కవిత కొత్త పార్టీ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. మూడు ప్రధాన పార్టీలను లక్ష్యంగా చేసుకుని తమ కొత్త పార్టీ ముందుకు సాగుతుందని .. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పార్టీ విధానలుంటాయని చెప్పారు. అంతే కాదు.. తమది పక్కా ప్రాంతీయ పార్టీ అన్న కవిత.. పక్క రాష్ట్రాల జోలికెళ్లం.. ఇక్కడి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ కామెంట్ల వెనుక కేసీఆర్ను కార్నర్ చేసే ఉద్దేశ్యమే ఉందని భావిస్తున్నారు బీఆరెస్ నాయకులు. మొన్నటికి మొన్న కేసీఆర్ జగిత్యాల సభను టార్గెట్ చేసి ఆమె మాట్లాడారు.
కేసీఆర్ మాట్లాడిన తీరును, విధానాలను ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. కురు వృద్ధుడైన జీవన్రెడ్డిని పార్టీలో చేర్చుకుని, పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయిన ఆయన కాళ్లు పట్టుకున్నంత పని చేశారని, మరి యూత్ మాటేమిటని ఆమె సెటైరికల్గా పంచులేశారు. తమను ఓడించి జనం తప్పు చేశారనే విధంగానే కేసీఆర్ మాట్లాడుతున్నారని, వెయ్యేండ్లైనా బీఆరెస్ పార్టీ ఇక మారదని..ఆమె వ్యాఖ్యానించడం కలకలం రేపింది. తాజాగా ఆమె మాది పక్కా ప్రాంతీయ పార్టీ అని అనడం కూడా అందులో భాగమేనంటున్నారు బీఆరెస్ నేతలు. కేసీఆర్ టీఆరెస్ను బీఆరెస్గా మార్చే క్రమంలో పార్టీ పేరులో తెలంగాణ అనే పదమే లేకుండా చేశారని, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చకున్న విధానాన్ని ఆమె పరోక్షంగా ఎండగట్టారు. తాము మాత్రం అలా చేయబోమన్నారామె. గతంలో కూడా తాము పెట్టబోయే కొత్త పార్టీలో కచ్చితంగా తెలంగాణ ఉంటుందని ప్రకటించారు కవిత.
ప్రాంతీయ పార్టీగానే ఉంటామని చెప్పిన ఆమె.. ఇక్కడి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కొత్త పార్టీ విధానాలుంటాయన్నారు. అంటే… ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. దేశ రాజకీయాలను ఏలేందుకు వెళ్లే మూర్ఖపు పనులు తాము చేయబోమని కేసీఆర్ను ఆమె కార్నర్ చేస్తూ పరోక్షంగా సెటైర్లు విసిరారు. పార్టీ ఆవిర్భావానికి ముందే ఆమె బీఆరెస్పై ఆమె నిరసన గళం విప్పారు. మెల్లమెల్లగా ఆమె కేసీఆర్ను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. 25న పార్టీ ఆవిర్భావ సభలో ఆమె ప్రసంగాన్ని బట్టి ఆ పార్టీ స్టాండ్ ఏంటో కచ్చితంగా ప్రజలకు తెలిసిపోతుంది. అయితే ఆమె ప్రధానంగా బీఆరెస్, కాంగ్రెస్పైనే గురిపెట్టినట్టు తెలుస్తోంది.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుల రాజకీయ అడుగులు, వారి ప్రసంగాలు, డిమాండ్లను బాగా ఫాలో అవుతున్న కవిత.. వాటికి గట్టిగానే కౌంటర్లిస్తున్నారు. పదేళ్ల పాలన లోపాలను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేస్తూ .. బీఆరెస్ నేతల డబుల్ స్టాండర్డ్స్పై జనాలకు పాలకు పాలు నీళ్లకు నీళ్లలా విడమర్చి చెబుతున్నారు. సీఎం రేవంత్రెడ్డిని సైతం ఆమె గుంపు మేస్త్రీ అని సంబోధిస్తూ వస్తున్నారు. హరీశ్రావును గుంటనక్క అంటున్నారు. ఇక కేసీఆర్ను మాత్రం ఇప్పటి వరకు పేరుతో సంబోధించలేదు. ఆయనను పరోక్షంగానే విమర్శిస్తూ వస్తున్నారు. కేటీఆర్ను సైతం ఆమె రామన్న ఇలా అంటున్నారు.. అలా అంటున్నారంటూ అన్న అంటూనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక పార్టీ ఆవిర్భావం తరువాత ఆమె రాజకీయంగా బీఆరెస్, కాంగ్రెస్లపై విమర్శల దాడి తీవ్రం చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇది అధికార పక్షానికి కన్నా.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులకు తలనొప్పి వ్యవహారంలాగే మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.