ఒకరు తగ్గొద్దంటున్నారు. ఇంకొకరు పాత బలం కొనసాగిస్తే చాలంటున్నారు. సీఎం రేవంత్రెడ్డి మాత్రం తగ్గేదే లే. పెరగాల్సిందేనంటున్నారు. ఈ లెక్కలన్నీ లోక్సభలో తెలంగాణ బలం గురించి.. ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ ప్రాతినిధ్యం గురించి. కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియను హడావుడిగా అమలు చేసే పనికి పూనుకున్న నేపథ్యంలో.. తెలంగాణలో ఏ పార్టీ స్పందన ఎట్లా ఉంది? ఎవరేమంటున్నారు? అనే చర్చ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నది.
సీఎం రేవంత్ రెడ్డి తెరమీదకు తీసుకొచ్చిన జీఎస్డీపీని అనుసరించి .. హైబ్రిడ్గా తెలంగాణకు సీట్ల కేటాయింపు జరగాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కేంద్రానికి లేఖ రాయడం… ఇవాళ చర్చలో బీజేపీ ఎంపీ తేజస్వీ దీన్ని విమర్శించడంతో ఇది మరింత చర్చకు వచ్చింది. అసలు లోక్సభలో తెలంగాణ బలమెంత..? మొత్తం 3.13 శాతంగా ఉంది. ఇప్పుడు దీని చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి.ఈ శాతం గురించి ప్రధానంగా తెరపైకి వచ్చింది. కవిత ఈ శాతాన్ని ఏమాత్రం తగ్గించేది లేదని.. అలా తగ్గిస్తే తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాడుతామని కేంద్రానికి వార్నింగ్ ఇచ్చింది.
కీలకమైన ప్రాజెక్టులకు ఇప్పటికే జాతీయ హోదా కూడా దక్కడం లదేని, దీనికి కారణం.. లోక్సభలో తెలంగాణ శక్తి తగ్గి ఉండటమేనన్నారు. మరి అలాంటి ప్రాతినిధ్యాన్ని మరింతగా కుదించేస్తే.. మమ్మల్ని పట్టించుకునేవారెవరు? అని నిలదీస్తోంది. కేటీఆర్ ఇదే విషయాన్ని కొంచెం విపులంగా చెప్పాడు. దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాల.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ సాధారణంగా దక్షిణాదిలో కలుపుతారు) రాజకీయ ప్రాతినిధ్యం 42 శాతంగా ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అయ్యేలా చూడాలి.
ఈ పర్సెంటేజీలో ఏ మాత్రం తగ్గొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారిగా రాష్ట్రాలకు 50శాతంగా సీట్లను పెంచే ఆలోచన చేసిన బీజేపీ… ఉత్తర భారత దేశం రాష్ట్రాల సీట్లను గణనీయంగా పెంచుకుని.. తద్వారా మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నదని, దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మీరెన్నైనా పెంచుకోండి.. మా వాటా దక్కొద్దు.. మా ప్రాతినిధ్యాన్ని తగ్గించి మమ్మల్ని దేశ రాజకీయాల్లో మరింత పలుచన చేయొద్దు.. అనేదే అందరి ప్రధాన డిమాండ్. అయితే కవిత, కేటీఆర్ ఇంచుమించుగా .. ప్రస్తుతం ఉన్నవాటాను తగ్గించుకుండా ఉంచితే చాలనే సామరస్యపూరిత డిమాండ్ చేయగా.. రేవంత్రెడ్డి మాత్రం.. మేం ఎందులో తక్కువ లేము.. పన్నులు ఎక్కువగా తక్కువగా తీసుకుంటు నష్టపోతున్నాం.. ఇప్పుడు ఎంపీ సీట్ల విషయంలో కూడా మాకు అన్యాయమేనా? తగ్గేది లేదు.. పెరగాల్సిందేనంటున్నారు.
ఈ శాతాల జోలికి రేవంత్రెడ్డి వెళ్లడం లేదు. జీఎస్డీపీ ఆధారంగా హైబ్రిడ్.. అంటే ఆర్థిక వనరులు, పన్నుల చెల్లింపుల ఆధారంగా సగం అట్ల, సగం ఇట్లా చేస్తే తెలంగాణకు న్యాయం జరుగుతుందనే వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఈ లెక్కన లోక్సభలో తెలంగాణ ప్రాతినిధ్యం ఇప్పుడున్నదానికంటే కూడా పెరుగుతుంది. కానీ దానికి కేంద్రం సుముఖంగా లేదు. కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియకు కేటీఆర్, కవిత మా బలం తగ్గకుండా చూడండనే వాదనే తెరపైకి తీసుకురాగా… ఇదసలు కరెక్టే కాదని, ఈ విధానంతో కచ్చితంగా తెలంగాణ నష్టపోతుందని రేవంత్ మండిపడుతున్నారు. చేస్తే ఇట్లా చేయండి.. లేదంటే ఈ బిల్లులనే వెనక్కి తీసుకోండనే కచ్చితమైన డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంతో తాడోపేడో అనే తీరులో రేవంత్ వైఖరి ఉంటే.. సామరస్య పూర్వక విధానంలో కవిత, కేటీఆర్… డిమాండ్లుంటున్నాయి. బీజేపీతో భవిష్యత్ రాజకీయ వ్యూహాల నేపథ్యమూ ఇందులో ఇమిడి ఉంటుందనే చర్చకు కూడా ఈ డిమాండ్లు ఊతమిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.