ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే కొత్త ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు కన్నేశాయి. ఉన్నవాటిని కొనసాగించడం మామూలే. కానీ కొత్త సర్కార్.. తన పాలనలో తనదైన మార్కు వేసుకునేందుకు కొత్త స్కీమ్లను తెరపైకి తెచ్చింది. దీంట్లో ప్రధానంగా పరిశ్రమలు, ఫోర్త్ సిటీ పేరుతో పలు పరిశ్రమల స్థాపన, రియల్ ఎస్టేట్ వృద్ధి, త్రిపుల్ ఆర్ పేరుతో రింగు రోడ్డు… వీటన్నింటికీ కీలకమైనవి భూములు. వీటిని సేకరించేక్రమంలో ఏ సర్కారున్నా కొన్ని ఇబ్బందులుంటాయి. కానీ ఈ సర్కార్లోనే ఇన్ని ఇబ్బందులు పెట్టడం, ప్రతిపక్షం ప్రధానంగా వీటికి ఆటంకంగా నిలవడంతోనే రాజకీయం వేడెక్కుతున్నది.
వాస్తవానికి రేవంత్ సర్కార్ వచ్చిన తరువాత కొడంగల్లోని లగచర్ల లో ఫార్మా ఇండస్ట్రీ స్థాపన నుంచి మొదలైంది భూసేకరణపై లొల్లి. ప్రధాన ప్రతిపక్షంగా బీఆరెస్.. రేవంత్ సర్కార్ చేపట్టబోయే ప్రతి కార్యక్రమాన్ని ఏదో విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. ఫార్మా అంటే అక్కడి భూములు, వ్యవసాయం కలుషితం అవుతాయని, బలవంతంగా భూసేకరణ జరుగుతున్నది, అల్లుడికి ఫార్మా ఇండస్ట్రీని కట్టబెట్టే క్రమంలో ఇవన్నీ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపణలు చేశాడు. రైతులను రెచ్చగొట్టి, దాడులు, కేసుల దాకా వెళ్లిందా ఇష్యూ. మళ్లీ ఇప్పుడు తాజాగా ఫోర్త్ సిటీపై హరీశ్రావు చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. తాము అధికారంలోకి రాగానే ఫోర్త్ సిటీని రద్దు చేస్తామని, భూములన్నీ వాపస్ ఇస్తామని చెప్పడం.. రాజకీయంగా గందరగోళానికి తెరతీయడం బీఆరెస్ ఉద్దేశ్యంగా ఉంది.
ఇక తాజాగా కవిత కూడా సర్కార్ చేపడుతున్న అన్ని ప్రాజెక్టుల విషయంలో జరుపుతున్న భూసేకరణను అడ్డుకోవాలని ఏకంగా ఇవాళ గరవ్నర్ కలవడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి, ఓ వైపు బీఆరెస్, మరోవైపు టీఆరెస్.. రెండూ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడుతున్నట్టే ఉంది పరిస్థితి. మొన్న మొన్ననే పార్టీ పెట్టినా కవిత కూడా ఏమాత్రం తగ్గడం లేదు. బీఆరెస్కు మించి జనాల వద్దకు చేరాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో హరీశ్ .. ఫోర్త్ సిటీపై కామెంట్ చేయడం.. వెంటనే కవిత ఈ భూముల సేకరణను ఆపాలని గవర్నర్ ను కలిసి, కేంద్రం జోక్యం అవసరమని మరీ నొక్కి చెప్పడం.. వెనుక రాజకీయ కోణం స్పష్టంగా కనిపిస్తున్నది. మాటలతో గందరగోళం సృష్టించి సర్కార్ చర్యలకు పంటి కింద రాయిలా మారాలని బీఆరెస్ భావిస్తోంది.
కవిత ఏకంగా రాజకీయ కోణంలో దీనికి తనవంతు పాత్ర పోషించి.. భూసేకరణ విషయంలో తగిన న్యాయం బాధితులకు చేపించాలి.. లేదంటే.. పోరాడాలి..! అనే పంథాను ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చేయాలనే డిమాండ్ వెనుక .. ఈ ప్రాజెక్టులకు కొద్ది కాలం బ్రేక్పడే సూచనలు కూడా పరోక్షంగా ఇచ్చినట్టవుతోంది. ఒకవేళ గవర్నర్ ద్వారా కేంద్రం జోక్యం చేసుకుని బాధితుల పక్షాన నిలిచి.. వారికి తగు న్యాయం అనే కోణంలో మళ్లీ పరిశీలన చేయాలని సూచించినా.. అది తమ పార్టీ విజయంగానే భావించాలనే ఓ ఆలోచన కూడా ఇందులో ఇమిడి ఉండవచ్చు. త్రిపుల్ ఆర్ విషయంలో కూడా పలుమార్లు ప్రభుత్వం మార్చిన అలైన్మెంట్ గురించి వివరించడం.. కిషన్రెడ్డి కూడా దీనిపై గతంలో లేఖ రాసిన సందర్భాన్ని వివరించిన విధానం చూస్తే కేంద్రం దీంట్లో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
ప్యూచరే లేని సీఎం ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచిస్తున్నాడని ఎద్దేవా చేసేలా బీఆరెస్ కామెంట్లు చేస్తున్నది. అక్కడి రైతులను మరింత గందరగోళ పరుస్తున్నది. టీఆరెస్, ధర్మసమాస్ పార్టీ నాయకుడు విశారదన్ కూడా భూసేకరణ పేరుతో భూదోపిడీ జరుగుతుందని, తక్కువ ధరలకే రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారని గతంలో ఆరోపణలు చేశారు. మొత్తానికి ఈ రెండు ప్రతిపక్షాలు.. సర్కార్ చేపట్టే తన కొత్త ప్రాజెక్టులకు.. అదీ భూసేకరణతో ముడిపడిన వాటికి అడ్డం పడటంలో పోటీలు పడుతున్నట్టే అనిపిస్తుంది. అందుకే ఇందులో గవర్నర్ పాత్రను కూడా జోడించారు. మరి ఆ గవర్నర్ ఏ మేరకు వీరి డిమాండ్లకు సానుకూలంగా వ్యవహరిస్తారు? కేంద్రం జోక్యం ఏ మేరకు ఉంటుంది? సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయా? కాళ్లకు అడ్డం పడే ఈ చర్యలతో మరింత జాప్యం జరగనుందా? చూడాల్సి ఉంది.