రాజకీయంలో సవాళ్లు , ప్రతిసవాళ్లు అంతిమంగా జనానికి మేలు చేసేవిగా ఉండాలి. ఏదో రెచ్చగొట్టే దోరణిలో మాట్లాడుకుని, అప్పటి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు, వార్తల్లో వైరల్ అయ్యేందుకు విసురుకునే సవాళ్లు. నిజమైన లీడర్లుగా నిలబెట్టవు. కానీ ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి .. కేటీఆర్కు విసిరిన సవాల్ బాగుంది. జనానికి మేలు జరిగేలా..తనకు తానుగా ఓ బాధ్యతను భుజానేసుకున్నట్టుగా.. అందులో రాజకీయంగా కేటీఆర్ను ఎదుర్కొనే ఎత్తుగడ కూడా ఇమిడి ఉండటం నచ్చింది.
కేటీఆర్ తరచూ ఓ మాటుంటాడు.. హౌజింగ్ స్కీమ్ గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా! హైదరాబాద్లో ఒక్క కొత్త ఇంటికైనా పునాది వేశారా? ఒక్క కొత్త ఇళ్లు కట్టినట్టు చూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నాడు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ అనడం.. అది అతనికి ఊతపదం అయిపోయిందనుకోండి! అది వేరే ముచ్చట. దీన్ని మొత్తానికి చాలా సీరియస్గా తీసుకున్నాడు మంత్రి పొంగులేటి. హైదరాబాద్లో పదేళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లకన్నా ఎక్కువే ఇందిరమ్మ ఇండ్లు కట్టి చూపిస్తానని, అలా కట్టివ్వని పక్షంలో తాను మళ్లీ ఎమ్మెల్యేగా పోటీచేయబోనన్నాడు. తాను సవాల్ గెలిస్తే.. ఆ సవాల్కు కట్టుబడి కేటీఆర్ .. కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా.. రాజకీయ సన్యాసం తీసుకోవాలన్నాడు. దీనికి ఆయన ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. ఒక్కటి మాత్రం తెలంగాణ ప్రజలకు.. అదీ హైదరాబాద్ ప్రజలకు ఈ విధంగా ఓ తీపికబురే చెప్పాడు హౌజింగ్ శాఖా మంత్రి పొంగులేటి. ఇంకా రెండున్నరేండ్లుంది సర్కార్కు.
ఆ సమయంలో చాలా మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు దక్కే అవకాశం ఉంది. ఆ విధంగానైనా పేద, మధ్య తరగతి వర్గాలకు మేలే జరుగుతుంది కదా! ఇప్పుడిదీ నడుస్తున్న చర్చ. ఇక ఇప్పుడు హౌజింగ్ స్కీమ్ గురించి డిస్కషన్ చేద్దాం. వాస్తవానికి, కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల స్కీం అట్టర్ ఫ్లాపైంది. గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడా కట్టిన ఇండ్లు ఎవరికీ ఇవ్వక.. వాటిని భూత్బంగ్లాలకన్నా అధ్వాన్నం చేశారు. ఇక హైదరాబాద్లో కొన్ని కట్టారు. కానీ ఇవ్వలేదు. లబ్దిదారులకు ఇది ఎన్నికల ఎరగా వాడుకున్నారు. దీంతో ఇవి కూడా చాలా చోట్ల వేస్టుగానే ఉన్నాయి. వీటిని మరమ్మత్తులు చేసి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కొందరికి కేటాయించింది. ఇంకా చాలానే మిగిలి ఉన్నట్టున్నాయి.
ప్రభుత్వమే డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలనే కేసీఆర్ ఆలోచన ఆచరణలో సాధ్యం కాలేదు. దీంతో ఐదు లక్షలిస్తాం.. మీ సొంత స్థలంలో కట్టుకోండ్రని రెండోసారి ఎన్నికలకు పోయాడు. అప్పుడు గెలిచిన తరువాత.. మేమెప్పుడన్నాం.. ఐదులక్షలని.. మూడు లక్షలే ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా అప్పటి హౌజింగ్ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో అబద్దం ఆడించారు. ఇక అదీ లేదు. మళ్లీ ఎన్నికలకు ఐదు లక్షలని హామీ ఇచ్చినా ఎవరూ నమ్మలేదు. ఓడించారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఐదు లక్షలు పెట్టింది. పలు దఫాలుగా చెల్లిస్తున్నది. కానీ ఇది సగం కూడా సరిపోవడం లేదు. ఐదు లక్షలకు మరో ఐదు నుంచి పది లక్షల వరకు అప్పులు చేసి మరీ కట్టుకోవాల్సి వస్తుంది. అంటే.. సర్కార్ ఈ ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఉడతా భక్తిగా సాయం చేస్తున్నదన్నమాట. సరే, వేడినీళ్లకు చలినీళ్లు తోడైనట్టుగా.. సొంతింటి కల ఇలాగైనా నెరవేరుతుంది చాలా మందికి. గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి ఇందిరమ్మ ఇండ్లు సాంక్షన్ అయ్యాయి. కట్టుకున్నారు. గృహ ప్రవేశాలు కూడా చేశారు.