Hangor Submarines: బంగాళాఖాతంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? 1971 యుద్ధంలో భారత నావికాదళం దెబ్బకు తోక ముడిచి పారిపోయిన పాకిస్తాన్.. సరిగ్గా 55 ఏళ్ల తర్వాత మళ్లీ బంగాళాఖాతంలోకి అడుగుపెట్టాలని చూస్తోందా? చైనా ఇచ్చిన తెగింపుతో, తన సరికొత్త ‘హంగోర్ క్లాస్’ సబ్మెరైన్లను భారత్ ముంగిట్లోకి పంపేందుకు ప్లాన్ చేస్తోందా? చైనా అండతో పాక్ వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగుల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? భారత్ను చుట్టుముట్టేందుకు జరుగుతున్న ఈ కుట్రపై మన రక్షణ శాఖ ఎలాంటి నిఘా పెట్టింది?
బంగాళాఖాతం.. భారత్కు అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం. ఇప్పుడు ఈ ప్రాంతంలోకి 55 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రవేశించడానికి పాకిస్తాన్ కుట్రలు చేస్తోంది. చైనాలో నిర్మించిన మొదటి హంగోర్ క్లాస్ సబ్మెరైన్ PNS హంగోర్ కాన్వాయ్కు నేతృత్వం వహించిన పాక్ కమోడోర్ ఒమర్ ఫారూఖ్.. ఇటీవల శ్రీలంకలో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. చైనా సాయంతో తమ నౌకాదళంలోకి రాబోయే 8 హంగోర్ సబ్మెరైన్ల ద్వారా బంగాళాఖాతంలో పాక్ నిరంతరంగా ఉనికి కొనసాగిస్తుందని, ఇవి గేమ్ ఛేంజర్లంటూ అతడు కామెంట్ చేశాడు.
ఈ హంగోర్ క్లాస్ సబ్మెరైన్ల పవర్ను చూస్తే.. ఇవి చైనాకు చెందిన అధునాతన యువాన్ క్లాస్ సబ్మైరన్ల ఆధారంగా డిజైన్ చేయబడ్డాయి. వీటిలో 4 చైనాలో తయారవుతుండగా, మిగిలిన 4 పాకిస్తాన్లోని కరాచీ షిప్యార్డ్లో తయారవుతున్నాయి. వీటికి ఉన్న అతిపెద్ద బలం ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ. దీని ద్వారా ఇవి సాధారణ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాముల కంటే చాలా ఎక్కువ రోజుల పాటు నీటి పైకి రాకుండా, లోపలే ఉంటూ శత్రువుల కంటపడకుండా ప్రయాణించగలవు.
Also Read: భూ కబ్జా ఆరోపణలు.. కోర్టులో పవన్కు బిగ్ రిలీఫ్.. సంచలన ఉత్తర్వులు జారీ
పాక్ ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఇటీవల బంగ్లాదేశ్లో మారిన రాజకీయ పరిస్థితులే. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య సైనిక సంబంధాలు బలపడుతుండటాన్ని ఆసరాగా చేసుకుని బంగాళాఖాతంలో అడుగుపెట్టాలని చూస్తోంది. అయితే దీని వెనుక ఉన్న అసలు సూత్రధారి చైనా. హిందూ మహాసముద్రంలో భారత్ను చుట్టుముట్టే చైనా ‘స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్’ వ్యూహంలో భాగంగానే పాకిస్తాన్ను బంగాళాఖాతంలోకి చొచ్చుకెళ్లేలా డ్రాగన్ ప్లాన్ చేస్తోందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఇండియాకు చెందిన ఈస్టర్న్ నావల్ కమాండ్, అండమాన్ నికోబార్ కమాండ్ పూర్తి ఆధిపత్యంతో ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ సబ్మెరైన్లు ఇక్కడ నిఘా పెడితే భారత నేవీ యుద్ధ నౌకల కదలికలు, విశాఖపట్నంలోని రహస్య అణు జలాంతర్గాముల స్థావరాలపై నిఘా వేసే ప్రమాదం ఉంది. అందుకే భారత రక్షణ శాఖ ఈ పరిణామాలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తూ కౌంటర్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
Also read: దేవుడి భూముల కబ్జాదారులకు ఇక దబిడి దిబిడే.. సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్..?