Temple Donations: స్వేచ్చ బ్యూరో: అయోధ్య రామాలయం విరాళాల చుట్టూ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు పెను దుమారం రేగుతోంది. భక్తులు సమర్పించిన కానుకలు, ఆభరణాల మాయంపై జరుగుతున్న సిట్ విచారణలో సంచలనాలు బయడపడుతున్నాయి. హుండీ నగదుతో పాటు వజ్రాలు, బంగారు శిలలు కూడా మాయమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు యూపీలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
అయోధ్య రామమందిర విరాళాల మాయంపై లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సిట్ బృందం ఆలయ ప్రాంగణంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఈ విచారణలో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. హుండీ నుంచి నగదు, బంగారాన్ని దొంగిలించే సమయంలో ఆలయ సీసీటీవీ కెమెరాలను, రికార్డులను నిందితులు ట్యాంపర్ చేసినట్లు అధికారులు ఎవిడెన్స్ కనుగొన్నారు. దీంతో నిఘా విభాగం, సెక్యూరిటీ సిబ్బంది పాత్రపై దర్యాప్తు తీవ్రం చేశారు. నోట్లు లెక్కించే విభాగంలో పనిచేసే లవ్కుష్ మిశ్రా అనే ఉద్యోగిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 20 వేల లోపు జీతం ఉండే కొందరు ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేయగా.. ఏకంగా 10 నుంచి 12 లక్షల నగదు లభించింది. వీరు కార్లు, ఖరీదైన ఇళ్లు, భూములు కొనుగోలు చేసినట్లు తేలింది. ప్రస్తుతం ప్రధాన నిందితుడు రామ్శంకర్ అలియాస్ తిను యాదవ్ను అధికారులు గంటల తరబడి ప్రశ్నిస్తున్నారు.
Also read: ఇరాన్ యుద్ధం ఆగింది.. పెట్రోల్ ధరల మాటేంటి? కేంద్రమంత్రి ఏమన్నారు?
మరోవైపు, గతంలో భక్తులు సమర్పించిన దాదాపు వెయ్యికి పైగా బంగారం, వెండి, వజ్రాలు పొదిగిన శ్రీరామ శిలలు కూడా మాయమైనట్లు కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సిట్ 200 మంది అనుమానితుల జాబితాను సిద్ధం చేసి, ఇప్పటికే 125 మందికి పైగా ఆలయ సిబ్బందిని, బ్యాంకు అధికారులను ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు లీగల్ నోటీసు పంపారు. 2021 నుంచి 2026 వరకు వచ్చిన ప్రతి రూపాయి విరాళం, ఖర్చులు, ఆడిట్ రిపోర్టుల వివరాలను 3 రోజుల్లోగా బహిరంగపరచాలని డిమాండ్ చేశారు రాష్ట్రీయ జనతా దళ్ ఎంపీ సుధాకర్ సింగ్. యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ ఈ సిట్ దర్యాప్తును డమ్మీగా కొట్టిపారేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్ కూడా దీనిపై పూర్తి స్థాయి జుడీషియల్ విచారణ జరపాలని కోరారు.
ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ, యూపీ సర్కార్ గట్టిగా తిప్పికొట్టాయి. ఆలయ కానుకల్లో స్వల్ప తేడాలు ఉన్నట్లు ఇంటర్నల్ ఆడిట్లో గమనించి, స్వయంగా రామాలయ ట్రస్టే సీఎం యోగి ఆదిత్యనాథ్కు లేఖ రాసి విచారణ కోరిందని గుర్తుచేశారు. తప్పులు బయటపెట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వేగంగా సిట్ ఏర్పాటు చేసిందని సమర్థించుకున్నారు. దేశ ప్రజల భక్తితో ముడిపడిన ఈ విరాళాల మాయంపై సిట్ తన ప్రాథమిక నివేదికను మరో 2 రోజుల్లో, పూర్తి స్థాయి ఫైనల్ రిపోర్టును 15 రోజుల్లోగా సమర్పించాల్సి ఉంది. ఆ నివేదిక వస్తేనే ఈ స్కామ్ వెనుక అసలు సూత్రధారులు ఎవరనేది తేలనుంది.
Also read: విడాకులు తీసుకోబోతున్న మరో టీవీ నటి.. అసలేం జరిగిందంటే..?