చిన్న చిన్న సంఘటనలే కావొచ్చు. వాటికి స్పందించే తీరును బట్టి ఉంటుంది అసలు ఫలితాలు. గాలికి పోయేదాన్ని కాళ్లకు తగిలించుకున్నట్టు… గోరుతో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నట్టు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఇద్దరు సీఎంలు చేస్తున్నదదే. ఒకరేమో ప్రొఫెసరేమో నాగేశ్వర్.. తాజాగా మరో ఆర్టీసీ డ్రైవర్. చాలా చిన్న విషయాలు. చూసీ చూడనట్టుగా వదిలేయాల్సినవి. కానీ.. ఈ రెండు ప్రభుత్వాలు అలా చేయలేదు. చాటంత చేశాయి. తీరా అంతా తిట్టిపోస్తుంటే వెనుకకు పోవాలో.. ముందుకు నడవాలో తెలియక.. బింకం వదలక.. భీతిల్లుతున్నాయి. కారణం అహంతో కూడా పాలనే అని చెప్పుకోవాలె. అనాలోచిత నిర్ణయమేననాలి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా… అధికారంలోకి రాగానే మరొకలా ప్రవర్తించడం అందరికీ సహజంగానే అధికార దర్పంతో అలవడ్డ ఓ మానసిక రోగం. అచ్చం అక్కడ బాబు అలాగే చేశాడు. ఇక్కడ రేవంతూ ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరు గురుశిష్యులు ఒకరికి మించి మరొకరు అన్నట్టుగానే వ్యవహరించి నవ్వులపాలే అవుతున్నారు. ఆ పాలన తీరుకు ఈ నిర్ణయాలు ఓ నిదర్శనం అనే విధంగా అభాసుపాలే అవుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదో విశ్లేషణ చేశాడు. పవన్ మీద. జగన్ను అరెస్టు చేయాలని పవన్ అమిత్షాతో అన్నట్టుగా, అమిత్ షా.. అలా కుదరదు.. మీరనుకున్నంతగా రాజకీయాల్లో శత్రువులెవరూ ఉండరని హితవు పలికినట్టుగా ఓ సోర్స్ ఆధారిత కథనం ఒకటి విడుదల చేశాడు.
దీనిపై భగ్గుమన్నాడు పవన్. ఇదేనా నీ ప్రొఫెసరిజం.. ప్రొఫెషనలిజం..? అంటూ ఒంటికాలిపై లేచాడు. కేసులు పెట్టించాడు. వెంటపడ్డాడు. అరెస్టు చేసేదాకా వదలం బిడ్డా..!అని తొడలు చరిచి మరీ వెంటాడుతున్నాడు. బాబు కూడా పవన్కు సై అన్నాడు. డిప్యూటీ సీఎం కదా.. నువ్వెంట్లంటే అట్లా .. అని జైకొట్టాడు. ఈ దెబ్బకు ఏపీ పాలనపై దుమ్మెత్తిపోయని వారు లేరంటే నమ్మండి. ఇంత చిన్న విషయానికి అంత చెడ్డపేరు తెచ్చుకోవడం అవసరమా? ఇది ఇప్పుడు తెలంగాణకూ పాకింది. ఇక్కడి నేతలు కూడా బాబుకు వార్నింగ్ ఇస్తున్నారు.
నాగేశ్వర్ను ఎట్లా అరెస్టు చేస్తారో చూస్తామంటున్నారు! ఇదీ పవన్ తెచ్చిన తంటా. తలనొప్పి. ఇక ఇక్కడ మన మంత్రులకు ఓపిక తక్కువ. అధికార దర్పం దీనికి తోడైంది. ఎవరో ఆర్టీసీ డ్రైవర్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పెరిగిన పెట్రోల్ ధరలపై ఆందోళన చేస్తుంటే.. ముందు ఆ వడ్లు కొనే కార్యక్రమం చూడుర్రి అని చురకలంటించాడట ఆ డ్రైవర్. తప్పేముంది? రైతుల గోసలు అట్లున్నయి మరి. దీన్ని లైట్గా తీసుకోలేదా మంత్రి. ఉద్యోగం ఊడబీకెచ్చేదాకా ఊకోలె. మరి మంత్రా మజాకా? ఇజ్జత్ పోయిందనుకున్నాడు. ఇజ్జత్ ఎందుకు పోతది? ప్రజలన్నప్పుడు నిలదీస్తరు. ప్రశ్నిస్తరు. ఓపిగ్గా సమాధానం చెప్పాలె. సీఎం అయినా సరే.
ఇప్పుడు ఆ డ్రైవర్ కోసం ఓ పోరాటమే మొదలైంది. ఉద్యోగంలోకి తీసుకుంటరా? ఆందోళన చేయాల్నా..? అని. ఉన్న సమస్యలు చాలవని ఇలా కొత్తవి తెచ్చి నెత్తికి పెడుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల సమస్య మామూలుగా లేదు. రైతుల గోస వర్ణనాతీతం. ఇప్పుడు సమస్య అటువైపు కూడా మళ్లింది. పార్టీలకతీతంగా ఆ డ్రైవరు ప్రశ్నించిన విధానాన్ని అంతా సమర్థిస్తున్నారు. ఇది సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. మరి అది గుర్తించకుండా.. ఆ ప్రశ్నించినోడి గొంతు నొక్కేస్తే సరి, ఇంకొకడు మళ్లీ నోరెత్తడు..! అనే విధానం అలవాటు చేసుకుంటే ఎట్లా! బీఆరెస్ అదే చేసింది. ఇప్పుడు కాంగ్రెస్సూ అదే చేస్తున్నది.