రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ సాధారణంగా పోటీ అనేది ఉంటుంది. కానీ,తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కుటుంబ రాజకీయాలు కాకరేపుతున్నాయి. అన్నాచెల్లెళ్ల మధ్య పోరు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.. ఆ పార్టీని ఎలాగైనా అధికారంలోకి రాకుండా చేయాలని తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పార్టీ అధినాయకురాలు కల్వకుంట్ల ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె బయటకు రావడానికి పరోక్షంగా తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కారణమని ఆమె పలుమార్లు ఆరోపించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్ రావులో మాయలో కేటీఆర్ పడ్డారని గతంలో ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్టు అయ్యాక ఆమె దాదాపు 6 నెలల పాటు తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, హరీశ్ రావులు ఆమెకు బెయిల్ ఇప్పించడానికి నానా తంటాలు పడ్డారు.కేసీఆర్ ఆదేశాల మేరకు నెలకొసారి ఢిల్లీ వెళ్లి అక్కడ సుప్రీంకోర్టు న్యాయవాదులతో మంతనాలు జరిపారు. చివరకు కవిత జైలు నుంచి బయటకు వచ్చాక మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్లో నిర్వహించిన బహిరంగ అనంతరం తన తండ్రికి కవిత లేఖ రాశారు.అది కాస్త బయటకు రావడంతో కల్వకుంట్ల కుటుంబంలో పదవుల పంచాయితీ నడుస్తున్నదన్న విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం కేటీఆర్ కొనసాగుతున్నారు.అయితే,తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇప్పించాలని కవిత..కేసీఆర్ వద్ద ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తున్నది.ఈ విషయంలో అన్నాచెల్లెళ్ల మధ్య గొడవ జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది.దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని..ఈ విషయాన్ని తాను వ్యతిరేకించానని కవిత మీడియా ఎదుట బయటపెట్టారు. ఆ తర్వాత బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాలు జరిగాయని, తనను పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. కవిత ఆరోపణల అనంతరం ఆమెను పార్టీ నుంచి బీఆర్ఎస్ అధినాయకత్వం సస్పెండ్ చేయడంతో పొలిటికల్ ఐడెంటిటీ కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలెట్టారు.
కేసీఆర్ బయటకు రావడానికి అసలు కారణం అదే.. కోదండరాం సంచలన వ్యాఖ్యలు
గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ను స్థాపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను.. తెలంగాణ ప్రజలు రెండు సార్లు ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆయన పార్టీ పేరును (బీఆర్ఎస్)గా మార్చారు.దీంతో ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న కనెక్షన్ కట్ అయ్యింది. అనంతరం వచ్చిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ క్రమంలోనే పార్టీ పేరును మరల టీఆర్ఎస్గా మార్చాలని చూస్తున్నట్టు ఇటీవల కేటీఆర్ ప్రకటించారు. అందుకు ఈసీ నుంచి అప్రూవల్ రావాల్సి ఉన్నది.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని దూరం చేసేందుకు కవిత..టీఆర్ఎస్ పేరిట కొత్త పార్టీని స్థాపించారు.వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పేరిట ఎన్నికల్లో కవిత బరిలోకి దిగనుంది. గతంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలకు మధ్య కనెక్షన్ బాగుండేది. అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కవిత భావిస్తుందని తెలుస్తున్నది. అదే నిజమైతే బీఆర్ఎస్ పార్టీకి అధికారం దూరమవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం కావాలనే కేటీఆర్ కలకు.. కవిత చెక్ పెట్టనుందని చర్చ జరుగుతున్నది.