Telecom Market: దేశంలోని దిగ్గజ టెలికాం కంపెనీల జాబితాలో భారతీ ఎయిర్ టెల్ (Airtel), రిలయన్స్ జియో (Jio) తొలి రెండు స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే. అవి తమ మార్కెట్ వాటాను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ లాభాల్లో దూసుకుపోతున్నాయి. అయితే వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లను.. ఈ రెండు దిగ్గజ సంస్థలు పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయో రోజుల్లోనూ మరింత మంది వీఐ కస్టమర్లను ఆకర్షించి.. టెలికాం రంగంలో అవి తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే దిశగా పయనిస్తున్నట్లు తాజా సెంట్రమ్ నివేదిక వెల్లడించింది. జియో, ఎయిర్ టెల్ త్రైమాసిక ఆదాయాలు పెరుగుతుంటే.. వీఐ మార్కెట్ వాటా క్షీణిస్తూ వస్తున్నట్లు స్పష్టం చేసింది.
ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ ‘సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్’ (Centrum Institutional Research) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (Q1 FY27) జియో కొత్తగా దాదాపు 70 లక్షల మంది (7 మిలియన్లు) వినియోగదారులను చేర్చుకోనుంది. అలాగే భారతీ ఎయిర్టెల్ సుమారు 50 లక్షల మంది (5 మిలియన్లు) కొత్త చందాదారులను సొంతం చేసుకోబోతోంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా ఈ త్రైమాసికంలో కస్టమర్లను కోల్పోకపోయినప్పటికీ కేవలం 2 లక్షల మంది (0.2 మిలియన్లు) వినియోగదారులను మాత్రమే అదనంగా చేర్చుకోగలదని ఈ నివేదిక అంచనా వేసింది.
కస్టమర్లను కోల్పోవడం కంటే స్వల్పంగానైనా కొత్తవారిని చేర్చుకోవడం వొడాఫోన్ ఐడియాకు కాస్త ఊరటనిచ్చే విషయమే. అయినప్పటికీ ఈ 2 లక్షల మంది కస్టమర్లు కొత్తగా పెరగడం వల్ల సంస్థ ఆదాయంపై ఎలాంటి సానుకూల, చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపబోదని సెంట్రమ్ నివేదిక అభిప్రాయపడింది. కాగా, త్వరలోనే ఈ టెలికాం కంపెనీలు తమ అధికారిక త్రైమాసిక నివేదికలను విడుదల చేయనున్నాయి. దేశంలో 4G, 5G నెట్వర్క్ల వ్యాప్తి వేగంగా పెరుగుతుండటంతో ప్రతి కస్టమర్ ఉపయోగించే డేటా పరిమాణం.. ఈ త్రైమాసికంలోనూ భారీగా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో 5G సేవలను విస్తరించడంలో జియో, ఎయిర్టెల్ సంస్థలు అత్యంత వేగంగా దూసుకుపోతున్నాయి. ఇప్పటికే దేశంలోని 90 శాతానికి పైగా జిల్లాల్లో ఈ రెండు కంపెనీలు తమ 5G సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పుడు కేవలం 5G సేవలు అందించడమే కాకుండా వినియోగదారులకు అత్యుత్తమమైన అనుభవాన్ని (User Experience) అందించడం కోసం ఆయా జిల్లాల్లో 5G కవరేజీని మరింత లోతుగా (Deepening Coverage) అవి విస్తరిస్తున్నాయి.
Also Read: అద్దెకు ‘ప్రేయసి’.. ఒక్కో పనికి ఒక్కో రేటు.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే!
మరోవైపు ఎయిర్ టెల్, జియోకు పూర్తి భిన్నంగా వొడాఫోన్ ఐడియా (Vi) వ్యవహరిస్తోంది. కేవలం పైపైన మాత్రమే (Surface level) కొత్త సైట్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల జియో, ఎయిర్టెల్తో పోల్చితే వీఐ అందించే 5G నెట్వర్క్ నాణ్యత వినియోగదారులకు అంతగా నచ్చకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, రాబోయే రోజుల్లో భారీగా పెట్టుబడులను సమకూర్చుకుని దేశవ్యాప్తంగా 5G కవరేజీని వేగవంతం చేయాలని వీఐ యోచిస్తున్నట్లు సమాచారం.
Also Read: జియో ధమాకా ఆఫర్.. భారీగా ‘ఎక్స్ట్రా డేటా’.. గేమర్స్, యూత్కు పండగే!