Online Shopping Fraud: ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ అందరికీ చాలా సహజమైపోయింది. ఫోన్ మార్చాలన్నా, ఏ వస్తువు కావాలన్నా క్షణాల్లో యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ ఇచ్చేస్తుంటాం. అయితే.. ఒక్కోసారి ఈ ఆన్లైన్ డెలివరీలు ఇచ్చే షాక్లు మామూలుగా ఉండవు. భారీ ధర పెట్టి స్మార్ట్ఫోన్ ఆర్డర్ చేస్తే.. చేతికి ఏదో పనికిరాని వస్తువు రావడం లాంటి సంఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా ముంబైలో ఇలాంటి విచిత్రమైన, చేదు అనుభవమే ఒక వ్యక్తికి ఎదురైంది.
ముంబైలోని పవాయ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి 2023 ఏప్రిల్లో ఫ్లిప్కార్ట్ ద్వారా రూ.1,11,793 విలువైన iPhone 14 Pro ఫోన్ను ఆర్డర్ చేశాడు. ఫోన్ కోసమని నో-కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో డబ్బులు కూడా చెల్లించాడు. ఆ మరుసటి రోజే పార్సిల్ ఇంటికి వచ్చింది. ఎంతో ఆశగా ఆ బాక్స్ను ఓపెన్ చేసిన ఆ వినియోగదారుడికి మైండ్ బ్లాంక్ అయింది. లోపల ఐఫోన్ ఉండాల్సిన స్థానంలో ఒక ‘గడ్డం పెంచే నూనె’ బాటిల్ ప్రత్యక్షమైంది.
బాక్స్ చూసి దిగ్భ్రాంతి చెందిన బాధితుడు వెంటనే ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ను ఆశ్రయించాడు. తనకు వచ్చిన పార్సిల్ ఫొటోలు, అవసరమైన అన్ని ఆధారాలు పంపాడు. రోజుల తరబడి వాళ్లతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. సమస్య తీర్చకపోగా, అతని ఫిర్యాదును పరిష్కరించినట్లుగా చూపిస్తూ ఆర్డర్ను క్లోజ్ చేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు న్యాయం కోసం చివరకు ముంబై అదనపు వినియోగదారుల వివాదాల పరిహార ఫోరాన్ని ఆశ్రయించాడు.
ఈ కేసును విచారించిన ముంబై వినియోగదారుల ఫోరం.. ఫ్లిప్కార్ట్, సెల్లర్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ప్లాట్ఫామ్ ఇచ్చి వస్తువులు అమ్ముకోవడం మాత్రమే కాదు.. కొనుగోలుదారుడికి సరైన వస్తువు చేరేలా చూడాల్సిన బాధ్యత కూడా ఈ-కామర్స్ సంస్థలదేనని స్పష్టం చేసింది. వినియోగదారుడు తప్పుడు వస్తువు వచ్చిందని చెప్పినప్పుడు దాన్ని తనిఖీ చేయకుండా, సమస్యను పరిష్కరించకుండా ఫిర్యాదును క్లోజ్ చేయడం తీవ్రమైన సేవా లోపమని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ కేసులో ఐఫోన్ తయారుచేసిన యాపిల్ ఇండియా కంపెనీ కూడా ఒక ప్రతివాదిగా ఉంది. అయితే, తాము కేవలం రీసెల్లర్లకు ఉత్పత్తులను విక్రయిస్తామని, ప్యాకింగ్ లేదా డెలివరీలో తమకు ఎలాంటి సంబంధం ఉండదని ఈ సంస్థ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన ఫోరం.. లోపమంతా డెలివరీ, ప్యాకింగ్లోనే ఉంది కాబట్టి యాపిల్ కంపెనీకి ఈ వివాదంతో సంబంధం లేదని స్పష్టం చేస్తూ వారిపై ఉన్న ఫిర్యాదును కొట్టివేసింది.
ఈ వ్యవహారంలో ఫ్లిప్కార్ట్, అలాగే సదరు సెల్లర్ ‘ఇంటర్నేషనల్ వాల్యూ రిటైల్’ ఇద్దరిదీ తప్పు ఉందని కోర్టు తేల్చింది. బాధితుడి నుంచి తీసుకున్న రూ.1,11,793 మొత్తాన్ని 9 శాతం వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. దీంతో పాటు వినియోగదారుడికి కలిగించిన మానసిక వేదనకు గానూ రూ.50,000 నష్టపరిహారంగా, కోర్టు ఖర్చుల కింద మరో రూ.20,000 చెల్లించాలని స్పష్టం చేసింది. మొత్తంగా వినియోగదారుడికి సుమారు రూ.1.8 లక్షలకు పైగా పరిహారం అందనుంది.