Smartphone Market 2026: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ గణనీయమైన ఒడిదొడుకులను ఎదుర్కొన్నట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ (Counterpoint Research) వెల్లడించింది. మెమరీ చిప్ల ధరలు పెరగడం (BOM inflation), కరెన్సీ హెచ్చుతగ్గుల కారణంగా స్మార్ట్ఫోన్ల ధరలు సగటున 15% పెరిగాయని తన నివేదికలో పేర్కొంది. ఇది స్మార్ట్ ఫోన్ల అమ్మకాలను తీవ్రంగా ప్రభావితం చేసినట్లు తెలిపింది.
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ తొలి త్రైమాసికంలో వివో తన ఆధిపత్యాన్ని చాటుకున్నట్లు పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. మెుత్తం స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో 21% వాటాతో వివో అగ్రస్థానాన్ని దక్కించుకున్నట్లు స్పష్టం చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, కెమెరా ఫీచర్లతో వచ్చిన V సిరీస్ మోడల్స్ వివో విజయానికి కీలకంగా నిలిచాయని తెలిపింది. వీవోతో పోలిస్తే శాంసంగ్ కాస్త డీలా పడి రెండోస్థానంతో సరిపెట్టుకుందని సదరు నివేదిక వెల్లడించింది. శాంసంగ్ తన గెలాక్సీ S26, A-సిరీస్ మోడల్స్ సాయంతో రెండవ స్థానాన్ని సంపాదించిదని వెల్లడించింది.
తొలి త్రైమాసికంలో వివో తర్వాత అందరి దృష్టిని ఆకర్షించిన బ్రాండ్ Nothing అని నివేదిక తెలిపింది. తన వినూత్నమైన డిజైన్స్, Phone (4a) వంటి మోడల్స్తో ఏకంగా 47% వార్షిక వృద్ధిని ఆ సంస్థ నమోదు చేసి మార్కెట్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న బ్రాండ్గా అవతరించింది. ప్రీమియం విభాగంలో ఆపిల్ తన పట్టును నిలుపుకోగా.. గూగుల్ కూడా గత ఏడాది కంటే 39% వృద్ధిని సాధించి ఖరీదైన ఫోన్ల విభాగంలో తన ఉనికిని చాటుకుంది. అయినప్పటికీ మెమరీ ధరలు పెరగడం వల్ల చాలా కంపెనీలు తమ ఫోన్ల ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.
వివో, శాంసంగ్ తర్వాత భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఒప్పో (14%), షావోమి (7.9 %), రియల్ మీ (11%) వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచాయి. షావోమీ సబ్ బ్రాండ్ పోకో వాటా 4.8% వాటాను కలపడం ద్వారా ఆ సంస్థ నాల్గో స్థానంలో నిలబడగలిగింది. మరోవైపు యాపిల్ సంస్థ.. ప్రీమియం సెగ్మెంట్ లో 9 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. ఐఫోన్ 17 సిరీస్ కు మంచి డిమాండ్ లభించడం వల్ల ఐఫోన్ తన ప్రీమియం మార్కెట్ ను నిలబెట్టుకోగలిగిందని నివేదిక పేర్కొంది. మరోవైపు గూగుల్ సైతం రూ.45,000కు పై బడిన ఫోన్ల మార్కెట్ లో 39 శాతం వృద్దితో అదరగొట్టింది. గూగుల్ తీసుకొచ్చిన అధునాతన ఏఐ ఫీచర్ల వల్ల పిక్సెల్ ఫోన్లకు ఆదరణ పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: USB Earphones 2026: యాపిల్, సోనీ, శాంసంగ్.. రూ.2000 లోపు బడ్జెట్లో.. బెస్ట్ ఇయర్ ఫోన్స్ ఇవే!
కాగా మెుబైల్ విడి భాగాలపై పెట్టే ఖర్చు పెరగడం వల్ల దేశంలో వివిధ కంపెనీలకు చెందిన 80కి పైగా మోడల్స్ ధరలు పెరిగాయి. ఇది తొలి త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. అయితే రెండో త్రైమాసికంలోనూ ధరలు మరో 15-20 శాతం పెరగగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేవారి సంఖ్య గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్గా 2026 ఏడాది స్మార్ట్ ఫోన్ మార్కెట్ 10శాతం మేర పతనం కావొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.