Mandatory Cybersecurity App In Smartphone| భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలో విక్రయించే అన్ని స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథి’ అనే సెక్యూరిటీ యాప్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ యాప్ను ఎవరూ డెలీట్ చేయలేరు, డియాక్టివేట్ లేదా డిసేబుల్ చేయలేరు. సైబర్ దొంగల బారి నుంచి ప్రజలను కాపాడడమే లక్ష్యంగా కేంద్రం ఈ యాప్ ని తప్పనిసరి చేసింది.
నవంబర్ 28, 2025న టెలికాం మంత్రిత్వ శాఖ రహస్యంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. శామ్సంగ్, ఆపిల్, షావోమీ, వివో, ఒప్పో లాంటి అన్ని స్మార్ట్ఫోన్ కంపెనీలకు ఈ యాప్ను శాశ్వతంగా ఉండేలా ఫోన్లలో ప్రిఇన్స్టాల్ చేయాలని చెప్పింది.
ఈ భద్రతా యాప్ ఇన్స్టాలేషన్ కోసం టెక్ కంపెనీలకు ప్రభుత్వం కేవలం 90 రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. మార్చి 2026 నుంచి కొత్తగా వచ్చే ప్రతి ఫోన్లో ఈ యాప్ ఫ్యాక్టరీలోనే ఇన్స్టాల్ చేశాకే మార్కెట్లో పంపిణీ చేయాలి. ఇప్పటికే దుకాణాల్లో ఉన్న ఫోన్లకు ఆటోమాటిక్ అప్డేట్ చేయగానే ఈ యాప్ వచ్చేస్తుంది.
2023లో టెలికాం శాఖ ఈ యాప్ను ప్రారంభించింది. అప్పుడు యాప్ కావాల్సి వస్తేనే ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునేవారు. ఇప్పుడు అది తప్పనిసరి అయిపోయింది.
భారతదేశంలో 120 కోట్లకు పైగా మొబైల్ వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ ఇండియా. కాబట్టి ఈ కొత్త నియమం కోట్లాది మంది స్మార్ట్ఫోన్ యూజర్లపై ప్రభావం చూపుతుంది.
ఆపిల్ కంపెనీ తన ఐఫోన్లలో తన యాప్స్ తప్ప ఇతరుల యాప్ను శాశ్వతంగా పెట్టనివ్వదు. అయితే భారత ప్రభుత్వం ఈ యాప్ని తప్పనిసరి చేయడంలో ఆపిల్ దీనికి అంగీకరిస్తుందా లేదా అనేది స్పష్టం కాలేదు. ఇంతవరకూ ఆపిల్ అధికారికంగా స్పందించలేదు. మరోవైపు శామ్సంగ్, గూగుల్, షావోమీ కంపెనీలు కూడా మౌనంగా ఉన్నాయి.
దేశంలో ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ కేసులు, సైబర్ దొంగతనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం సంచార్ సాథి యాప్ ని ప్రజలు తప్పనిసరిగా ఉపయోగించాలని తద్వారా సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కానీ కొందరు ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం వల్ల ప్రజలకు ప్రైవెసీ ఉండదని వాదిస్తున్నారు. మరో 90 రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందనేది చూడాలి.
Also Read: షాకింగ్ ఆఫర్.. రూ.22000 కంటే తక్కువ ధరలో కొత్త ఐఫోన్..