దిల్సుఖ్నగర్లో నిరుద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. త్వరలో పోలీస్ కానిస్టేబుళ్లకు సంబంధించిన ఐదు వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయనున్నారు. దీనిపై పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువత భగ్గుమన్నది. దాదాపు 20వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం హామీ ఇచ్చి ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
నిత్యం అక్కడ దిల్సుఖ్నగర్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. సచివాలయం ముట్టడికి కూడా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పార్టీలకతీతంగా ఈ ఉద్యోగాల కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. పరిస్థితి తీవ్రతను తెలుసుకుని కవిత దిల్సుఖ్నగర్కు వెళ్లారు. అక్కడ నిరుద్యోగులతో మట్లాడారు. వారి నిరసనలకు మద్దతు తెలిపారు. వారితో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. 20వేల ఉద్యోగాలు వేసేంత వరకు ప్రభుత్వాన్ని వదిలేది లేదని, నిరుద్యోగులతో కలిసి ఉద్యమిస్తామని ఆమె ప్రకటించి ఉన్నారు.
అయితే ఇదే అంశంపై నిరుద్యోగుల ఆందోళనలకు మద్దతు ఇవ్వాల్సిందిగా, దిల్సుఖ్నగర్ రావాల్సిందిగా కేటీఆర్కు పిలుపువచ్చింది. వారంతా కలిసి పార్టీలకతీతంగా ఆహ్వానించారు. అందరి మద్దతు కూడగట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నది వారి ఉద్దేశం. కానీ కేటీఆర్ రాలేదు. స్పందించలేదు. చాలా బిజీగా ఉండటం మూలంగా అతను రాలేకపోయాడట. అందుకే వారినే తెలంగాణ భవన్కు రప్పించాడు. ఈ విషయం స్వయంగా కేటీఆరే చెప్పాడు.
తెలంగాణ భవన్కు పిలిపించుకుని వారికి సంఘీభావం తెలిపాడు. వారు పిలిచినా తను వెళ్లలేకపోయానని, త్వరలో వెళ్తానన్నాడు. ప్రతిపక్షమంటే పిలవకున్నా సమస్య ఎక్కడుందో తెలుసుకుని మరీ వెళ్లాలి కదా! మరి కేటీఆర్ను పిలిచినా వెళ్లకపోవడమేమిటో? ప్రధాన ప్రతిపక్షం బీఆరెస్సా, టీఆరెస్సా..? ఇదే అనుమానం వస్తుంది అందరికీ.
ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లపై కూడా కవిత నిలదీస్తూ ఉన్నారు. మూసీ, మెట్రో కన్నా పేదలకు కావాల్సింది ఆసరా పింఛన్లేనని. కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, వింతతువులు లక్షలాది మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారనే అంశాన్ని ఆమె లేవనెత్తారు. బీఆరెస్ మాత్రం అనవసరమైన విషయాలపై కాలం వెళ్లదీస్తోంది. చర్చలు, సవాళ్లు, అప్పులు అంటూ.. రెచ్చగొట్టే రాజకీయాలకు ఇచ్చినంత ప్రయార్టీ క్షేత్రస్థాయిలో జనం ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
ఉద్యమకారుల కోసం ఆమె నిన్న చేసిన భూ పోరాటం.. ఆందోళన చూసిన తరువాత కూడా కేటీఆర్, కవిత మధ్య ఉన్న తేడాలను పోల్చి చూస్తున్నారు చాలా మంది. ఇప్పుడు కేటీఆర్ స్వయంగా చెప్పుకుంటున్నాడు.. దిల్సుఖ్నగర్కు కూడా వెళ్లలేకపోయానని. ఈ ఇద్దరి మధ్య ఎంత తేడా..? అనే డిస్కషన్ ప్రస్తుతం నడుస్తున్నది రాష్ట్రంలో.