Indiramma Flats: తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ పరిధిలోనూ నిరుపేదలకు ఇళ్లు కట్టించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో పేదలకు ఆసరాగా నిలిచేలా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
పని ప్రదేశాలకు దగ్గర్లోనే ఇళ్లు
పేదలు తమ ఉపాధి అవకాశాలు కోల్పోకుండా ఉండాలంటే జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఊరికి దూరంగా ఇళ్లు కడితే ప్రజలకు ఉపాధి, రవాణా ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఔటర్ రింగ్ రోడ్ లోపల వివిధ శాఖల వద్ద నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు చెందిన ఖాళీ భూములను ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం వినియోగించాలని నిర్ణయించారు.
తొలి దశలో 7,680 ఫ్లాట్లు
హైదరాబాద్ పట్టణ ప్రాంతాల పరిధిలో తొలి దశగా 17 నియోజకవర్గాల్లో 7,680 ఇందిరమ్మ ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రాజేంద్రనగర్ నుంచి మలక్పేట్ వరకు ఉన్న 17 నియోజకవర్గాల్లో ఈ మొదటి విడత ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతి ఫ్లాట్ మొత్తం 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించనుండగా, అందులో 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా లబ్ధిదారులకు అందుబాటులోకి వస్తుంది.
ఖర్చు వివరాలు, ప్రభుత్వ సబ్సిడీ
ఈ నిర్ణయంతో హైదరాబాద్ నగరంలో ఎప్పటినుంచో సొంతింటి కల కంటున్న వేలాది మంది పేద కుటుంబాల నిరీక్షణ త్వరలోనే ఫలించనుంది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్కో ఇందిరమ్మ ఫ్లాట్ నిర్మాణానికి రూ. 11 లక్షలు వ్యయం అవుతుండగా, అందులో ప్రభుత్వమే రూ. 5 లక్షల సబ్సిడీని అందిస్తోంది. అంతేకాకుండా ఫ్లాట్ల నిర్మాణానికి అయ్యే భూమి ఖర్చును కూడా పూర్తి ఉచితంగా ప్రభుత్వమే భరిస్తుండటంతో, మిగిలిన రూ. 6 లక్షల వాటాను మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి, నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Also Read: ఏపీ ఓటర్ల జాబితాలో సంచలనం.. 44 లక్షల ఓట్లు గాయబ్? నేటి అర్ధరాత్రితో ‘సర్’ ప్రక్రియ క్లోజ్!