భూకంపం ఎంత తీవ్రతతో వచ్చిందో చెప్పేందుకు సిస్మోగ్రాఫ్ అనే పరికరాలున్నాయి కానీ, ఎప్పుడొస్తుందో ముందుగా ఊహించి చెప్పే సాంకేతికత పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. సిస్మోమీటర్ అనే పరికరం ఉన్నా అది తీరా భూకంపం మొదలైన తర్వాతే సంకేతాలిస్తుంది. అందుకే దానివల్ల ఉపయోగం లేదని, మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. పక్షులు, కుక్కలు, కప్పల వంటి కొన్ని రకాల జంతువులు భూకంపం వచ్చేముందు వింతగా ప్రవర్తిస్తాయనే ప్రచారం మాత్రం ఉంది. భూకంపాన్ని అంచనా వేసి ముందుగా అప్రమత్తం చేసే వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఇంకేముంది.. ఆస్తినష్టం తప్పించలేకపోయినా ఎన్నో వేల ప్రాణాలు కాపాడుకోగలం. భూకంప బాధితుల సంఖ్యను తగ్గించగలం. దీనికోసం మనం నిత్యం ఉపయోగించే స్మార్ట్ ఫోన్లు సరిపోతాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. అవును, మనం రోజూ ఉపయోగించే ఆండ్రాయిడ్ ఫోన్లు భూకంపాల రాకను పసిగట్టి మనల్ని హెచ్చరిస్తాయి.
యాక్సిలెరోమీటర్
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే యాక్సిలెరోమీటర్ అనే సెన్సార్ భూకంపాలను ముందుగానే పసిగట్టగలదు. అయితే ఈ సెన్సార్ చెప్పిన సమాచారం సరైనదా కాదా అని నిర్థారించుకోవడం ఎలా. అందుకే వివిధ స్మార్ట్ ఫోన్ల మధ్య ఈ సమాచారాన్ని మార్పిడి చేసుకుంటారు. యాక్సిలెరోమీటర్ ద్వారా వచ్చిన సమాచారం ముందుగా సర్వర్ కు చేరుతుంది. ఆ తర్వాత సర్వర్ మిగతా ఫోన్ల నుంచి కూడా ఇలాంటి సమాచారం వచ్చిందో లేదో నిర్థారించుకుంటుంది. వాటన్నిటినీ అనాలసిస్ చేసి భూకంపం వస్తుందో లేదో చెప్పేస్తుంది. దీనికోసం గూగుల్ ఆండ్రాయిడ్ ఎర్త్ క్వేక్ అలర్ట్స్ (AEA) అనే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ద్వారా కచ్చితమైన భూకంప కేంద్రాన్ని కూడా గుర్తించవచ్చు.
స్మార్ట్ ఫోన్లతో ముందుగానే..
భూకంపం ఏర్పడినప్పుడు కేంద్రం నుంచి ఎస్ తరంగాలు, పి తరంగాలు బయటకు వస్తాయి. పి వేవ్ భూకంప కేంద్రాన్ని సూచిస్తుంది. ఎస్ వేవ్ ప్రభావిత ప్రాంతాలు అత్యంత ఎక్కువగా నష్టపోతాయి. స్మార్ట్ ఫోన్ల ద్వారా ముందు భూకంప కేంద్రం వద్ద సమాచారం లభిస్తుంది. దాన్ని అత్యంత వేగంగా విశ్లేషించి ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని హెచ్చరిస్తారు. తద్వారా నష్టానికి గురికాకుండా కొంతమందినయినా కాపాడినట్టవుతుంది. అంటే భూకంపాన్ని ముందుగానే స్మార్ట్ ఫోన్లతోనే పసిగట్టవచ్చనమాట.
ఫోన్లకు మెసేజ్..
మీరున్న ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి, పిడుగులు పడే ప్రమాదం ఉంది, బయటకు వెళ్లకండి అంటూ ఇటీవల మన స్మార్ట్ ఫోన్లకు టెక్స్ట్ మెసేజ్ లు రావడం చూస్తూనే ఉన్నాం. అయితే వాతావరణ శాఖ ఇచ్చే హెచ్చరికలను ప్రభుత్వం ఇలా ప్రజలకు చేరువ చేస్తోంది. ఇక్కడ ప్రభుత్వం లేదా మరో థర్డ్ పార్టీ ప్రమేయం లేకుండానే స్మార్ట్ ఫోన్లు భూకంప హెచ్చరికలను జారీ చేస్తాయి. AEA వ్యవస్థ ఈపని చేస్తుంది. ప్రస్తుతం 98 దేశాల్లో ఈ ఆండ్రాయిడ్ ఎర్త్ క్వేక్ అలర్ట్స్ అందుబాటులో ఉంది. అయితే భూకంపానికి ఎంత ముందుగా హెచ్చరికలు జారీ అయ్యాయనేదే ఇక్కడ అసలు పాయింట్. ఆ టైమ్ గ్యాప్ ఎంత ఎక్కువగా ఉంటే నష్టం అంత తక్కువగా ఉంటుంది. భూకంపం వచ్చింది అని చెప్పడం కంటే వస్తుంది జాగ్రత్త అనే హెచ్చరికలే ప్రాణాలు కాపాడతాయి.