Hyderabad: తెలంగాణలో రేవంత్రెడ్డి మంత్రివర్గ విస్తరణ రంగం సిద్ధమైందా? ప్రక్షాళనకు ముహూర్తం దాదాపు ఖరారు అయ్యిందా? కేరళ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ హైకమాండ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందా? అధికార పార్టీలో నేతలు తలోవిధంగా ఎందుకు చర్చించుకుంటున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
రేవంత్ కేబినెట్ విస్తరణ.. ప్రక్షాళనకు సంకేతాలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు పూర్తి అయ్యింది. మరో రెండున్నరేళ్లు మాత్రమే ఉంది. ఈ క్రమంలో రేవంత్ కేబినెట్లో మార్పులు-చేర్పులు చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాలు, ప్రాంతీయ సమీకరణాలే ప్రాధాన్యతగా ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు ఓ వార్త పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే పార్టీ హైకమాండ్ మంత్రుల పని తీరు ఆధారంగా వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. సరైన పర్ఫార్మెన్స్ కనపించని నేతలను పక్కన పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు అందులోని సారాంశం. ఈ లెక్కన రేవంత్ కేబినెట్లోని కొత్త ముఖాలు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న కొందరి మంత్రుల శాఖల్లో మార్పులు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కేరళ ఎన్నికల ఫలితాల తర్వాతే.. కొత్త ముఖాలు ఎవరు?
సోమవారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. వాటి ఆధారంగా మార్పులు చేయాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో పలుమార్లు సీఎం రేవంత్ హస్తినకు వెళ్లిన ప్రతీసారి కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం సాగింది. ఆ విషయం పక్కన బెడితే ఐదురాష్ట్రాల ఎన్నికల తర్వాత కచ్చితంగా మార్పు ఉంటుందని కొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు.
2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తుందని అంటున్నారు. కేబినెట్ విస్తరణ విషయం తెలియగానే కొంతమంది ఆశావహులు తమవంతు ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ లో పదవులు దక్కించుకోవాలని గతంలో వైరవీలు చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని కొందరు నేతలు అంటున్నారు. క్లీన్ ఇమేజ్, ప్రజాదరణ ఉన్న నేతలకు ప్రయార్టీ ఇస్తున్నారని అంటున్నారు. ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ విస్తరణ జరిగితే ఈసారి మంత్రి పదవులు ఎవర్ని వరించేనో చూడాలి.