ఆయన తన్మయత్వం చెందాడు. మనసులో ఉన్న భావావేశాలను బయటకు కక్కేశాడు. తన ఫీలింగ్సును ఫ్రీగా చెప్పుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా తీరని కోరిక.. మోడీని కలిసి చేతులు రెండు పట్టుకుని.. స్పర్శించి .. పులకించి.. మదిలోంచి భావావేశం తన్నుకొచ్చి.. ఆపతరం కాక.. ఆగమాగమై దైవ నామస్మరణ చేశాడు. తప్పేంటీ? ఇంతోటి దానికే అంతలా దెప్పి పొడవాలా? ఆ కవిహృదయాంతరాల్లోకి తొంగి చూసే అర్హత మీకు లేకపోతే.. కామూష్గా ఉండండి. అలా కామెంట్లతో నోరు పారేసుకోండి. ఆయనేమన్నాడు? పొగిడాడు! ఎవరినీ? స్వయానా ప్రధానిని. ఏమని? నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆది శంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. వాళ్లను చూడలేము కూడా. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మధన్యం.
ఇదీ ఆయన చేసిన పోస్టింగు. ఇక దీనిపై ఎగబడ్డారు. తెగబడ్డారు. తనికెళ్ల భావాలాయన చెప్పాడు. నా జన్మ ధన్యమన్నాడు. ఆయన జన్మ ఆయనిష్టం. అదాయన వ్యక్తిగతం. మనందరి జన్మలు జన్మం అలాంటి ప్రధాని ఉన్నందుకు..! అని అనలేదు కదా! ఆయన భారత ప్రజలందరికీ రాముడే! అని డిసైడ్ చేయలేదు కదా. గీడ ఈ తోట రాముడు డిసైడ్ చేసిండు. అప్పుడు యమలీల సిన్మాల స్వర్ణప్యాలెస్ డిసైడ్ చేస్తే.. ఇప్పుడు మోడీ కోసం రాముడు, కృష్ణుడిని డిసైడ్ చేసుకున్నడు అంతే. ఎవరికి భావాలు వారివి. ఇలా బయటపెట్టడం, భయపడకుండా మోకరిల్లడం కూడా సాహసమే సుమండీ! ఇది అందరితో కాదు. ఆయన అన్నీ తెలిసే పెట్టాడు. తెలివిలో ఉండే పెట్టాడు. అందరికీ తెలవాలనే పెట్టాడు. వివాదం కావాలని కూడా చూశాడు. ఇలా చేస్తారనీ తెలుసు. అలా అవుతుందని తెలుసు.
అన్నీ తెలిసీ.. తప్పు కదరా భరిణీ! అని తను శంకరుడిని తిట్టినట్టుగా, పొడిగినట్టుగా చేయాలని కోరుకున్నాడు. కానీ పొడగ్తలైతే రావడం లేదుగానీ, తుక్కు తుక్కు తిట్లైతే వచ్చి కుప్పలు తెప్పలుగా పడుతున్నాయి. పేదల గురించి పట్టించుకునే కవి గాదీయన.. శంకరుడి సేవలో ఉండి.. కడుపునిండి ఉన్న కవి కదా..! మోడీని దేవుడితోనే పోల్చుతాడంటున్నారు కొందరు.
ఆయనకేదో అవార్డో గివార్డో కావాలేమో.. పాపం ఆయన తంటాలు ఆయనవంటున్నారు ఇంకొందరు. ఎవరేమనుకున్నా..అంతే.. మరీ స్వామిభక్తి పెరిగిపోయి.. మనషి రూపంలోని మోడీ.. దైవ స్వరూపుడిగా అగుపిస్తే.. అది ఆయనలోని దివ్యశక్తిగా చూడాలె తప్ప.. మానసిక ప్రకోపిగా చిత్రీకరించడం ఎమన్నా బాగుందా? ఒక ఎన్టీఆర్లో రాముడిని, కృష్ణుడిని చూసి ఆరాధించారు అభిమానులు. అయినంత మాత్రాన వాళ్లంతా టీడీపీ కార్యకర్తలా? కాదే. కానీ ఇప్పుడు మోడీని దేవుడిగా తలిస్తే.. ఈయన బీజేపీ కార్యకర్తా? అభిమానా? సరే ఏదైనా అనుకోండి… తోట రాముడి డిసైడ్ చేసిండు. అంతే. నా దేవుడు మోడీ.. మీకేం బాధరా బోడి!అని భరిణి ఎంచక్కా బాదరబందీ లేకుండా బాజాప్తాగా బాజాపా కవిత్వాన్నొకటి సీరియస్గా రాసుకోవడంలో లీనమైపోయాడట.