Kaju Paneer Bhurji: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఏదైనా స్పెషల్ రెసిపీ చేసుకుని తినాలనిపిస్తే.. ఈ కాజూ పనీర్ బుర్జీ బెస్ట్ ఆప్షన్. బయట దొరికే పనీర్ కంటే.. ఇంట్లోనే పాలను విరగ్గొట్టి చేసే ఫ్రెష్ పనీర్ బుర్జీలో ఆ టేస్టే వేరు. వేడివేడి చపాతీలు లేదా పుల్కాల్లోకి ఈ కూర తింటుంటే.. కరకరలాడే జీడిపప్పు, సాఫ్ట్ పనీర్ కాంబినేషన్ అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా!
ముందుగా అర లీటర్ పాలు, అరకప్పు జీడిపప్పు సిద్ధం చేసుకోండి. పాలు విరగగొట్టడానికి అర ముక్క నిమ్మకాయ ఉండాలి. వీటితో పాటు రెండు ఉల్లిగడ్డలు, రెండు టమాటాలు, అర కప్పు కొత్తిమీర తరుగు, గుప్పెడు పుదీనా ఆకులు తీసుకోండి. ఇక తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఒక టీ స్పూను జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, అర టీ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద, రుచికి సరిపడా ఉప్పు దగ్గర పెట్టుకోండి.
Also Read: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియా.. ఇలా చేస్తే ముక్క జ్యూసీగా, టేస్టీగా రావడం ఖాయం!
పాలను పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు నిమ్మరసం పిండితే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు ఆ విరిగిన పనీర్ నుండి నీళ్లన్నీ పూర్తిగా వడకట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డలు, టమాటాలు, పుదీనా, కొత్తిమీరను వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలిలో నూనె వేసి, జీడిపప్పును దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోండి.
అదే నూనెలో జీలకర్ర వేసి, అది చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్దవేసి పచ్చి వాసన పోయే వరకు వేపి, ఆపై టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గాక ముందుగా తయారు చేసుకున్న పనీర్ మిశ్రమాన్ని దాంట్లో వేసి, తగినంత ఉప్పు కలిపి కాసేపు మూత పెట్టాలి. ఈలోపు ఒక చిన్న కప్పులో శనగపిండిని తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా జారుగా కలుపుకోవాలి.
ఈ శనగపిండి మిశ్రమాన్ని బాణలిలోని కూరలో చుట్టూ తిప్పుతూ పోయాలి. మిశ్రమమంతా కాస్త దగ్గర పడ్డాక, చివరగా వేయించిన జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా చల్లుకుని ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆపేయండి. అంతే.. వేడివేడి ఇన్స్టంట్ కాజూ పనీర్ బుర్జీ తినడానికి రెడీ.
Also Read: నోరూరించే చింతచిగురు పచ్చి రొయ్యల ఇగురు.. ఇలా వండితే ఇంటిల్లిపాదీ ఫిదా అయిపోతారు!