బండి సంజయ్ కొడుకు కేసులో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కేసు పూర్వపరాలు చట్టం పరిధిలో కొనసాగుతూనే ఉన్నా.. దీన్ని పక్కా రాజకీయంగా అస్త్రంగా వాడుకునేందుకు కేటీఆర్ అండ్ టీమ్ చూపిన అతి.. బండికి విపరీతమైన సానుభూతిని తెచ్చిపెట్టింది. దీంతో పార్టీ పరంగా బద్ద వైరుధ్యాలున్న కాంగ్రెస్ సోషల్ మీడియా… బండి సంజయ్ పక్షాన వకాల్తా పుచ్చుకున్నది. బీఆరెస్ సోషల్ మీడియాతో ఆడుకుంటున్నది.
మైనల్ బాలిక విషయంలో కనీసం సోయి లేకుండా.. పోస్టింగులు పెడుతూ.. బాధితురాలి పక్షాన కాకుండా.. బండి సంజయ్ను రాజకీయంగా టార్గెట్ చేసి.. రాజకీయంగా మైలేజ్ పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలపై విరుచుకుపడుతున్నారు. కాగా, బండి సంజయ్ను ఎంత తిడితే అంత సానుభూతి దొరుకుతుంది తప్ప…బీఆరెస్ కోరుకుంటున్నట్టు డ్యామేజీ మాత్రం కావడం లేదట. సానుభూతి దొరకుతుందట. ఢిల్లీ పెద్దలు కూడా ఈ విషయంలో బండికి భరోసా ఇచ్చారని తెలిసింది. అది కొడుకు చేసిన ఉదంతం.. అందులో తప్పేమిటో చట్టం తేలుస్తుంది. శిక్ష విధిస్తుంది. దానికి బండి రాజకీయానికి సంబంధం లేదు.. ఎవరి ఖర్మకు వారే బాధ్యులు.. అని బీజేపీ పెద్దలు అభయమిచ్చినట్టు తెలుస్తోంది.
దీంతో ఇక్కడ రాష్ట్ర పార్టీలో కూడా స్టేట్ ప్రెసిడెంట్ వాయిస్ మారింది. తప్పుదిద్దుకునే పనిలో పడ్డారు. రాం చంద్రారావు ఇవాళ మాట్లాడుతూ… అది కుటుంబ వ్యవహారం.. అందులో బండి సంజయ్కి ఏం సంబంధం లేదు. మా పార్టీకి, మా లీడర్కు.. ఆ కేసుకు ఏం సంబంధం లేదని అన్నాడు. పోస్టర్లు వేస్తూ.. బండి సంజయ్ పేరును బద్నాం చేయాలని చూస్తున్నారని, ఇది పూర్తిగా రాజకీయంగా కక్షపూరితంగా బీఆరెస్ వ్యవహరించే తీరుగా ఆయన ఆక్షేపించారు. దీంతో బండి సంజయ్ ఇష్యూలో పూర్తిగా స్పష్టమైన లైన్ తీసుకున్నది రాష్ట్ర పార్టీ. మొన్నటి దాకా ఎవరికి వారే అన్నట్టుగా నేతలు వ్యవహరించారు. దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఇవాళ పార్టీ ప్రెసిడెంటే మాట్లాడే సరికి, గ్రూపులుగా ఉన్న నేతలకు అధిష్టానం నుంచి ఓ క్లారిటీ సంకేతమొచ్చినట్టు అర్థమైపోయింది.
దీన్ని ఎంతలా పెద్దది చేద్దామనుకున్నా.. బండిని బద్నాం చేయాలని ఆ పార్టీ నేతలే యోచించినా.. కార్యకర్తల కొండంత అండ ఉందనే విషయం అధిష్టానానికి అర్థమైపోయింది. దీంతో అధిష్టానం బండి సంజయ్ నాయకత్వాన్ని ఏమాత్రం తగ్గించే యోచనలో లేదు. అభయమిచ్చి మరీ మేమున్నామనే భరోసానింపడం.. బండి వర్గీయులకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈ ఉదంతాన్ని బీఆరెఎస్ ఎంత వాడుకోవాలనుకున్నా.. బీజేపీని లేపినట్టే అయింది తప్ప.. ఆ పార్టీకి మైలేజీ మాత్రం రాలేదు. పైగా సందట్లో సడేమియా అన్నట్టుగా.. ఈ కార్ రేసు కేసులో కేటీఆర్కు ఏసీబీ కోర్టు నుంచి నోటీసులు రావడంతో బీఆరెస్ అత్యుత్సాహానికి బ్రేకులు వేసినట్టయ్యింది. కొండంత రాగం తీసి… అన్నట్టుగా బీఆరెస్ చేస్తున్న విస్తృత ప్రచారానికి ప్రజల నుంచి కూడా మద్దతు కరువైంది.
ఇది రాజకీయ కోణంలో చేసే డ్రామాగా చూస్తున్నారు తప్పితే… ఆ పార్టీ చేసే ఆందోళనలు .. ప్రెస్మీట్లు.. నిత్యం ఇదే అంశాన్ని పట్టుకుని లాగేతత్వం ఇదంతా రోత పుట్టించే విధంగా చూస్తున్నారు. దీన్ని పూర్తిగా కేటీఆర్ వ్యక్తిగతంగా తీసుకున్నాడని అందరికీ అర్థమైపోయింది. ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ను రంగంలోకి దింపాడు. కేటీఆర్ బాగా ఇంట్రస్టు చూపుతున్నాడని గ్రహించాడు.. ఆరెస్.. మరీ మితిమీరి ప్రెస్మీట్లలో మాట్లాడి ఉన్న పరువు తీసుకున్నాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్లో బీరెస్కు రావాల్సిన మైలేజీ ఏమోగానీ.. బండి సంజయ్కు ఢిల్లీ పెద్దల వద్ద ఉన్న పలుకుబడి ఏమాత్రం తగ్గలేదని, అదింకా బలపడిందనే విషయం రూడీ చేసినట్టయ్యింది. డ్యామిట్ కథ అడ్డం తిరిగిందని అనుకోవడమే మిగిలింది బీఆరెస్ నేతలకు.