అనవసర టాపిక్ మాట్లాడి.. జనం మరిచిపోకుండా అలా సోషల్ మీడియాలో కొద్ది రోజులు చక్కర్లు కొట్టాలనుకుంటాడు అర్వింద్. అదే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్ (డీఎస్) చిన్న కొడుకు. పాలసీపరమైన ఇష్యూలు మాట్లాడేందుకు, ఇక్కడ హైదరాబాద్లో పెద్దలు చాలా మందే ఉన్నారు. కానీ పనిగట్టుకుని తగుదునమ్మా అని అన్నింటా వేలు దూర్చి… తన నోటి దూల తీర్చకుంటాడంటారు ఆ పార్టీ నేతలే కొందరు.
ఇవాళ నిజామాబాద్లో ప్రెస్మీట్ పెట్టి.. సీఎం రేవంత్ ఎప్పుడైనా జంప్ కావొచ్చన్నాడు. బీజేపీ పార్టీలోకేనట. మరి బీజేపీ పార్టీలోకి మోడీ సైతం ఆహ్వానిస్తున్నడంట.. మీ పార్టీకి ఇక్కడంత సీన్లేదు. మీ నేతలకు అధికారంలోకి తీసుకురావడం చాతకాదనే కదా! ఇంకేమన్నాడు..? ఉత్తమ్కో, కోమటిరెడ్డి వెంకటరెడ్డికో సీఎం ఇచ్చి.. రేవంత్కు ఏదో ఒక మంత్రి పదవి పడేస్తే అయిపోవు..! అన్నడు. అంటే సీనియర్లను రెచ్చగొట్టుడన్నమాట. కందకు లేని దురద కత్తిపీటకెందుకన్నట్టు.. ఆ పార్టీలోనే సైలెంట్గా అంతా ఐక్యంగా పనిచేసుకుంటున్నారు.
ఇప్పుడు అర్వింద్ పనిగట్టుకుని వచ్చి రెచ్చగొడితే అక్కడ రెచ్చిపోయేవారెవరూ లేరు. ఇది చాలదంటూ.. తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు ఈ సందర్బంగా. మా నాయ్న మీ పార్టీకి మస్తు సేవలు చేసిండు..!అందుకే మీ మంచి కోసమే ఇదంతా చెబుతున్నా… అని కవరింగు ఇవ్వపోయాడు. తండ్రిని గుర్తు చేశాడు కాబట్టి.. ఇప్పుడు కాంగ్రెస్లో ఆ తండ్రి గురించి చర్చ జరుగుతోంది. పార్టీ డీఎస్ చేసింది ఏమీ లేదు. ఆ పార్టీని పట్టుకుని ఉంటే.. ఎంత గౌరవం ఇవ్వాలో, ఎన్ని పదవులు ఇవ్వాలో అన్నీ ఇచ్చింది. ఓ దశలో సీఎం పదవి దాకా డీఎస్ వెళ్లాడంటే అది కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఇచ్చిన గౌరవం. పార్టీలో స్వేచ్ఛ. కానీ దాన్ని నిలుపుకోలేకపోయాడు డీఎస్.
ఎమ్మెల్సీ పదవి రెన్యూవల్ విషయంలో తనకు కాకుండా ఎవరికో ఇచ్చారనే చిన్న కారణంతో అలిగి.. తనను అవమాన పరిచారని, కేసీఆర్తో మాట్లాడుకుని పార్టీ వీడిన విషయమూ గుర్తు చేసుకుంటున్నారు. రాజ్యసభ కు పంపాలని, తన పెద్ద కొడుకు సంజయ్కు పదవి ఇవ్వాలని, ఇలా ఫ్యామిలీ ప్యాకేజీయే ఆయన మాట్లాడుకున్నారు. అనుకున్నట్టుగానే రాజ్యసభ మెంబర్ను చేశాడు కేసీఆర్. కానీ ఆ తరువాత పట్టించుకోలేదు. అదేమైనా కాంగ్రెస్ పార్టీనా? అంతే ఒక్కసారి ఆ దొడ్లేకు పోతే.. ఆ మందల కలిసిపోవాల్సిందే. ఎందుకు పార్టీ మారాన్రా బాబూ.. అని అనుకుంటున్న తరుణంలోనే .. అర్వింద్ బీజేపీ పొలిటికల్ ఎంట్రీ ఆయన పరిస్థితిని మరింత సంకటంగా మార్చింది.
నీ కొడుకు నువ్వు చెబితే కూడా వినడా? నువ్వేం లీడర్ వయా..!అని అపిపించుకోవాల్సి వచ్చింది కేసీఆర్తో. అందరి ముందూ అన్న ఆ మాటలకు అవమానభారంతో ఇంటికే పరిమితమయ్యాడు. రాజకీయాలకు దూరం. అర్వింద్ ను బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా గెలిపించేందుకు సర్వ ప్రయత్నాలు చేశాడు. కాంగ్రెస్ను వీడాడు. కేసీఆర్ పంచన చేరాడు. బీజేపీ ని ఎంపీగా గెలిపించాడు. మొత్తం డీఎస్ రాజకీయ చరమాంకం వరకు ఇదీ ఆయన నేపథ్యం. చరిత్ర. ఆయను ఎటూ కాకుండా చేసిందే అరవింద్. కొడుకు కోసం ఇనన్నీ చేసి.. చివరకు పెద్ద కొడుకు కోసం మళ్లీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించుకుంటే.. లేదు లేదు.. మా నాయ్న కాంగ్రెస్లో చేరలేదని ప్రకటన.. జీవిత చరమాంకంలో ఆయనను ఎవరు బాధపెట్టారు.
ఏ పార్టీ లీడర్ కాకుండా ఎవరు చేశారు. ఇప్పుడు రేవంత్ను ఉద్దేశించి రాజకీయ సూక్తులు. ఏ పార్టీ ఎప్పుడు మారుతాడోనని నీతులు. తండ్రి పేరు తీశాడు కాబట్టి ఈ ముచ్చట్లన్నీ చెప్పుకుంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు ఇప్పుడు. అనుడెందుకు? అనిపించుకునుడెందుకు?? అర్వింద్ అంతే. ఎవరికీ అర్థం కాడు. ఆ పార్టీ నేతలతో సహా.