కవిత వ్యూహం మార్చారు. అయితే మెట్టినిల్లు… లేదా పుట్టినిల్లు..! నిన్నటి వరకు ఆమె పోటీ చేయాలనుకుంటున్న నియోజవర్గాల గురించి చెప్పేటప్పుడు సిద్దిపేట, లేదా బోధన్.. అని ప్రకటిస్తూ వచ్చారు. కానీ తాజాగా ఆమె తన రాజకీయ వ్యూహాన్ని సింగరేణికి మార్చారు. మంచిర్యాల నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. ఎందుకు దీన్నేఎంచుకున్నారు? ప్రశ్నకు.. ఆమె లోతైన ఓ రాజకీయ అవగాహన మేరకేనని తెలుస్తుంది. ఇవాళ్టి నుంచి చేపట్టబోయే బొగ్గుబాయి కార్యక్రమం కూడా ఇందులో భాగంగానే చూస్తున్నారు తెలంగాణ రక్షణ సేన నాయకులు.
మంచిర్యాల నుంచి తను పోటీ చేయడం ద్వారా ఈ కోల్బెల్ట్ ప్రభావిత 15 నియోజకవర్గాల్లో కూడా ఆమె తన పట్టు నిలుపుకుని టీఆరెస్ జెండా ఎగరవేయాలే వ్యూహం దీని వెనుక ఉందని తెలుస్తోంది. తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి నుంచే తన టీఆరెస్ పార్టీ ప్రస్థానాన్ని కీలకదశలకు తీసుకుపోయే దిశగా ఆమె కార్యాచరణ రూపొందించుకున్నారని చెబుతున్నాయి టీఆరెస్ వర్గాలు. మంచిర్యాల,ఆసిఫాబాద్,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం.. ఈ ఐదు జిల్లాల పరిధిలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, చెన్నూరు, రామగుండం, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, బెల్లంపల్లి, సిర్పూర్, వైరా, పినపాక, ఇల్లందు, భద్రాచలం, పెద్దపల్లి… ఈ 15 నియోజకవర్గాల్లో కోల్బెల్ట్ ప్రభావం ఉంది. ఇప్పుడు వీటిపైనే కవిత సీరియస్ నజర్ పెట్టారు.
తాను మంచిర్యాలలో పోటీ చేయడం ద్వారా ఆ ఎఫెక్ట్ ఈ చుట్టూ ఉన్న నియోజకవర్గాలపై పడనుంది. దీంతో ఇప్పుడు ఈ బాయిబాట కార్యక్రమంతో కార్మికలోకానికి మరింత చేరువై.. పార్టీని గ్రౌండ్ లెవల్లో బలోపేతం చేయడంతో పాటు.. రానున్న ఎన్నికల కోసం ఇక్కడి నుంచి తన పార్టీకి బలమైన పునాది వేయాలని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది. సింగరేణి ప్రాంతంలో టీఆర్ ఎస్ అధినేత్రి కవితకు మంచి పట్టుంది. గతంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఆమె అనేక సార్లు ఆ ప్రాంతంలో పర్యటించారు. కార్మికుల హక్కుల సాధనకు కృషి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా సింగరేణి ప్రాంతంలో ఆమె మంచి సంబంధాలను కొనసాగించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికులకు అనేక హక్కులు సాధించడంలో కవిత పాత్ర కీలకంగా చెప్పుకొంటారు, ముఖ్యంగా కారుణ్య నియామకాలు, పలు నోటిఫికేషన్లు, లాభాల వాటా, మంచి బోనస్ సాధించడంలో ఆమె సక్సెస్ అయ్యారు. కార్మిక కుటుంబాల సభ్యులతోనూ ఆమె సత్సంబంధాలు కొనసాగించారు. కోల్ బెల్ట్ లో తనకు ఉన్న పరిచయాలు, అనుచరులు, అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో మంచిర్యాల నియోజకవర్గం నుంచి తన రాజకీయ భవిష్యత్ ను తీర్చిదిద్దుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా తన ప్రణాళికలు మెల్లిగా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.
ముఖ్యంగా మంచిర్యాల విషయానికి వస్తే అక్కడ బీఆర్ఎస్ నుంచి నడిపెల్లి దివాకర్ రావు, అధికార కాంగ్రెస్ నుంచి ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. ప్రస్తుతం వయస్సు రీత్యా వీరిద్దరు ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటు పాత ముఖాలకు బదులు కొత్త వారు వస్తే అవకాశం ఇవ్వాలని ఆ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. శ్రీరాంపూర్, నస్పూర్ లో కవితకు ఉన్న పరిచయాలు ముఖ్యంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మంచిర్యాలలోనూ ఆమెకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. కోల్ బెల్ట్ ప్రాంతంలో ఆమెకు ఉన్న పరిచయాలు కలిసి వచ్చే అవకాశమున్నది.
పార్టీ అధినేత్రిగా కార్మికుల మనసు తెలుసుకొని ఆమె ముందడుగు వేయనున్నారు. ఇప్పటికే హెచ్ఎంఎస్ తో కలిసి ఆమె ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇక టీబీజీకేఎస్ లో పాత నేతలు సహకరించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు కవిత చేపట్టబోయే సింగరేణి బాయిబాట టూర్ ప్రధాన చర్చకు తావిస్తోంది. దీన్ని కవిత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.