కేసీఆర్ ఒక్క పీఎంగిరీ తప్ప అన్నీ చేసి వదిలేశాడట. ఆయనకు పదవులు కొత్తకాదన్నాడు కేటీఆర్. కేసీఆర్ను పోగొట్టుకుని.. ఆయన్ను ఓడగొట్టుకుని జనాలే తీవ్రంగా నష్టపోతున్నారని హితోక్తులు వళ్లెవేస్తున్నాడు. ఇప్పుడీ ముచ్చటెందుకు కేటీఆర్! మీరు ఇంకా మారరా? అని జనం చేత తిట్టించుకునే విధంగానే ఉన్నాయా మాటలంటున్నారంతా.
అవును.. అప్పుడు కేసీఆర్ కూడా ఇవే మాటలన్నాడు. ఎన్నికలకు ముందు ప్రచారంలో. నేను ఓడిపోతే నాకేం నష్టం లేదు. నేను పోయి ఫామ్హౌజ్ల రెస్ట్ తీసుకుంటా.. మీకే నష్టం.. అని చివరాఖరకు జనాలకు బెదిరించేందుకు కూడా వెనుకాడలేదాయన. కానీ జనం వినలేదు. ఓటమి చెందాడు కేసీఆర్. నిజంగానే, ఆయన అన్నట్టుగానే, ప్రతీకారం తీర్చుకున్నట్టుగానే.. ఫామ్హౌజ్లో సేద తీరుతున్నాడు.
ఇప్పుడు బయట కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్న కేటీఆర్ కూడా అవే చిలకపలుకులు పలుకుతున్నాడు. ఆయన చెప్పింది వినలే. ఓడగొట్టుకున్నారు. ఇప్పుడు ఎవరికి నష్టం.. మీకే కదా! అని జనం నుంచి సానుభూతిని పొందే ప్రయత్నంలో అన్న ఆ మాటలు.. వారి అహంకారానికి చిహ్నంగానే చూస్తున్నారు జనం.
మొన్నటికి మొన్న ఏం అన్నాడు? కేసీఆర్ ఏడుండాల్నో ఆడున్నాడు! అని. అంటే ఓడిపోతే ఫామ్హౌజ్లనే ఉండాల్నా. జనంలోకి రావొద్దా. తీరా సమయం వచ్చిన తరువాత వచ్చి మాట్లాడతాడేమో. కేసీఆర్ అన్నాడు ఆ మధ్యన… ఏమని? కేసీఆర్ అన్న నువ్వు రావాలన్నా అని జనం అంటున్నారని, కత్తి ఎవడికో ఇచ్చి.. నన్ను యుద్దం చేయమంటరా? అని.
దీన్ని కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో రిపీట్ చేశాడు. అంటే ఓడిపోతే కనిపించడు. గెలిస్తే వస్తాడు. కానీ చెప్పుడు మాత్రం నీతి సూక్తులు ఏమని చెబుతున్నాడంటే.. తమకు కేసీఆర్ ఎప్పుడూ ఒకటి చెబుతాడట. గెలిస్తే పొంగిపోవద్దు.. ఓడితే కుంగిపోవద్దని. మరి ఓడితే ఫామ్హౌజ్కే ఎందుకు పరిమితమైనట్టు. జనం మీద ఎందుకు అలిగినట్టు. నష్టం జరుగుతుందని తెలిసినా పల్లెత్తు మాట ఎందుకు మాట్లాడనట్టు..! చేసిన లోపాలన్నీ సమర్థించుకుంటూ.. పైగా అన్ని పదవులు చేశామని, పీఎం ఒక్కటే మిగిలుందని అంటున్నాడు కేటీఆర్.
ఇంకా నయం.. పాత విషయాలు గుర్తు చేయలేదు. ఆ పీఎం కావడం కోసమే.. టీఆరెస్ను బీఆరెస్ అని మార్చినాము.. ఢిల్లీల చక్రం తిప్పుదామని చూస్తే గల్లీలనే ఓడిపోయి ఇలా అయ్యింది మా పరిస్థితి అని కూడా చెప్పేదుండె.. అని అనుకుంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. కేసీఆర్ మౌనముని పాత్ర ఆ పార్టీలోనే ఎవరికీ మింగుడు పడటం లేదు.
ఆయన ఎవరినీ కలవకపోవడం, ఏం మాట్లాడకపోవడం.. కేటీఆర్ అంతా తానై తిరుగుతూ.. ఇలా రోజుకో మాట మాట్లాడుతూ..ఉన్న పరువును గంగలో కలిపేలా చేస్తున్నాడనే అపనమ్మకం చాలా మందిలో ఉంది. పైగా నేను కేసీఆర్ అంత మంచోడ్ని కాదు.. మిమ్మల్ని వదలా అంటూ బెదిరింపు వ్యాఖ్యలు.. ప్రతీకారేచ్చతో రగిలిపోయే విధంగా ఆవేశంగా చెప్పే డైలాగులు.. పార్టీకి మేలు చేయకపోగా.. మరింత నష్టాన్నే కలిగిస్తున్నాయని అంటున్నారు గులాబీ అభిమానులు.