ఆరెసెస్ చీఫ్ మహేశ్ భగవత్ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలపడమే అసలైన రాజకీయం. దేశంలో మోడీ వ్యతిరేక భావన.. పవనాలు వీస్తున్నాయని చెప్పడానికి అప్పటి వరకు ఓ కొలమానం లేదు. ఆ కొలబద్దే కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో వచ్చింది. దేశంలో ఇక మోడీకి తిరుగులేదు… మళ్లీ మళ్లీ మా మోడీనే అని ఎంత ఛాతి పొంగించి చెప్పినా.. అసలు రాజకీయం ఎలా ఉందో .. మున్ముందు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో.. కాక్రోచ్ పార్టీ జస్ట్ ఓ శాంపిల్ చూపింది. ఇది కేవలం మాటలకే కాదు చేతలకు కూడా దిగుతుందని జంతర్మంతర్ వద్ద చేపట్టిన ధర్నాతో నిరూపించింది.
గాలికి పుట్టింది.. గాలికి పెరిగిందని లైట్ తీసుకుందామనుకున్నా.. అక్కడ సినిమా వేరే లెవల్లో రూపొందుతుందని అర్థం చేసుకున్నది ఆరెసెస్. నేల విడిచి సాము చేయడం ఆరెసెస్కు రాదు. అది ఉన్నదున్నట్టుగా చెబుతుంది. అది తన సిద్దాంతమైనా, దేశంలో తాము మద్ధతు తెలుపుతున్న బీజేపీ రాజకీయమైనా. అందుకే కేంద్రంలోని ప్రభుత్వం, మోడీ, అమిత్షాల ద్వయం ఒప్పుకోకపోవచ్చు.. తమపై వ్యతిరేక భావన పెరుగుతుందని, కానీ క్రమంగా దక్షిణాదిన మారుతున్న రాజకీయ ఫలితాల ప్రదర్శన, కాక్రోచ్ పార్టీల ఆవిర్భావ ఆగ్రహ జ్వాల.. ఆ కీలల సెగ తమను తాకితే మాడి మసైపోతామనే భయం వెంటాడుతుంటే..! కష్టమైనా వాస్తవాన్ని అంగీకరించాల్సిందే. అందుకే ఆరెసెస్ వెంటనే నష్ట నివారణకు దిగింది. తాము కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా ఉన్నామని ప్రకటించింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. నవ్వు తెప్పించింది.
ఓటమి భయం ఎలా వెంటాడుతోందో.. మోడీ ముసుగు కప్పుకుని వచ్చిన మహేశ్ భగవత్ను చూసి.. ఎంట్రీతోనే మెడలు వంచామనే ధీమా ఆ బొద్దింకల్లో కనిపిస్తున్నది. నీట్ పేపర్ లీక్పై ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలనే డిమాండ్ చేయడం.. దీనికి వారం గడువు విధించడం చూస్తుంటే.. ఇది బీజేపీకి ముచ్చెమటలే పట్టించిందని చెప్పాలి. ఈ కాక్రోచ్ పార్టీని ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ రెండూ ఆసక్తిగా గమనిస్తున్నాయి. దీని ఆవిర్భావమే బీజేపీ వ్యతిరేక భావజాలంలోంచి వచ్చింది. కానీ దీన్ని వెంటనే కాంగ్రెస్ కూడా సమర్థించలేదు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అది జనాధరణ పొందుతున్న తీరు కాంగ్రెస్కు ఉత్సాహాన్నిస్తోంది. కానీ రాహుల్ ఏనాడూ దీనిపై కామెంట్ చేయలేదు.
కారణం..ఆయన తన స్థాయిని తగ్గించుకోవాలనుకోవడం లేదు. వాస్తవానికి, కాక్రోచ్ పార్టీ లేవనెత్తిన చాలా అంశాలను ఏనాటి నుంచో రాహుల్ చాలా బహిరంగ వేదికల మీద ధ్వజమెత్తారు. కేంద్రాన్ని నిలదీస్తూనే ఉన్నారు. బీజేపీ పని అయిపోయిందని, ఇక మోడీ పదవికి కాలం దగ్గరపడిందని ఆయన తాజాగా కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ .. కేంద్రంలోని మోడీని ఎదుర్కోవాలంటే ప్రత్యామ్నాయం.. కాంగ్రెస్సే. అంతిమంగా ఆఖరిపోరాటంలో కాక్రోచ్ పార్టీ కాంగ్రెస్కు సంఘీభావంగా ముందుకు పోవాల్సిందే. అప్పుడే అది అనుకున్న లక్ష్యానికి చేరువ కాగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలను కూడా కాంగ్రెస్ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు.. మోడీపై కాంగ్రెస్ చేయబోయే యుద్దానికి, ఉడుతా భక్తిగా కాక్రోచ్ పార్టీ కూడా కలిసిరానుంది.
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా.. రాహుల్కు సంకేతాలన్నీ ఒక్కొక్కటిగా పాజిటివ్గా వస్తూ… ఆ పార్టీకి కొత్త ఊపును తెచ్చిపెడుతున్నాయి. బీజేపీకి కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అందుకే దీన్ని తమ మీద జరుగుతున్న దాడిగా జనంలో ముద్ర పడకుండా ఉండేందుకు.. తెలివిగా ఆరెసెస్ తాము కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలుపుతున్నామని ప్రకటించుకున్నది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. అందుకే ఇకపై కాక్రోచ్ పార్టీని లైట్గా తీసుకోవద్దని బీజేపీ డిసైడ్ అయ్యింది. రాజకీయంగా దాని ప్రాధాన్యతను తగ్గించడంతో పాటు.. అది బీజేపీని భూస్థాపితం చేయడానికి వచ్చిన పార్టీ కాదు.. !అని చెప్పే ప్రయత్నంలో ఓ అడుగు ముందుకేసింది.
అందులో భాగమే ఆరెసెస్ హాస్యాస్పద మద్దతు కామెంట్. ఓ వైపు కేంద్రమంత్రిని దిగిపొమ్మంటుంటే.. మేము మీకు సపోర్టుగా ఉన్నామని ఆరెసెస్ అనడం.. కేంద్రం పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో తెలియజేసినట్టా? పెరుగుతున్న నష్టాన్ని కొంచెంలో కొంచెమైనా తగ్గించి.. ఈ ఉద్యమాన్ని మరింత పెద్దది చేయకుండా నిలువరించడానికా? దీనిపైనే ఇప్పుడు దేశ వ్యాప్త చర్చ జరుగుతోంది.