Social Media Ban: చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వాడకంపై కఠిన నిబంధనలు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. సోషల్ మీడియా వినియోగం వల్ల తలెత్తుతున్న దుష్ప్రభావాలు.. సైబర్ వేధింపులు.. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం వంటి అంశాలపై ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పిల్లలు సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారుతుండటంతో.. దీనిపై నియంత్రణ అవసరమని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది.
చిన్నారులకు సోషల్ మీడియా యాక్సెస్ను పరిమితం చేయడం లేదా పూర్తిగా నిషేధించడంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లతో మూడు విడతలుగా చర్చలు జరిపింది. ప్రస్తుతం వయస్సు ఆధారిత యాక్సెస్ సరిగ్గా అమలు కాకపోవడంతో, ఏ వయస్సు లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలనే అంశంపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తోంది. పిల్లల్లో పెరుగుతున్న వ్యసనం, సైబర్ మోసాలు, బెదిరింపుల నుండి వారిని రక్షించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
ఈ సున్నితమైన అంశంపై గత వారం జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలక సమావేశాన్ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా చిన్నారులు సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్నారని.. ఏఐ (AI).. ఎడ్-టెక్ (Ed-Tech) ప్లాట్ఫారమ్లలో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఎన్హెచ్ఆర్సి గుర్తించింది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. చిన్నారుల మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా చూపుతున్న ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తోంది.
కేంద్రం నిర్ణయానికి ముందే కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో ముందడుగు వేశాయి. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం 26 ఏళ్ల లోపు యువతకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించాలని యోచిస్తోంది. చిన్నారుల విద్యాభ్యాసం.. శారీరక.. మానసిక ఎదుగుదలకు సోషల్ మీడియా అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశ్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. త్వరలోనే దీనిపై కేంద్రం నుండి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది.