దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలం పుంజుకుంటోంది. ఇక్కడ రాహుల్ నాయకత్వాన్ని బలంగా కోరుకోవడం.. ఈ రాష్ట్రాల నుంచి పార్టీ నేతలు, వ్యూహకర్తలు కష్టకాలంలో తోడుండటం కూడా కలిసివస్తోంది. ట్రబుల్ షూటర్స్గా పార్టీలో ప్రసిద్దిగాంచిన నేతలంతా దాదాపు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారై ఉంటడం.. వారికి పార్టీ సముచిత ప్రాధాన్యతనివ్వడం.. కీలక స్థానాల్లో ఉండటం.. ఇవన్నీ కాంగ్రెస్కు కాలంతో పాటు కలిసివస్తున్నాయి. ఇప్పుడీ చర్చంతా ఎందుకంటే.. కర్ణాటకలో సీఎంలను మార్చి కొత్త శకానికి నాంది పలికన అధిష్టానం తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలాబలాలపై చర్చ జరిగేలా చేసింది.
ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే.. బీజేపీని ఢీకొట్టి అధికారంలో బలంగా మనగలిగే స్థితిని చేరుకున్నది కాంగ్రెస్. వ్యూహకర్తల నుంచి పార్టీ నేతల దాకా అంతా రాహుల్కు రక్షణ కవచంలా నిలిచిన వైనమూ ఇప్పుడు డిస్కషన్ పాయింట్గా మారింది. కేరళలో కాంగ్రెస్ గెలవడం.. అక్కడ తనకు సీఎంగా చాన్సు ఉన్నా.. రాహుల్కు, పార్టీకి నిబద్దత కలిగిన నేతగా, వ్యూహకర్తగా ఉండిపోయాడు కేసీ వేణుగోపాల్. ఓ రకంగా అక్కడ కేసీ వేణుగోపాలే సీఎం.. అనే విధంగా పార్టీ ప్రచారం చేసుకున్నది. కానీ సమకాలీన పరిస్థితులు.. ఢిల్లీ రాజకీయాల్లో పార్టీకి కావాల్సిన వ్యూహాల్లో కీలకభాగస్వామిగా కేసీని కేరళకు పరిమితం చేయాలనుకోలేదు అధిష్టానం. ఇప్పుడు కర్ణాటక సీఎంగా కాబోతున్న డీకే శివకుమార్ కూడా కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్ లాంటివాడే.
కష్టకాలంలో పార్టీని అధికారంలోకి తేవడంలో తనదైన వ్యూహాలు రచించి..అన్ని రకాలుగా అండదండలందించి అధిష్టానానికి వెన్నుదన్నుగా నిలిచినవాడే. ఇక తమిళనాట కూడా రాహుల్.. టీవీఎస్కు మద్దతు పలికే విషయంలో చవరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం కూడా పార్టీకి బాగా కలిసి వచ్చింది. అక్కడ గెలిచింది ఐదు ఎమ్మెల్యే సీట్లే. కానీ.. ఇద్దరు మంత్రి పదవులను పొందే స్థాయిలో విజయ్ ఇచ్చిన ప్రాధాన్యత, రాహుల్కు తమిళనాట దొరికిన అరుదైన గౌరవంగా భావించారు కాంగ్రెస్ శ్రేణులు. ఇక తమిళనాట కూడా కూటమి ప్రభుత్వంలో కాంగ్రెస్ కీలక భూమిక పోషించనుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి .. అధిష్టానానికి పెద్ద అసెట్గా మారాడనడంలో ఆశ్చర్యం లేదు.
పీసీసీ చీఫ్గా ఎంట్రీ ఇచ్చి.. పార్టీని అధికారంలోకి తెచ్చి.. వేళ్లూనుకుని పోయిన బీఆరెస్ తాకిడిని తట్టుకుని నిలిచి గెలిపించిన రేవంత్కు అధిష్టానం ఎప్పుడూ పెద్దపీట వేస్తూ వస్తున్నది. క్రమంగా ఆయన ఏఐసీసీలో కీలకంగా మారే అవకాశాలూ లేకపోలేదు. మరోసారి పార్టీని అధికారంలోకి తెచ్చి.. రెండోసారి కూడా నేనే సీఎంను అవుతానని బాహాటంగా ప్రకటించడం కూడా చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే. మూడోటర్ములో జాతీయ రాజకీయాలకు పరిమితవుతానన్న రేవంత్.. రాహుల్ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటానన్నారు. ఒక్క ఏపీ మినహా.. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్నది. కీలకమైన ఈ నేతలు ట్రబుల్ షూటర్స్గా పార్టీకి రక్షణ కవచంలా నిలవడం.. వ్యూహాలు రచించే అంశంలో రాహుల్కు సమఉజ్జీగా నిలవడం.. ఇవన్నీ కూడా జాతీయ కాంగ్రెస్కు అదనపు బలాలుగా నిలుస్తున్నాయి.
దక్షిణాది ఎఫెక్ట్.. క్రమంగా ఉత్తరాదినీ తాకే స్థితీ రావొచ్చంటున్నారు విశ్లేషకులు. అయితే ఏపీ మినహా .. కాంగ్రెస్కు ఇక్కడ అన్నీ మంచి రోజులే కనిపిస్తున్నాయి. వారసత్వ రాజకీయాలకు బీజేపీ దూరమని ప్రకటించిన నేపథ్యంలో.. తన కొడుకు లోకేశ్ విషయంలో.. అవసరమైతే కూటమిని మార్చే విషయంలో కూడా చంద్రబాబు వెనక్కి రాడు.. ఇది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. తమిళనాడులో కాంగ్రెస్ అంత కీలకంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. అంతే ఏపీలో కూడా రేపు ఏదైనా జరగొచ్చు. దక్షిణాధి రాష్ట్రాలు మాత్రం రాహుల్ నాయకత్వానికి జవజీవాలందిస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.