ఆ మూడు పార్టీలు ఇప్పుడు ఒకటే జపం చేస్తున్నాయి. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి. మొదట టీఆరెస్ చీఫ్ కవిత .. ఇక్కడ నుంచే తన మొదటి బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభ పేరే పాలమూరు- రంగారెడ్డి ప్రాజక్టుల సాధన. ఈ వేదికగా రెండు పార్టీల తీరును ఎండగట్టారు కవిత. ప్రధానంగా పదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యం.. అన్నీ బహిర్గతం చేసిన కవిత.. రెండు ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీటి అన్యాయం చేసి కేసీఆర్.. ఆయన పార్టీ బీఆరెస్ చారిత్రక తప్పిదం చేశారని తీవ్రమైన విమర్శలు ఈ వేదికగా ఆమె చేయడం రాజకీయంగా కలకలం రేపింది.
అదే సమయంలో కాంగ్రెస్ సర్కార్ తీరునూ ఆమె విమర్శ చేశారు. సీఎం రేవంత్రెడ్డి పాలమూరు బిడ్డ అయి ఉండి కూడా ఇక్కడ ఈ పెండింగ్ ప్రాజెక్టు విషయంలో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించిన ఆమె.. దసరా వరకు సీఎంకు డెడ్లైన్ విధిస్తున్నట్టు ఆ వేదికగానే ప్రకటించారు. అప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై కదలిక లేకపోతే… తానే ఆ పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర చేసి జనాలకు చైతన్యం చేస్తానని వెల్లడించారు. ఆ తరువాత రాజకీయ పార్టీలన్నీ దీనిపై సైలెంట్గానే ఉన్నాయి. ఎవరూ చడీ చప్పుడూ చేయలేదు. కానీ బీఆరెస్లో మాత్రం అంతర్గతంగా దీనిపై తీవ్ర చర్చ వచ్చింది. ఏకంగా హరీశ్రావును కవిత టార్గెట్ చేశారు. కాంట్రాక్టర్తో కుమ్మక్కై శ్రీశైలం ప్రాజెక్టులో ఎత్తును పెంచి ఇక్కడి.. పాలమూరు, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు అందకుండా చేశారనే ఆరోపణను .. గులాబీ పార్టీ సీరియస్గానే తీసుకున్నది.
హరీశ్రావును అంటే.. కేసీఆర్ను అన్నట్టే. కేసీఆర్కు తెలియకుండా హరీశ్రావు తన సొంత ఎజెండా అమలు చేసేంత సీన్ లేదు. కానీ చాలా సందర్బాల్లో కేసీఆర్ పేరు ఉచ్చరించకుండా కవిత జాగ్రత్త పడుతున్నారు. ప్రజలు ఈ తీవ్ర ఆరోపణలు, విమర్శలను ఎలా తీసుకుంటారోననే కోణంలో ఆమె.. పరోక్షంగా బీఆరెస్ పార్టీ పేరుతో, గుంటనక్క అని హరీశ్ను సంబోధిస్తూ తన విమర్శలను చేస్తూ పోతున్నారు. ఇది అంతిమంగా ప్రజలకు సారాంశం చేరుతున్నది. అయితే, కవిత పార్టీ పెట్టిన తరువాత చేసిన తొలి విమర్శ, ఆరోపణ.. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలోనే.. దీనిపై ఎట్టకేలకు వాళ్ల స్పందన ఖండన, వివరణ ద్వారా కాకుండా.. మేమే పాదయాత్ర చేస్తామనే నిర్ణయంతో వెలువడింది.
త్వరలో దీనిపై పాదయాత్ర చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీఆరెస్ భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా కవిత ఆరోపణలు.. పెద్దగా హైలెట్గా కాకుండా..చల్లబడేలా చేయడం.. ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్షంగా జనాలకు మెసేజ్ పోవాలనే ఎత్తుగడలో ఆ పార్టీ ఉంది. అందుకే తాజాగా బీఆరెస్.. ఈ ప్రాజెక్టు విషయంలో పాదయాత్రకు సిద్దమైంది. ఈ తాజా పరిణామాలన్నింటి నేపథ్యంలో సర్కార్ కూడా ఒక్కసారిగా మేల్కొంది. మొన్నటి వరకు సిటీ డెవలప్మెంట్, మెట్రో, హైడ్రా, మూసీ పునరుజ్జీవం.. ఫోర్త్ సిటీ.. అంటూ తన ప్రయార్టీస్ అన్నీ ఇవేననే విధంగా ముందుకు పోయిన సర్కార్.. ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలపై ప్రత్యేక శ్రద్ద పెట్టింది. ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ప్రధానంగా ఈ ప్రాజెక్టుపైనే చర్చ జరిగింది. కీలకమైన ఆదేశాలు కూడా ఇచ్చారు సీఎం. భూసేకరణ వడివడిగా జరగాలని, వాటి పరిహారానికి సంబంధించిన నిధులను ఆపకుండా విడుదల చేస్తామని, ఈ ప్రాజెక్టు పనులు వడివడిగా ముందుకు సాగేలా ఎప్పటికప్పుడు నేతలు దీని పురోగతిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సీఎం ఆదేశించారు. పాలమూరు నుంచి ఎదిగి వచ్చిన నేతగా … సీఎం స్థాయికి పంపిన గడ్డగా తనకు తాను పరిచయం చేసుకునే రేవంత్.. ప్రతిపక్షాలు ఓ వైపు.. పోటీలు పడి పాదయాత్ర చేయడానికి సిద్దమవుతుంటే.. వాటికి చాన్సు ఎందుకివ్వాలి…? అనే రీతిలో ఆయన దీనిపై సీరియస్గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.