Sridhar Babu: స్వేచ్ఛా బ్యూరో: అర్హత కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి దశల వారీగా 2 బిహెచ్కే ఇళ్లు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధృఢ సంకల్పమని జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
మంత్రి శ్రీదర్ బాబు మాట్లాడుతూ..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిజమైన పేదలకు గృహాలు అందించడం ప్రభుత్వానికి సంతోషకరమైన విషయమన్నారు. ఫతేనగర్ పరిధిలోని అమృత్నగర్ తండా నిర్వాసితుల్లో 62 మంది గిరిజన నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇళ్లు కేటాయించామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, స్థలం లేని పేదలకు ఎలాంటి వివక్ష లేకుండా దశల వారీగా రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు.
రూ.15.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఫ్లైఓవర్లు, రోడ్డు విస్తరణ పనులకు రూ.15.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారత కోసం ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత పెన్షన్లు, కల్యాణలక్ష్మి షాదీ ముబారక్, వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో హైదరాబాద్ కాలుష్య సమస్యను ఎదుర్కోకుండా మూసీ నది ప్రక్షాళన, చెరువుల పరిరక్షణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ..
జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ.. రెండు పడకల గదుల ఇళ్లు లబ్ధిదారుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. కైతలాపూర్లో 144 మందికి ఇళ్లు మంజూరుకాగా, ప్రస్తుతం 62 మందికి కేటాయిస్తున్నామని తెలిపారు. మిగిలిన అర్హులకు దశల వారీగా ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కమ్మ సంఘం అధ్యక్షుడు బండి రమేష్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీఓ శ్యాంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: మెదక్ కోటపై గులాబీ జెండా.. 10కి 10 స్థానాలే టార్గెట్గా హరీశ్ రావు వ్యూహరచన!