్తా అనడం.. నిన్ను తిరగనియ్యం అని వార్నింగ్ ఇవ్వడం.. ఈ నెల 15 వరకు డెడ్లైన్ విధించడం.. ఇవన్నీ కిషన్రెడ్డిని ఇరకాటంలో పడేశాయి.
దీంతో రేవంత్ రెడ్డిని కౌంటర్ చేసేందుకు నానా తంటాలు పడుతున్నాడు ఆయన. ఒక్కడే ప్రెస్మీట్ పెట్టుకుంటున్నాడు. నేను కేసీఆర్ను అనుకుంటున్నావా? నువ్వు భయపెడితే భయపడటానికి..! అంటూ తనకు, కేసీఆర్, బీఆరెస్కు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని లింకు చేసి మరీ ఖండించుకుంటున్నాడు. రేవంత్ రెడ్డిని ఇరుకున పడేసేలా.. రా చూసుకుందాం.. తేల్చుకుందాం.. ఎవరేం చేశారో తెలంగాణకు అని.. కూడా సవాల్ విసురుతున్నాడు. కానీ దాన్ని రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం పెద్దగా పట్టించుకోవడం లేదు.
కానీ, యథావిధిగా తిట్ల దండకం మాత్రం ఆపడం లేదు. విమర్శలు చేయడం మాత్రం నిర్విరామంగా చేస్తూనే ఉన్నారు. ఊపిరి సలపనీయకుండా ముప్పేట దాడి కొనసాగుతూనే ఉంది. ఓ వైపు ఉత్తమ్కుమార్ రెడ్డి, మరో వైపు ఆది శ్రీనివాస్, వేముల వీరేశం.. ఇలా పనిగట్టుకుని కిషన్రెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నారు. తెలంగాణ సమాజం ముందు.. బీజేపీ పార్టీని, కేంద్ర వైఖరిని బయటపెట్టేలా సర్కార్ వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నది. కానీ తమ సీనియర్ నేత, కేంద్ర మంత్రిని ఇలా పొట్టు పొట్టు తిడుతున్నా.. ఏ ఒక్క నేత కూడా బయటకు వచ్చి మాట్లాడటం లేదు. ఖండించడం లేదు. ఒక్క రాంచంద్రారావు తప్ప.. అంతా తమాషా చూసినట్టే చూస్తున్నారు.
ఇంకొందరైతే.. బాగైంది… ఇట్లనే కావాలి.. అని లోలోన సంబరపడుతున్నారు. కిషన్రెడ్డి అంటే అంత వ్యతిరేకత ఉంది పార్టీలో. ఆయన వల్ల పార్టీకి ఏ మాత్రం ప్రయోజనం లేకపోగా.. ఇతరులను కూడా ఎదగనీయడని, ఎవరికీ సాయం చేయడనే ప్రచారం ఉంది. దీంతో ఇలాంటి సందర్భాలొచ్చినప్పుడు ఎవరికి వారే ముందుకు వచ్చి కిషన్రెడ్డికి మద్దతుగా నిలిచే ప్రయత్నం చేయడం లేదు. ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. తమను పట్టించుకోని ఆ నేత గురించి మేమెందుకు పట్టించుకుంటామనే దోరణి కనిపిస్తున్నది. దీంతో ఇలాంటి ఆపత్కాలంలో కిషన్రెడ్డి ఆపార్టీలో ఒంటరి అని తేలిపోయింది. అందుకే ఆయన ఒంటరిపోరాటానికే దిగాడు. కానీ కాంగ్రెస్ ముందు ఆయన శక్తి సరిపోవడం లేదు.