Airtel Recharge: తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఊహించని షాక్ ఇచ్చింది. యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటూ వస్తున్న రూ.299 అపరిమిత డైలీ డేటా రీఛార్జ్ ప్లాన్ను నిలిపివేసింది. ప్రస్తుతం ఎయిర్టెల్ వెబ్సైట్తో పాటు ‘ఎయిర్టెల్ థాంక్స్’ యాప్ నుంచి కూడా ఈ ప్లాన్ను పూర్తిగా తొలగించారు. గతేడాది ధరల సవరణలో భాగంగా రూ.249 నుంచి రూ.299కి పెరిగిన ఈ ప్లాన్.. డైలీ డేటా కోరుకునే వారికి అత్యంత చౌకైన ఆప్షన్గా ఉండేది. అయితే దాని స్థానంలో ఎయిర్ టెల్ మరో ప్లాన్ ను తీసుకొచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రూ.299 ప్యాక్ రద్దు కావడంతో.. ఇకపై అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా కావాలనుకునే వినియోగదారులు తప్పనిసరిగా రూ.349 రీఛార్జ్ ప్లాన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త ఎంట్రీ-లెవల్ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, అపరిమిత లోకల్, STD కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. దీని కాలపరిమితి 28 రోజులు. దీంతో పాటు, ఆరు నెలల యాపిల్ మ్యూజిక్ యాక్సెస్, 12 నెలల అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియమ్ సబ్స్క్రిప్షన్, ఉచిత ఎయిర్టెల్ హలో ట్యూన్స్ వంటి అదనపు ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది.
పై పేర్కొన్న దాని తర్వాతి ప్లాన్ విషయానికి వస్తే.. రూ.399 రీఛార్జ్ అందుబాటులో ఉంది. ఇది కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. అయితే ఇందులో రోజుకు 2.5GB డేటాతో పాటు 28 రోజుల జియోహాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
కేవలం రూ.299 ప్లాన్ మాత్రమే కాకుండా.. ఎయిర్టెల్ తన రూ.579, రూ.619 ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా కొన్ని ఎంపిక చేసిన టెలికామ్ సర్కిళ్లలో నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ ప్లాన్లు ప్రస్తుతం ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లో కనిపిస్తుండటంతో.. ఈ మార్పులు దశలవారీగా లేదా నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితమయ్యే ఛాన్స్ ఉందని టెలికాం వర్గాలు చెబుతున్నాయి.
Also Read: బయటకొచ్చిన వైసీపీ కాక్రోచ్లు.. రోడ్లపై నిరాహార దీక్షలు.. ఎక్కడో కొడుతోంది శీనా..!
తక్కువ ధర గల రీఛార్జ్ ఆప్షన్లను తొలగించడం ద్వారా కస్టమర్లను ఎక్కువ విలువైన ప్లాన్ల వైపు మళ్లించాలని ఎయిర్టెల్ భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల కంపెనీకి ఒక వినియోగదారుడి నుండి వచ్చే సగటు రాబడి (ARPU) పెరగడమే కాకుండా.. తమ 4G, 5G నెట్వర్క్ విస్తరణకు అవసరమైన పెట్టుబడులకు ఆదాయం లభిస్తుందని ఎయిర్ టెల్ అంచనా వేస్తోంది. పైగా త్వరలోనే మరోసారి రీఛార్జ్ ధరల పెంపు ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో సామాన్యులపై మరింత భారం పడే ప్రమాదం కనిపిస్తోంది.
Also Read: తప్పు నంబర్కు రీఛార్జ్ చేశారా? టెన్షన్ వద్దు.. ఇలా చేస్తే డబ్బు రిఫండ్!