మోడీ రాక వేళ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతున్నది. కానీ ఇక్కడి నేతల తీరే మమ్మల్ని నిరాశకు గురి చేస్తున్నది. వారిలో ఐక్యత లేకపోవడం.. గ్రూపులుగా విడిపోవడంతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కల్లే అనే అభిప్రాయం కాషాయ దళం నుంచి వినిపిస్తున్నది. ఏకంగా సోషల్ మీడియాలో మోడీ రాక వేళ.. తమ నేతలకు ఆయన క్లాస్ పీకి పోవాలని స్వయంగా కరుడుగట్టిన బీజేపీ శ్రేణులు, సానుభూతి పరులు కోరుకుంటున్నారంటే ఆ పార్టీ అంతర్గత పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉన్నదే నలుగురైదుగురు ముఖ్య నేతలు.. వీరంతా ఎవరికి వారే గ్రూపులు. ఒకరు ఒక దారి.. మరొకరు మరోదారి. ఒకరిది ఎడముఖం.. మరొకరది పెడముఖం. వీరికి ఎన్ని కీలక పదవులిచ్చినా.. నేతల తీరులో మార్పు రాకపోతే ఇంతే అంటున్నారు బాజాప్తా బాజాపా శ్రేణులు. ఇదిప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. చాలా రోజుల తరువాత మోడీ తెలంగాణకు రావడం.. సికింద్రాబాద్లో పెద్ద ఎత్తున బహిరంగ సభకు ఏర్పాట్లు చేయడంతో.. మంచి హుషారు మీదుంది కషాద దళం. ఎక్కడికక్కడ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. తాజా రాజకీయ పరిణామాలు.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా మోడీ ప్రసంగాలు.. తదితర వాటిపై పెద్దగా ఆశలు పెట్టుకున్నారు రాష్ట్ర బీజేపీ. అయితే, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగానే పార్టీని అంటిపెట్టుకుని, పార్టీ పేరు చెప్పుకుని ఎదిగిన నేతలు.. పార్టీ ఎదుగుదల కోసం మాత్రం పనిచేయడం లేదనే తీవ్ర నైరాశ్యంలో క్యాడర్ ఉంది.
కిషన్రెడ్డి, రఘునందన్రావు, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్..మహేశ్వర్ రెడ్డి.. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీరి మధ్య సమన్వయం లేదు. వీరిని సమన్వయ పరిచే శక్తీ లేదు. కేంద్రం కూడా చాలా సందర్బాల్లో వీరి వ్యవహారం పార్టీకి నష్టం తెస్తుందని తెలిసినా.. ఏమీ చేయలేని నిస్సహాయతనే ప్రదర్శించింది. దేశం కోసం.. ధర్మం కోసమనే నినాదం కేవలం ఎంపీ ఎన్నికల్ల్ మాత్రమే పనిచేస్తున్నది. అసెంబ్లీలో అంత సీన్ పార్టీకి లేదు. రాష్ట్ర పార్టీ నూతన అధ్యక్షుడి నియామకం పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడకపోగా .. నష్టాన్నే మిగిల్చిందనే భావనలో పార్టీ నేతలున్నారు. కిషన్రెడ్డి వ్యవహారం పట్ల తీవ్ర అసంతృప్తి క్యాడర్ ఉంది.
అతని వ్యవహారంలో మాత్రం ఇంచుక మందం కూడా మార్పు లేదు. రాజకీయ పరిణామాలు తమకు అనుకూలంగా మలుచుకునే క్రమంలో మాట్లాడే పద్దతి, ఆందోళనలకు పిలుపునిచ్చే విధానంలో కిషన్రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యాడనే ఆరోపణలున్నాయి. పైగా కేసీఆర్, కేటీఆర్ను పల్లెత్తు మాటనడనే అపవాదునూ మూటగట్టుకున్నాడు. దీనికి తోడు అర్వింద్ ఒకలా.. రఘునందన రావు మరొకలా.. ఏది పడితే అది.. తమకు ఇష్టం వచ్చిన పద్దతిలో మాట్లాడుతూ పోవడం.. వైరల్ కావడం…సోషల్ మీడియాలో హీరోగా నిలవడం.. అంత వరకే. ఎవరికీ పార్టీ లైన్ తెలవదు. క్యాడర్ను కాపాడుకునే విధానం తెలవదు. కరుగుగట్టిన పార్టీ లీడర్లను ఆదుకోరు. పార్టీ పదవులు ఇప్పించుకోరు.. తమ సొంతానికే పార్టీని వినియోగించుకునే స్థితి తెలంగాణలో ఉంది.
ఎవరికి వారు జాగీర్దార్లుగా పార్టీని మార్చుకుని తమ అవసరాలకు వాడుకుంటున్నారే తప్ప.. పార్టీ ఎదుగుదలకు, నిజంగా కష్టపడే క్యాడర్ మేలు కోసం మాత్రం వీరెవరూ పనిచేయడం లేదనే ఆరోపణలున్నాయి. అయితే మోడీ రాక వేళ .. ఆయనకు ఓ సూచన కూడా చేస్తున్నారు. రేపటి మోడీ సభ షెడ్యూల్లో మార్పులు చేశారు. ఓ గంట టైమ్ ముందే మోడీ రానున్నారు. అక్కడే శంషాబాద్లోనే ఆయన నేతలతో ఓ చిన్నపాటి మీటింగు పెట్టుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ మీటింగులో ప్రధానంగా ఈ ముఖ్య నేతలను ఎడాపెడా అర్సుకోవాలని, క్లాస్ పీకాలని కోరుకుంటున్నారు. ఐక్యంగా పని చేసి పార్టీని తెలంగాణలో అధికారంలోకి తేవాలనే సూచన చేయడంతో పాటు చురకలు అంటించాలని మోడీని కోరుతూ సోషల్ మీడియాలో వేడుకోలు పోస్టింగులు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.