మండవ వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత. రాజకీయ విలువలు పాటించే వ్యక్తి. బీఆరెస్లో చేరినా అక్కడ ఇమడలేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పంచన చేరినా.. ఇక్కడా ఇమడలేదు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. చాలా రోజుల తరువాత నిన్న అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సభలో కనిపించాడు. మాట్లాడానికి అవకాశం ఇచ్చారు. అప్పటికీ ఇప్పటికీ తేడా లేదు. అదే కంచుకంఠం. సూటిగా, ఉన్నదున్నట్టుగా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి సీఎం కావడానికి కూడా ఎన్టీఆరే స్పూర్తి అని అన్నాడు. యువకులుగా ఉన్నప్పుడు ఆయన ప్రసంగంతో ఉత్తేజితులై రాజకీయాల్లోకి వచ్చామన్న ఆయన.. రాడికల్స్ కూడా తీసుకురాని విప్లవాత్మకమైన మార్పులను జనజీవనంలో తీసుకొచ్చిన మహానేత ఎన్టీఆర్ అని కీర్తించాడు.
ఆ తరువాత చంద్రబాబు అసమ్మతి అంశం కూడా సుతిమెత్తగా, పరోక్షంగా టచ్ చేశాడు. అప్పుడు ఆ రాజకీయ వాతావరణంలో అన్నను వీడి పోవాల్సి రావడం.. ఇప్పటికీ బాధాకరమేనని ఆయన పశ్చాత్తాపపడ్డారు.అప్పటి జ్ఞాపకాలను ఇంకా నెమరువేసుకుని తన విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు మండవ. ఇక అదే రోజు మోత్కుపల్లి నర్సిహుంలు కూడా జయంతి సందర్బంగా ఆయనకు నివాళులర్పించి.. భావోద్వేగానికి గురయ్యాడు. కంటతడి పెట్టుకున్నాడు. ఇది నటన కాదు. రాజకీయం కోసం చేసే డ్రామాలు అసలే కావు. అప్పటి నేతలు.. ఆయన ఇచ్చిన రాజకీయ పదువులు, పంచిన ఆత్మీయతను ఇప్పటికీ మరిచిపోలేని వారి విశ్వాసమే ఇందుకు తార్కాణం. ఎన్టీఆర్ అంటే అంతటి అభిమానం ఇంకా ఉంది తెలంగాణ లీడర్లలో అని చెప్పడానికి ఇదో నిదర్శనం. వాస్తవానికి అప్పటి రాజకీయాలు ఇప్పుడు లేవు .. అని కూడా వీరు నమ్ముతున్నారు.
అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తమకు ఇప్పటి రాజకీయాలకు సెట్ కాదని డిసైడ్ చేసుకున్నట్టున్నారు. కేసీఆర్ కూడా మోత్కుపల్లిని ఆశల పల్లకిలో ఊరేగించాడు. కానీ ఆ తరువాత షరా మామూలుగా పట్టించుకోలేదు. మండవకు కూడా రెండు పార్టీల్లో భంగపాటు తప్పలేదు. ఇప్పటి నేతల్లాగా పట్టించుకోకున్నా..పదవుల కోసం వెంపర్లాడే రకాలు కాదు.. ఈ నేతలు. అందుకే దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మరోసారి ఇలా బయటకు వచ్చి తమ మనోభావాలను, భావోద్వేగాలను తెలియజేశారు.
కష్టకాలంలో అన్నతో ఉండలేకపోయామనే పశ్చాతాపాన్ని కూడా ప్రకటించుకున్నారు ఈ సందర్బంగా. ఎన్టీఆర్ స్పూర్తితోనే ఇంత వరకు రాగలిగామని కేసీఆర్, రేవంత్ ఇద్దరూ చెప్పుకున్న సందర్బాలున్నాయి. కానీ ఆ నేతలాగా.. ఇప్పుడు వీరిద్దరు తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవడంలో మాత్రం విఫమయ్యారని చెప్పుకుంటున్నారు అప్పటి సీనియర్ నేతలు. అందుకే రేవంత్ నోటి వెంట నుంచి వచ్చిన.. ఎన్టీఆర్ ద్వారా తెలంగాణకు అందివచ్చిన నేతలంతా ఇప్పుడు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. చివరకు కేసీఆర్తో సహా. ఆయన కూడా ప్రస్తుతానికి ఫామ్హౌజ్కే పరిమితమయ్యాడు.