కేసీఆర్ మారలేదు. ఓడించినా ఆయన తన తప్పు తెలుసుకోలేదు. పైగా తమను ఓడించి జనం తప్పు చేశారని, అనుభవిస్తున్నారనే విధంగానే ఆయన ప్రసంగం సాగింది నిన్న జగిత్యాలలో. తప్పిదారి కాంగ్రెస్కు ఓటేయొద్దని చిలుకకు చెప్పినట్టు చెప్పిన.. విన్నారా? అని ఆయన తన పాత మాటలను గుర్తు చేశాడీ వేదికగా. దళితబందు జై భీమ్.. రైతుబంధుకు రాం రాం.. అయితదని చెప్పిన కదా! అట్లనే అయ్యంది కదా? అన్నాడు. దళితబంధు స్కీం పూర్తిగా అవినీతిమయమై… గులాబీ లీడర్లు పర్సెంటేజీలు పంచుకునే దగ్గరనే రచ్చ రచ్చ అయి బద్నాం అయ్యింది సర్కార్.
ఇక రైతు బంధు ఇస్తున్నారు. ఆపలేదు. కానీ కేసీఆర్ ఆ పాత మాటలు గుర్తు చేసి జనం తమల్ని ఓడించి తప్పు చేశారు.. అనుభవిస్తున్నారు కదా.. నా మాట వినలేదు… అందుకే ఇలా అయ్యిందని జనాన్ని తప్పుబట్టేలా అవే మాటలు ఇంకా మాట్లాడుతున్నారు. అప్పుడు ఎన్నికల సమయంలో కూడా ఆయన ఇంకో మాటన్నారు. నన్ను ఓడిస్తే నాకేం కాదు..నేను ఫాం హౌజ్లో రెస్ట్ తీసుకుంటా.. మీకే నష్టం… ఆలోచించుకోండి! అని. ఇలాంటి మాటలు ఆనాడు జనానికి కోపం తెప్పించాయి. ఎందుకంటే లీడర్ అనేవాడు బెదిరింపులకు దిగకూడదు. అదీ ప్రజలతో. పదేళ్లు అధికారాన్ని అనుభవించి ఉన్న కేసీఆర్.. గర్వంతో అన్నాడా? అధికారం పోబోతుందని తెలిసి చివరి అస్త్రంగా జనాన్ని భయపెడదామని అలా అన్నాడా తెలియదు. కానీ అది బూమరాంగే అయి కూర్చుంది ఆనాడు.
నాకేం కాదు.. మీకే నష్టం అంటే… జనానికి నష్టం జరుగుతూ ఉంటే నువ్వు సైలెంట్గా ఫామ్హౌజ్ల పంటవా? ఓడగొడితే మాపై ప్రతీకారం తీర్చుకుంటవా? మరి పదేండ్లు అధికారం ఇచ్చినం కదా? ఎప్పుడూ నీకు, నీ కొడుకుకే అధికారం ఇయ్యాల్నా..? జనంలో ఈ చర్చ వచ్చింది. అప్పుడు చెప్పినట్టే కేసీఆర్ నిజంగానే ఫాం హౌజ్ల నుంచి బయటకు రాలేదు. జనంపై ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే అనుకోవాలా? గతంలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే అదే అనుకోవాల్సి ఉంటుంది. ఇక ఓడిన తరువాత కూడా ఆయన మళ్లీ మళ్లీ అవే మాటలు మాట్లాడారు. తాను మారని మనిషినని నిరూపించుకున్నారు. ఏమన్నారు? కత్తి ఒకడి చేతికిచ్చి.. నన్ను యుద్దం చేయమంటే ఎలా? అని. అంటే అధికారం ఇస్తేనే ప్రజలకు మేలు చేస్తానంటావు.. ప్రతిపక్ష నాయకుడిగా వాళ్లకు ఎలాంటి మేలు చేయలేవా? ఓడించారు కాబట్టి అనుభవించండని.. అన్నట్టేగా.
ఇది మరీ కేసీఆర్ మానసిక రుగ్మతకు అద్దం పట్టేలానే ఉంది. ఈ మాటలు తరువాత కేటీఆర్ కూడా అందిపుచ్చుకున్నాడు. తానేం తక్కువ కాదని. ఇక జగిత్యాల సభలో ఆయన నొక్కి మరీ మరీ చెప్పాడు. వంద శాతం మేమే వస్తున్నామని. రాగానే హైడ్రాను రద్దు చేస్తూ తొలి సంతకం పెడతానని. అధికారం ఎవరికివ్వాలో జనం తేల్చుకుంటారు. ఓడిన మీరు ఏం చేయాలె? జనం సానుభూతిని పొందాలె. మేం మారామని జనం నమ్మేలా పరివర్తన చెందిన నాయకుల్లా వ్యవహరించాలె. కానీ అది ఏ కోశాన కూడా కేసీఆర్లో కనిపించడం లేదు. వెయ్యి జన్మలెత్తిన నేను చచ్చిపోను కొడకా! అన్నారు రేవంత్నుద్దేశించి. వెయ్యి జన్మలెత్తినా కేసీఆర్ మారడు. అదే అహంకారం. మిడిసిపాటు… అట్లనే ఉంటయ్.. అని చెప్పకనే చెప్పినట్టయ్యింది ఈ వేదికగా.