చంద్రబాబు పథకాలు.. నిర్ణయాలు.. ఆయన ప్రసంగాలు నిత్యం వార్తల్లో నిలుస్తాయి. చర్చకు తావిస్తాయి. కొందరికి నవ్వునూ తెప్పిస్తాయి. కానీ ఆయన డోంట్ కేర్ అంటారు. అనుకున్నది సాధించేందుకు ముందుకు పోతారు. ఎక్కడా వెనకడుగు వేయరు. ఇన్నేండ్ల తన సీనియారిటీలో కొంత ప్రసంగం తానే అన్నీ చేశాననే భావన ముడిపడి ఉండొచ్చు. కానీ దానికీ ఆయన వెనకు రారు. బాజాప్తా చెబుతారు. కొంత అతియోక్తి అనిపించినా.. కొందరు ఎబ్బెట్టుగా ఫీలయినా.. తను మాత్రం అన్నీ చెప్పేస్తాడు.
పొగడ్తకు పడని నేత ఎవరుంటారు? కానీ ఇక్కడ బాబు తనకు తానే పొగడుకోవడమే డిఫరెంటు సబ్జెక్టు. అది ఆయనకో అలవాటు. దోమల పై దండయాత్ర చేద్దామని పిలుపిస్తారు. ఆ వెంటనే ప్రతిపక్షాలు దీన్ని సిల్లీగా తీసుకుంటాయి. మచ్చర్ పహిల్వాన్.. అని బిరుదిస్తారు. అయినా పట్టించుకోరు. నిజానికి, దోమల బెడద తీవ్రత అందరికీ తెలుసు. అది చిన్న విషయంగా అనిపించొచు. కానీ వాటి బారిన పడని జనం లేరు. మరి అంతమందిని బాధించే ఆ దోమల మీద యుద్ధం ప్రకటిస్తే తప్పేముంది? ఆయన పథకాలు డిఫరెంటుగా ఉంటాయి. పనికి ఆహారం పథకం.. జన్మభూమి లాంటి పథకాలు ఎప్పటికీ గుర్తుండేవే. శ్రమదానం తో ఆయన అందరినీ ఆకట్టుకున్నవారే.
ఉమ్మడి ఏపీలో దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లపై వంట చేసుకునేలా పేదలకు అలవాటు చేసింది చంద్రబాబే అంటే అతిశయోక్తి కాదు. కానీ ఇదే మాట ఆయన నోటి వెంట చెబితే.. అబ్బా ఏం గ్యాస్ కొట్టుకుంటున్నాడ్రా బాబు..! అని బాబును ఆడిపోసుకుంటారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు మేలు చేసినవే. కొన్ని ఫెయిల్ అయ్యి వుండొచ్చు. కొన్ని నిర్ణయాలు వివాదస్పదం కావొచ్చు. కానీ ఆయన మార్కు నిర్ణయాలు, పాలన జనానికి చేరువైనవే. మెచ్చుకోలు పొందినవే. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటారా? ఇప్పుడు తాజాగా ఆయన ఏపీలో పిల్లలే సంపద.. అనే కొత్త పథకం తీసుకొచ్చారు.
దీనికి ఇవాళే కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మేమిద్దరం.. మాకిద్దరు.. అనే కుటుంబ నియంత్రణ నుంచి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు జనాభాను పెంచే పనిని భుజానేసుకోవాలేది బాబు ఉద్దేశ్యం. ఆయన ఇది వరకే చాలా వేదిక మీద చెప్పి ఉన్నారు. ఏమని? ప్రపంచ వ్యాప్తంగానే తెలుగు ప్రజల సంఖ్య బాగా తగ్గుతుందని. దీని వల్ల తెలుగు వారి ప్రాభవం ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో తగ్గుతుందని. అందుకే జనాభా పెంచుకోవాలని, పిల్లలను కనాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. దీనిపై నవ్వుకున్నారంతా. కానీ ఇప్పుడు ఏకంగా ఆయన ఓ పథకాన్నే తీసుకొచ్చారు ఏపీలో. ఒక్కరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు.. ఈ పథకం నినాదం.
ఇద్దరి తరువాత పుట్టే మూడో సంతానికి ప్రత్యేకంగా ఆర్థిక ప్రోత్సాహం… ఆ తరువాత ప్రతి సంతానానికీ కూడా. దీనికి లిమిట్ లేదు. పరిస్థితులు అలా వచ్చాయి మరి. దీన్ని కొంత మంది సిల్లీగానే చూడొచ్చు. నవ్వుకోవచ్చు. చర్చకు తావివ్వొచ్చు. కానీ బాబు డోంట్ కేర్. అనుకున్నది చేసేస్తారు. ప్రాక్టికల్ మేన్ కదా! అందులోనూ సీనియర్ మోస్ట్ సీఎం కూడా. కానీ కుటుంబ నియంత్రణ వల్ల మన తెలుగు జనాభా ఇంతగా తగ్గిపోయిందని బాధపడిపోయిన బాబుగారు… మొన్న కేంద్రం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని అంతా గగ్గోలు పెడితే.. ఆయన మాత్రం రివర్స్ గేర్ వేశారు. కేంద్రంతో మిత్రబంధం కారణం కావొచ్చనుకుంటే పొరపాటే. ఆయన తరువాత కూడా దీన్ని వ్యతిరేకించిన పార్టీలను తీవ్రంగా విమర్శించారు. కొన్ని కొన్ని అంతే. బాబు ఏది సరైదనకుంటే.. మనమూ అది కరెక్టే అనుకుంటే సరి. వివాదం ఉండదు. ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ కదా!