రైతులు సర్కార్పై గుర్రుగానే ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లు ఎలాగోలా కంప్లీట్ చేసింది సర్కార్. ఇక వాటిని ఎలా అమ్ముకుంటారనేది కేంద్రం, రేవంత్కు మధ్య సాగే యుద్దం. అది తరువాయిగా నడిచే సీరియస్ ఘట్టం. ఇక యూరియా తిప్పలు అంతా ఇంతా కావు. ఆ యాప్ ఏందో గానీ, సలహా ఎవరిచ్చారో గానీ, తీవ్ర ఆరోపణలను మూగట్టుకుంటున్నది ప్రభుత్వం. ముందే బుక్ చేసేసుకుని బ్లాక్లో అమ్ముకుంటున్నారని, నల్లగొండకు చెందిన మంత్రి.. తన గన్మెన్ పేరుతో రెండు లారీల యూరియాను బ్లాక్ చేశాడని… ఇలా విపరీతమైన ప్రచారం జరుగుతోంది.
దీనిపై సర్కార్ నుంచి గట్టి కౌంటర్ రాలేదు. రైతులను స్వాంతన పరిచే వివరణ లేదు. వారి బాధలను తగ్గించే చర్యలూ లేవు. ఇవన్నీ ఇలా నడుస్తున్న తరుణంలో రైతు భరోసా టైమ్ రానే వచ్చింది. ఈ వానాకాలం సీజన్కు నాట్లు వేసుకునే ముందే ఆ పెట్టుబడి సాయం అందితే రైతుకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటికే అప్పుల పాలై ఉన్నాడు. సన్నవడ్లకు బోనస్ రాలేదు. అవి వచ్చి ఖాతాలో పడేదాకా రైతుకు నమ్మకం లేదు. రైతు భరోసా కూడా సకాలంలో పడితే అది పదివేలు అని రేవంత్ రెడ్డికి రెండు చేతులెత్తి మొక్కే పరిస్థితి ఉంది ఇప్పుడు క్షేత్రస్థాయిలో.
మొత్తానికి ఈనెల 30న వేస్తామన్నారు. కానీ మధిరలో భారీ బహిరంగ సభ పెట్టి మరీ. ఎందుకు ప్రతీసారి ఇలా సర్కార్ ఈ భరోసా నిధుల విడుదలకు సభ ద్వారా విడుదల చేస్తోంది. అవును మరి.. ఇదేమంత ఆషామాషీ పథకం కాదు. అసలే నిధుల కటకట. ఆర్థిక సంక్షోభం. ప్రతీ సీజన్ నాటికి నిధులు సమకూర్చాలంటే సర్కార్కు తల ప్రాణం తోకకొస్తున్నది. అక్కడా ఇక్కడ.. జమ చేసి.. ఒక్క చోట చేర్చి.. కొన్ని ఆపి.. ఇంకొన్ని అడ్వాన్సులు తీసుకుని.. ముప్పుతిప్పలు.. అప్పులచిక్కులు దాటి మొత్తానికి ఇలా సమకూర్చుకుంటున్నది.
ఈ నెల 30 న డేట్ పెట్టుకుంది. మరి ఇంత కష్టపడి.. తల తాకట్టు పెట్టినంత పనైతే.. ఉత్తగనే ఏం హడావుడి లేకుండా.. చడీచప్పుడు లేకుండా నిధులు విడుదల చేస్తారా? అందుకే.. సీఎం రేవంత్రెడ్డి ప్రతీసారి ఈ నిధుల విడుదలను ఒక ఆర్బాటంగా విడుదల చేస్తున్నారు. భారీ బహిరంగ సభ పెట్టి.. రైతుల కోసం ఎంతటి దీక్షతో ఈ సర్కార్ పని చేస్తుందో చెప్పి.. పోయిన సర్కార్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి.. మాది భరోసా..అని రైతన్నకు అభయమిచ్చి.. పనిలో పనిగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సాకులు.. కిషన్రెడ్డి అడ్డంకులు.. ఓసారి గుర్తు చేసి.. ధాన్యం అక్కడ ఢిల్లీలో పారబోయాలా? ఇక్కడ బీజేపీ ఆఫీసు ముందు పారబోసి నిరసన తెలిపాలో క్లారిటీ ఇచ్చి.. ఇవన్నీ చేయాలి.
సరే, ఏమన్నా చేసుకోర్రి గానీ.. ఆ 30 తారీఖేదో రేపో ఎల్లుండో వస్తే ఎంత బాగుంటది అనుకుంటున్నడు రైతు. మరి అంత కష్టముంది వారికి. చేతిల పైసల్లేక విలవిలలాడిపోతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఆ 30 తారీఖుకు అని రోజులు భారంగా లెక్కించుకోవాల్సిన దుస్థితి వారిది.