ఏపీలో ప్రతిపక్ష వైసీపీ.. గతంలో అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తుతం పశ్చాత్తాపపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేతలు సైతం ఇప్పుడు రియలైజ్ అయినట్టు తెలుస్తోంది. మాజీ సీఎం జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీకి చేటు చేశాయని.. అందుకే సంక్షేమాన్ని క్రమ పద్ధతిలో అమలు చేసినా ఎందుకు ఓటమి పాలయ్యామో నేటివరకు ఆ పార్టీ నేతలకు క్లారిటీ రావడం లేదని టాక్ వినిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వ్యతిరేకత పెద్దగా కనిపించలేదని మరి ఎందుకు ఓడిపోయాం? అనే కారణాలను తెలుసుకునే పనిలో సీనియర్లు నిమగ్నం అయినట్టు సమాచారం. కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్టు వైసీపీ ఓటమికి సైతం పలు కారణాలు ఉన్నాయని కొందరు నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నాటి సీఎం జగన్ వాలంటీర్ల వ్యవస్థను తెరమీదకు తెచ్చారు. అప్పటివరకు గ్రామీణప్రాంతాల్లో ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్లను ఈ వ్యవస్థ పూర్తిగా తుడిచి పెట్టేసింది.నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించే ఉద్దేశంతో తెచ్చిన ఈ వ్యవస్థ కాస్త రానురాను స్థానిక సంస్థల పవర్ను లాగేసుకున్నాయని ప్రచారం జరిగింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ అందజేయడం, రేషన్ సరుకులు, బిల్లుల చెల్లింపు వంటి పనులను వాలంటీర్లు చూసుకునేవారు. కొంత కాలానికి రాజ్యంగ బద్దంగా ఏర్పడిన గ్రామీణ పాలనా వ్యవస్థపై వాలంటీర్ వ్యవస్థ పెత్తనం పెరిగింది.సర్పంచులకు ఉండాల్సిన చెక్ పవర్ వీరి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఫలితంగా సర్పంచులు, వార్డు మెంబర్లు రోడ్డున పడ్డారు. ఆందోళనలు సైతం చేశారు.
దీనికి తోడు రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా అక్కడి వాలంటీర్లు జగన్ సర్కారుకు ప్లస్ అయ్యేలా పావులు కదిపారని నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపించాయి. జనరల్ ఎలక్షన్ సమయంలోనూ ప్రభుత్వంలో భాగంగా ఉన్న వాలంటీర్లు.. జగన్ పార్టీ తరఫున ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి.ఈ విషయం ఎన్నికల కమిషన్ వరకు వెళ్లడంతో కొందరు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వైసీపీ తరపున ప్రచారం నిర్వహించినట్టు తెలిసింది.తాజాగా ఈ వ్యవస్థపై మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పెదవి విరిచారు. వాలంటీర్ల వ్యవస్థ వల్లే వైసీపీ రెండోసారి రాలేకపోయిందని ఆరోపించారు.ఆయన వ్యాఖ్యలు కాస్త సొంత పార్టీనే ఇరకాటంలో పెట్టాయి.పరోక్షంగా జగన్ తప్పు చేశారని ఆయన అంగీకరించినట్టు అయ్యిందని చర్చ జరుగుతున్నది.
హరీష్రావు ఢిల్లీ టూర్..బీఆర్ఎస్లో ముసలం, ఎంపీ కిరణ్ కుమార్రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని..కానీ, వాలంటీర్లను వేరే పనికి వినియోగించుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. కానీ, అధికారంలోకి వచ్చాక చెప్పినట్టుగానే సర్పంచుల పాలనా వ్యవస్థను పునరుద్ధరించారు. వాలంటీర్ వ్యవస్థను రద్దుచేశారు.వాలంటీర్లుగా పనిచేసిన వారికి పెద్దగా ప్రాధాన్యత కల్పించలేదు. ఇప్పుడు ఆ వ్యవస్థ పూర్తిగా తొలిగిపోయినట్టే అని తెలుస్తున్నది.మరల ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినా వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. గతంలో జరిగిన తప్పిదాలు మరల రిపీట్ చేయొద్దని మాజీ సీఎం జగన్ సైతం భావిస్తునట్టు తెలుస్తున్నది.